Child Friendly court| చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రవేశ పెట్టిన ఘనత మా Government| ప్రభుత్వానిదే.
-సీఎం రేవంత్ రెడ్డి|CM REVANTH REDDY
VOICE FOR THE VOICELESS| వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ అనే నినాదంతో ఏర్పాటు చేసిన STATE LEVEL| రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, తమ బాధను వెలికితీయలేని బాలల కోసం ఇలాంటి చర్చా వేదికలు ఈ కాలంలో అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులు, శారీరక మరియు మానసిక హింసలను అరికట్టేందుకు సమిష్టిగా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని నిర్వహించిన తెలంగాణ పోలీసు శాఖను, ఇతర నిర్వాహకులను సీఎం అభినందించారు.
బాలల రక్షణకు తన ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని స్పష్టంచేసిన ముఖ్యమంత్రి, బాలికల సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన భరోసా ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 29 భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఇవి పోలీస్ సహాయంతో పాటు న్యాయ సహాయం, వైద్య సేవలు, కౌన్సెలింగ్ వంటి బహుముఖ సేవలను అందిస్తున్నాయని వివరించారు. హైదరాబాద్లోని భరోసా కేంద్రం ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు.
పోక్సో చట్టం, జ్యువెనైల్ చట్టాలు మనం సాధించిన ప్రగతిని సూచించే గొప్ప పద్ధతులుగా ఉన్నాయని వ్యాఖ్యానించిన సీఎం, కానీ వాటి అమలులో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. బాధితుల భవిష్యత్తుకు ప్రమాదం కలగకుండా, చట్టాలు సంపూర్ణ రక్షణగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నేరాల నియంత్రణకే కాదు, బాధితుల భద్రతకు, పునరావాసానికి సమగ్రమైన చర్యలు అవసరమని స్పష్టంచేశారు.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా పిల్లలపై జరుగుతున్న దురాగతాలను తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి, ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. దోషులకు ఎలాంటి రాయితీ ఇవ్వకుండా, కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అవసరమైన విధానాలను సిద్ధం చేయడంలో ముందుండుతుందని పేర్కొన్నారు.
న్యాయం అంటే కేవలం కోర్టుల వరకే పరిమితం కాకూడదని, ప్రతి దశలోనూ, ప్రతి స్థాయిలోనూ పిల్లలకు న్యాయం లభించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. పోలీస్ స్టేషన్లు, బాలల సంక్షేమ కేంద్రాలు కలిసి పని చేస్తేనే న్యాయవ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందని అన్నారు.
చివరగా గౌరవ న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, బాలల సంక్షేమ కమిటీలు, అభివృద్ధి భాగస్వామ్య సంస్థలందరినీ కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయం అంటే శిక్షలు విధించడమే కాదు… బాధితుడి జీవితానికి భరోసా కల్పించడమే అసలైన న్యాయం అని స్పష్టం చేసిన సీఎం, పిల్లలు తమ బాల్యాన్ని తిరిగి పొందేలా ప్రతి చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు.

