మొత్తం ప్రపంచ పాల ఉత్పత్తిలో 25% భారత్ లోనే జరుగుతున్నది. దేశంలో 91వేల కోట్ల లీటర్ల పాలు అవసరముండగా, 23వేల 930 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. తేడా 67 వేల కోట్లకు పైగా లీటర్లు. గత పదేళ్ళల్లో పాల ఉత్పత్తి కేవలం 6% పెరగగా, వినియోగం మాత్రం 64% పెరిగింది. ఉత్పత్తి,వినియోగాల మధ్య ఈ భారీ తేడానే పాల కల్తీకి కారణమవుతోంది. ప్రజావసరాలను సొమ్ముచేసుకునే నకిలీలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఆ పాలే ప్రజల పాలిట కాలకూట విషంగా మారుతున్నాయి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
పాలను స్వచ్ఛతకు, పోషకానికి ప్రతీకగా చూస్తాం. ప్రతి ఇంటి రోజువారీ ఆహారంలో పాలు ప్రాథమిక ఆవశ్యం. అనివార్యం. మరి పాలే కల్తీకి గురై ప్రాణాంతకమవుతుంటే ప్రజలకు దిక్కేది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు మరణించడం, మరికొందరు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్స్ లో చికిత్స పొందడం రాష్ట్రాన్ని కలవరపరుస్తోంది. ఒకే చోట పాలు కొనుగోలు చేసిన వారిలో అనూరియా లక్షణాలు అంటే మూత్రం ఆగిపోవడం, బయటపడటం, అర్థాంతరంగా కిడ్నీలు ఫెయిల్ కావడంతో కొందరికి డయాలసిస్ అవసరం కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
పాలే ప్రజల పాలిట కాలకూట విషమవడం అత్యంత దారుణం.ప్రాథమిక విచారణలో ప్రైవేట్ డెయిరీ నుంచి సరఫరా అయిన పాలే అస్వస్థతకు కారణమని తేలింది. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. బాధితుల వైద్య ఖర్చులను భరించనున్నట్టు హామీ ఇచ్చింది.
మొత్తం ప్రపంచ పాల ఉత్పత్తిలో 25% భారత్ లోనే జరుగుతున్నది. దేశంలో 91వేల కోట్ల లీటర్ల పాలు అవసరముండగా, 23వేల 930 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. తేడా 67 వేల కోట్లకు పైగా లీటర్లు. గత పదేళ్ళల్లో పాల ఉత్పత్తి కేవలం 6% పెరగగా, వినియోగం మాత్రం 64% పెరిగింది. ఉత్పత్తి,వినియోగాల మధ్య ఈ భారీ తేడానే పాల కల్తీకి కారణమవుతోంది. ప్రజావసరాలను సొమ్ముచేసుకునే నకిలీలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఆ పాలే ప్రజల పాలిట కాలకూట విషంగా మారుతున్నాయి. కాగా, పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ (16.21%), రాజస్థాన్ (14.51%), మధ్యప్రదేశ్ (8.91%), గుజరాత్ (7.65%), మహారాష్ట్ర (6.71%) అగ్రస్థానంలో ఉన్నాయి.
పాల కల్తీ కొత్తేమీ కాదు. ఒకప్పుడు పాలల్లో నీళ్లు కలపడం పెద్ద నేరంగా పరిగణించేవారు. ఇప్పుడు యూరియా, ఫార్మలిన్, గ్లూకోజ్, సోడా, సింథటిక్ పదార్థాలు, గంజి పొడి లాంటి ప్రాణాంతక ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు. ఇక రెండు లీటర్ల పాలను అయిదారు లీటర్లుగా మార్చే దందా వెలుగులోకి వస్తోంది. నిల్వ కోసం వాడే ఫార్మలిన్ తో జీర్ణకోశం దెబ్బతింటుంది. చిక్కదనం కోసం యూరియా కలపడం మూత్రపిండాలకు ముప్పు. ఇలాంటి కల్తీ వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడమే కాక, కిడ్నీ ఫెయిల్యూర్ వరకు పరిస్థితి దిగజారుతుంది.
