సాంకేతికత ఒక సాధనం మాత్రమే. అది రైతు ప్రయోజనానికి ఉపయుక్తంగా ఉండాలి. యాప్ ఆధారిత యూరియా సరఫరా విధానం సరైన సవరణలతో, మానవీయ దృష్టితో అమలైతే వ్యవసాయ రంగానికి నిజమైన మేలు చేకూరుతుంది. లేదంటే అది రైతుల అసహనానికి, ఆగ్రహానికి, వ్యవసాయంపై నమ్మకం కోల్పోయే పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
వ్యవసాయ రంగంలో పారదర్శకత తీసుకురావడం, ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టడం, నిజమైన రైతుకు సరైన సమయంలో సరైన పరిమాణంలో యూరియా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘యాప్’ ఆధారిత యూరియా సరఫరా విధానాన్ని అమలు చేస్తోంది. సిద్ధాంతపరంగా ఇది ప్రశంసనీయమైన చర్యే. గతంలో యూరియా కొరత, బ్లాక్ మార్కెట్, దళారుల మాయ, పొరుగు రాష్ట్రాలకు అక్రమ రవాణా వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఈ నేపథ్యంలో రైతు వివరాలు, భూమి విస్తీర్ణం, పంట రకం ఆధారంగా యాప్లో నమోదు చేసి యూరియా పంపిణీ చేయడం వల్ల నియంత్రణ సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అనుభవాలు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ లేని, యాప్ వినియోగంపై అవగాహన లేని వృద్ధ రైతులు, నెట్వర్క్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. యాప్లో పేరు నమోదు అయినప్పటికీ సర్వర్ డౌన్, బయోమెట్రిక్ పని చేయకపోవడం, డేటా తప్పిదాలు వంటి కారణాలతో యూరియా అందక రైతులు రోజులు తరబడి దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా ఈ యాప్ పై సరైన ప్రచారం లేకపోవడంతో, యాప్ విషయం తెలియని రైతులు నేరుగా ఎరువుల దుకాణాలకు వెళ్ళి, వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. యాప్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు. ఎవరిని సంప్రదించాలో అర్థం గాక అయోమయంలో పడుతున్నారు.
వ్యవసాయం కాలపరిమితితో కూడిన వృత్తి. విత్తే సమయానికి యూరియా అందకపోతే పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సాంకేతికత రైతుకు సేవ చేయాలి. సాయమందించాలి. కానీ రైతును శిక్షించే ఆయుధంగా మారకూడదు. ఈ కనీస భావన, అవగాహనను పాలకులు, ప్రత్యేకించి విధాన నిర్ణయాల్లో కీలకంగా అమలు చేసే ఉన్నతాధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో రైతాంగం సమస్యలపై అవగాహన లేకపోతేనే ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయి.
యాప్ విధానం వల్ల కొంతవరకు దళారుల నియంత్రణ తగ్గింది అన్న వాదన కూడా ఉంది. కానీ అదే సమయంలో వ్యవసాయ సహకార సంఘాల వద్ద పని భారం పెరగడం, సిబ్బంది కొరత, రైతుల ఆగ్రహం వారిపైనే పడటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. యాప్లో నమోదైన భూమి వివరాలు వాస్తవ పరిస్థితులకు సరిపోకపోవడం, కౌలు రైతుల పేర్లు లేకపోవడం కూడా పెద్ద లోపమే. కౌలు రైతులు యూరియా కోసం యజమాని మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతోంది.
యాప్ ద్వారానే యూరియా సరఫరా కొనసాగాలంటే కొన్ని కీలక మార్పులు అవసరం. ముందుగా గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా నమోదు, సవరణల సౌకర్యం కల్పించాలి. నెట్వర్క్ సమస్య ఉన్న ప్రాంతాల్లో ఆఫ్లైన్ విధానాన్ని అనుమతించాలి.
అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులకు తాత్కాలిక వెసులుబాటు ఇవ్వాలి. కౌలు రైతుల గుర్తింపునకు ప్రత్యేక విధానం తీసుకురావాలి. యాప్పై ఆధారపడటమే లక్ష్యంగా కాకుండా, రైతుకు సమయానికి ఎరువు అందడమే ప్రధాన ప్రమాణంగా ప్రభుత్వం వ్యవహరించాలి.
సాంకేతికత ఒక సాధనం మాత్రమే. అది రైతు ప్రయోజనానికి ఉపయుక్తంగా ఉండాలి. యాప్ ఆధారిత యూరియా సరఫరా విధానం సరైన సవరణలతో, మానవీయ దృష్టితో అమలైతే వ్యవసాయ రంగానికి నిజమైన మేలు చేకూరుతుంది. లేదంటే అది రైతుల అసహనానికి, ఆగ్రహానికి, వ్యవసాయంపై నమ్మకం కోల్పోయే పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉంది. రైతు కేంద్రంగా ఆలోచిస్తేనే యాప్ ఆధారిత యూరియా సరఫరా విధానం విజయవంతమవుతుంది.

