బలాలా? బలహీనతలా?
గుంభనంగా ఓటర్లు|VOTERS
తటస్థులతోనే తంటా
BETTING|బెట్టింగులే బెట్టింగులు
సర్వేక్షణలపై సర్వత్రా ఉత్కంఠ!!
పోటీ అభ్యర్థుల మధ్య కాదు, నేతల మధ్యే?
ఒక్కో పార్టీ నుంచి 5వేలకు పైగా బయటి నేతలు
JUBILEE HILLS BY ELECTION|జూబ్లీ ఉప ఎన్నికలో రసవత్తరంగా ప్రచారాలు
నేటి సాయంత్రం 5 గంటలతో ముగియనున్న ప్రచారం
గెలిచి తీరాలని BRS|బీఆర్ఎస్, గెలుపు ఖాయమని కాంగ్రెస్|CONGRESS
డిపాజిట్ దక్కితే చాలన్న దశలో జాతీయ బీజేపీ|BJP
హైదరాబాద్, నవంబర్ 8 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర, దేశ ఎన్నికలను తలపిస్తోంది. ఒక ఉప ఎన్నిక కోసం మూడు ప్రధాన పార్టీలు, రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, శ్రేణులు మోహరించి యుద్ధాన్ని తలపిస్తున్నాయి. అభ్యర్థుల మధ్య ఉండాల్సిన ప్రధాన పోటీ మూడు పార్టీలు, ముఖ్య నేతల మధ్యే నెలకొంది. ఇక నేతల మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి. ఆరోపణల ఆకాశాన్నంటుతున్నాయి. అబద్ధాలు, నిజాలు కలగలిసి వాస్తవాల్ని బలి చేస్తున్నాయి. పార్టీలు, ముఖ్య నేతలు తమతమ బలాల కంటే ఎదుటి వారి బలహీనతల పైనే ఆధారపడి ప్రచారం చేస్తున్నారు. పరస్పరం నిందారోపణలు చేసకుంటున్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని మూడో పార్టీ విమర్శిస్తోంది. మూడు పార్టీలు ఇదే ఆరోణలు చేసుకోవడంతో ఆ పార్టీలు, నేతలంతా ఒక్కటే? అనే అభిప్రాయం అందరికీ కలుగుతోంది. దీంతో ఓటర్లు సైతం బెంబేలెత్తిపోయేంతగా ప్రచారం సాగుతోంది. ప్రచార ముగింపునకు, ఓటింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, ప్రచారం ముమ్మరమవుతోంది. ఇదే సందిట్లో సడేమియాల్లాగా సర్వేలోల్లు చొర్రబడ్డారు. కొన్ని పార్టీలు సొంతంగా చేయించుకున్న సర్వేలను తమకనుకూలంగా వెల్లడిస్తున్నాయి. ఇదో కన్ఫ్యూజన్ కాగా, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు, ఉన్న, లేమి వర్గాలు, పరస్పర విరుద్ధ పార్టీల మధ్య పోటీ కావడంతో బెట్టింగులు కూడా భారీగానే జరుగుతున్నాయి. ఇదేమీ పట్టని ఓటర్లు మాత్రం డబ్బులిస్తేనే అని కొందరు, ఏదో ఆ టైమ్ కు చూద్దాం లే అని మరికొందరు నిర్లిప్తంగా కనిపిస్తున్నారు. మరోవైపు తటస్థంగా ఉండే 15శాతం – 16 శాతం ఓటర్ల మనోగతం తెలియక పార్టీలు, నేతలు ఆందోళన పడుతున్నాయి. ఇదే తరుణంలో నా కొడుకు మరణమే ఓ మిస్టరీ అంటూ గోపీనాథ్ తల్లి ఫిర్యాదు, బీఆర్ఎస్ అభ్యర్థి గోపీనాథ్ లివింగ్ రిలేషన్ లో ఉన్న రెండో భార్య అని కొడుకులతో కూడిన కుటుంబ కథా చిత్రం నడుస్తోంది. ఇక ఓటర్లను ఆకర్షించడానికి నేతల మధ్య బూతు పురాణమే తెరుచుకుంది. ఇంతకీ, ఒక ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్నే సమూలంగా మార్చివేస్తుందన్న వ్యాఖ్యలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తీవ్రతను ఎలుగెత్తుతున్నాయి. అయితే ఈ ఉప ఎన్నిక పార్టీలు, నేతల, రాజకీయాల రాతలు మారుస్తేమో గానీ, సగటు మనిషి, ఓటరు తల రాత మాత్రం మార్చే అవకాశమే లేదని జూబ్లీ హిల్స్ ఓటర్లు గట్టిగా నమ్ముతున్నారు.