ఈ దురవస్థకి కారణాలు అనేకం. రాష్ట్రంలో పాల ఉత్పత్తి–వినియోగం మధ్య భారీ తేడా ఉంది. అవసరాలకు సరిపడా ఉత్పత్తి లేక కొందరు అక్రమాలకు దిగుతున్నారు. ప్రైవేట్ డెయిరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం, వాటిపై నియంత్రణ, నిఘా పర్యవేక్షణ లేకపోవడం సమస్యను మరింత తీవ్రచేస్తోంది. సహకార రంగం బలహీనపడటంతో డెయిరీల మధ్య అనారోగ్య పోటీ నెలకొంది. లాభాల కోసం అడ్డదారులు తొక్కే దరిద్రం దాపురించింది.
ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ నిర్వీర్యమైంది. సమర్థవంతమైన పరీక్షా ప్రయోగశాలలు ఉన్నాయా? పాల నమూనాలను తరచుగా తనిఖీ చేస్తున్నారా? లైసెన్స్ లేని డెయిరీలు ఎందుకు నడుస్తున్నాయి? తనిఖీ బాధ్యతను ఆయా శాఖలకు వదిలేయడం సరైన విధానం కాదు. ప్రజారోగ్యం పరిరక్షణ పూర్తిగా ప్రభుత్వ బాధ్యత.
పాడి పంట గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకం. కష్టపడి పాలను ఉత్పత్తి చేసే రైతుకు గిట్టుబాటు ధర దక్కకపోవడం మరో సమస్య. రైతు వద్ద తక్కువ ధరకు సేకరించిన పాలను మధ్యవర్తులు అధిక లాభాలతో విక్రయిస్తున్నారు. ఉత్పత్తి స్థాయిలో పారదర్శకత లేకపోవడం, సరఫరాలో పర్యవేక్షణ లోపాలు కల్తీకి కారణమవుతున్నాయి. పాడిపశువుల సంఖ్య, ఉత్పత్తి పరిమాణం, సరఫరాలపై సమగ్ర సమాచారం, లెక్కలు లేకపోవడం కూడా లోపమే.
తనిఖీలు నిర్వహించి లైసెన్స్ లేని కేంద్రాలను మూసివేయాలి. పాల ఉత్పత్తి నుంచి వినియోగదారు వరకు సరఫరాలపై పూర్తి అవగాహన, పాదర్శకతతో కూడిన వ్యవస్థను అమలు చేయాలి. ఆధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేసి, తరచూ తనిఖీ పరీక్షలు నిర్వహించాలి. కల్తీ పాల తయారీని తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన శిక్షలు విధించాలి. సహకార డెయిరీలను బలోపేతం చేసి రైతు ఆధారిత పారదర్శక వ్యవస్థను పునరుద్ధరించాలి.
అలాగే పాలు-కల్తీపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ఇంటి వద్దే సాధ్యమయ్యే ప్రాథమిక పరీక్షలపై చైతన్యం చేయాలి. అనుమానాస్పద, కల్తీ పాలపై వెంటనే ఫిర్యాదు చేసే హెల్ప్ లైన్లు అందుబాటులో ఉండాలి. అధిక పాల ఉత్పత్తికి పశువులకు ఇచ్చే ఆక్సిటోసిన్ వంటి నిషేధిత ఇంజెక్షన్ల వినియోగంపై కఠిన నిఘా పెట్టాలి.
పాలు ఒక్క రాజమండ్రిలో మాత్రమే కాదు. అంతటా కల్తీ అవుతున్నాయి. కాకపోతే, రాజమండ్రి ఘటన వెలుగులోకి వచ్చిన ఒక హెచ్చరిక. నమ్మకమైన పాలను సరఫరా చేయడం ప్రభుత్వ బాధత. సమాజ హితం. లాభాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టే పాల కల్తీగాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలి.