లక్షే లక్ష్యం!
4 లక్షలపై చిలుకు ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లల్లో ప్రతిసారీ 2 లక్షల లోపు ఓట్లు మాత్రమే పోలవుతున్నాయి. అంటే కేవలం 50శాతం లోపే. ఇప్పటి వరకు గడిచిన నాలుగు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సాధంచిన అత్యధిక ఓట్లు కేవలం 80వేల పై చిలుకు మాత్రమే.
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో విజేతగా నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పి. విష్ణువర్దన్ రెడ్డికి 54,519 ఓట్లు వచ్చాయి. 2014లో ఎన్నికల్లో విజేతగా నిలిచిన టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కి 50,898 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో విజేతగా నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కి 68,979 ఓట్లు వచ్చాయి. 2023 ఎన్నికల్లో విజేతగా నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కి 80,175 ఓట్లు వచ్చాయి.
అంటే ప్రస్తుత పోటాపోటీలో లక్ష ఓట్లు సాధించిన అభ్యర్థి గెలుపు వాకిట నిలుస్తారు. అందుకే పార్టీలన్నీ ప్రచార పటాటోపం ప్రదర్శిస్తున్నప్పటికీ, ఆ లక్ష ఓట్లే లక్ష్యంగా పని చేస్తున్నాయి. పోల్ మేనేజ్ మెంట్ అంటే డబ్బుల పందేరంగానే మారిన ప్రస్తుత తరుణంలో ప్రధాన పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఓటుకు రెండు నుంచి ఐదు వేల వరకు పంచాలని ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం. అంతేగాక కనీసం లక్ష మందితో ‘నమ్మకంగా’ ఓట్లు వేయించుకోగలిగితే గండం గట్టెక్కినట్లేనని చెప్పుకుంటున్నారు.
బలాలా? బలహీనతలా?
పార్టీలు, నేతలు తాము చేసే మంచిని చూపి, చెప్పి ఓట్లు అడగడం రివాజు. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాత్రం పార్టీలన్నీ ఎదుటి పార్టీల బలహీనతలు, లోపాల మీద మాత్రమే అధారపడ ప్రచారం చేశాయి. తమ బలాన్ని నమ్ముకోవడం కంటే బలహీనతల మీదే ఆధారపడటం వల్ల ఓటర్లకు రాజకీయ పార్టీలు తమకేమీ చేయలేవన్న నమ్మకం కుదిరింది. అయితే, వక్త ఆనే పర్ ఓట్ దాల్నా పడ్తా కాబట్టి, సమయం వచ్చినప్పుడు ఓటు వేద్దాం. చూద్దామనే ధోరణి అక్కడి ఓటర్లలో నెలకొంది. అందుకే ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువగా ఉంటోంది. ఇదంతా చోద్యం చూస్తున్న ఓటర్లు గుంభనంగా ఉన్నారు.
తటస్థులతోనే తంటా?
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తటస్థ ఓటర్లు 15శాతం వరకు ఉంటారని అంచనా, పోటాపోటీ నెలకొన్న తరుణంలో ఆ ఓటర్లే కీలకం. కాబట్టి, వారి మొగ్గు ఎటు ఉంటే అటే గెలుపు అవకాశాలుంటాయని నేతలు భావిస్తున్నారు. వాళ్ళని ఎలా డీల్ చేయాలో తెలియక, రకరకాల ప్లాన్లు వేస్తున్నారు.
బెట్టింగులే బెట్టింగులు
బయటకు పెద్దగా కనిపించకపోయినా, జూబ్లీపై బెట్టింగులు జోరుగానే సాగుతున్నాయని నిఘా వర్గాల సమాచారం. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ఓటర్లు అక్కడ కీలకంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. కాగా, కాస్త పలుకుబడి, డబ్బున్న ఓటర్లు కూడా ఉన్న, పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలోనే బెట్టింగులు ఊపందుకున్నాయని తెలుస్తోంది.
సర్వేక్షణలపై సర్వత్రా ఉత్కంఠ!!
సర్వేక్షణలు ఓటర్ల నాడీని పూర్తిగా పట్టలేకపోయాయి. స్వతంత్రంగా చేసిన సర్వేలకు కూడా ఓటర్ల నాడీ అంతుచిక్కలేదు. పార్టీలు చేయించుకున్న సర్వేలను స్థానిక ప్రజలే నమ్మే స్థితిలో లేవు. చాలా ముందుగా చేసిన సర్వేలు, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా, కొన్ని పార్టీలకు మద్దతుగా వచ్చినవేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సర్వేలు, గెలుపోటముల మధ్య 5శాతం ఓట్ల తేడాను చూపిస్తుండగా, స్థానికంగా ప్రచారం చేస్తున్న నేతలు, శ్రేణుల అభిప్రాయాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఓటర్లు బయట పడలేదన్నది తిరుగులేని వాస్తవం కాగా, ఎవరికి నచ్చిన విధంగా వారు సర్వేల రిపోర్టులనిచ్చారు. దీని వల్లే ఏదో ఒక ఫలితమైతే ఉంటుంది కదా? అటు ఇటో అన్నట్లుగానే సర్వేక్షణలున్నాయని ప్రచారంలో ఉన్న శ్రేణులంటున్నాయి. పోటీ మాత్రం పోటాపోటీగానే ఉందని వారి అభిప్రాయం.
పోటీ అభ్యర్థుల మధ్య కాదు నేతల మధ్యే?
సాధారణంగా పోటీ అభ్యర్థల మధ్యే ఉండాలి. కానీ జూబ్లీ ఉప ఎన్నకల్లో అభ్యర్థులు కనిపించకుండా పోయారు. వారి వాణీ, బాణీ కూడా వినిపించలేదు. ప్రధాన పార్టీల నేతలే ముఖ్యంగా పని చేశారు. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీశ్ రావులు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లే ప్రచారాన్నంతా మోశారు. దీంతో ప్రజలు ఎన్నుకోవాల్సిన అభ్యర్థులు కనుమరుగయ్యారు.
మరోవైపు పార్టీల నేతలు అభ్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దీంతో దాదాపు ఓటమి భయమున్నప్పుడే ఇలా జరుగుతుంది. ప్రజాస్వామిక పద్ధతుల్లోనే గాకుండా, మిగతా అన్ని పద్ధతుల్లోనూ అవసరమైతే, అననుచిత దారుల్లోనూ గెలవాలని పార్టీలు, ముఖ్య నేతలు తెగబడి ప్రచారం చేశారన్నది గత ప్రాచారాన్ని బట్టి అర్థమవుతోంది.
ఒక్కో పార్టీ నుంచి 5వేలకు పైగా బయటి నేతలు
ఒక్కో పార్టీ నుంచి కనీసం 5వేల చొప్పున, 15 నుంచి 20వేల మంది బయటి నేతలు, వారి అనుచరులు, పార్టీ శ్రేణులు జూబ్లీని మోహరించారు. దీంతో ప్రచారం తీవ్రంగా మారింది. ప్రచారకుల హంగామాతో ఓటర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. హోటళ్ళు, లాడ్జీలు, టీ కొట్లు, హాస్టళ్ళు, రోడ్లు బిజీబిజీగా మారాయి. వాటికి మంచి గిరాకీలు పెరిగాయి. ఇవన్నీ ఓట్లను రాలుస్తాయా? గెలుపును సాధిస్తాయా? ఓటర్లు ఏమనుకుంటున్నారు? ఎవరిని గెలిపిస్తారన్నది 11వ తేదీన పడే ఓట్లను, వాటిని వేసే ఓటర్ల మనోగతాన్ని బట్టి తీర్పు ఉంటుంది. పార్టీలు, నేతల భవితవ్యం తేలుతుంది. అప్పటి దాకా జూబ్లలో ప్రజలంతా ఓ రాజకీయ వేడుక ముగింపు దశకు చేరింది.

