ఇటీవలి అమెరికా ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ శాంతి ప్రవచనాలు పలికారు. అధ్యక్షుడిగా గెలిచాక ఆ మాట మరిచారు. ఒక దేశాన్ని ఎగదోస్తూ, మరో దేశాన్ని దిగదోస్తూ దొంగ దోస్తీ మాటలు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో రెండు యుద్ధాలు కొనసాగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ అపక పోగా, రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు అమెరికా ఆయుధాలను అందిస్తోంది. అలాగే పాలస్తీనాపై ఇజ్రాయిల్ విరుచుకు పడుతోంది. పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయిల్కు ప్రత్యక్ష మద్దతునిస్తోంది. ఒక దేశంపై దాడి చేస్తున్న దేశానికి మద్దతుగా నిలిచి శాంతి శాంతి అనడం దేనికి సంకేతం? ఇజ్రాయల్ హమాస్ ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఏమాత్రం ప్రయత్నించని ట్రంప్, ఇదే తరహా ఉగ్రవాదంపై భారత్ యుద్ధం చేస్తుంటే, పాక్ కు మద్దతుగా నిలవడంలో అర్థమేంటి? అంటే అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు నమ్మదగిన మిత్ర దేశం, మిత్రుడు కాదనే కదా? అర్థం.
నిజానికి భారత్ -పాక్ మధ్య అసలు యుద్ధమే మొదలు కాలేదు. కేవలం ఉగ్రవాదం లక్ష్యంగా కాల్పులు మాత్రమే జరుగుతున్నాయి. భారత్పై ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరివేత కోసం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. వందమంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అందులో భారత్ కోరుతున్న ఉగ్రవాదులు కూడా ఉన్నారు. కానీ ఎక్కడా జనావాసాలు లక్ష్యంగా దాడులకు దిగలేదు. కానీ పాకిస్తాన్ జనావాసాలు లక్ష్యంగా భారత్ పై దాడులకు తెగబడింది. దీంతో భారత్ పాక్ దాడులను తిప్పి కొడుతూనే, ప్రతి దాడులు చేసింది. యుద్ధం ప్రస్థావనే లేదు. అయితే, ట్రంప్ ఇరు దేశాల్లో జోక్యం చేసుకుని యుద్ధ నివారణకు చర్యలు తీసుకున్నానని ప్రకటించుకున్నారు. పాక్ ఉగ్రవాదంతో అమెరికా కూడా నష్టపోయింది. ఈ తరుణంలో పాక్కు ఐఎంఎఫ్ రుణం ఇప్పించాల్సిన అవసరం ఏముంది?
కశ్మీర్, భారత్ గురించి మాట్లాడే సమయంలో చరిత్ర కూడా తెలియకుండా ట్రంప్ అతి తెలివితో వ్యవహరించారు. కశ్మీర్ సమస్య వెయ్యేళ్ల నుంచి ఉందంటూ తన డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారు. నిజానికి కశ్మీర్ సమస్య పరిష్కరించాలని భారత్ ఏనాడూ ఎవ్వరినీ కోరలేదు. చివరకు ట్రంపును కూడా. అయితే, తమ జోక్యంతోనే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ సాధించామంటూ గొప్పలు చెప్పుకున్న ట్రంప్..అమెరికా అసలు లక్ష్యమేంటో ఆదివారం మరో ప్రకటన ద్వారా వెల్లడించారు. కేవలం తన వాణిజ్య అవసరాల కోసం పాక్, భారత్లను వాడుకుంటానని చెప్పినందున మనం ట్రంప్ వ్వయహారశైలి పైనా అప్రమత్తంగా ఉండాల్సిందే. మధ్యవర్తిత్వం పేరిట జోక్యాన్ని పెంచుకొని అనేక దేశాల మధ్య ఆరని చిచ్చులు, ఘర్షణలు రాజేసిన అమెరికా ఇప్పుడు భారత్, పాక్ విషయంలోనూ అదే ప్రయత్నం చేస్తోందని గుర్తించాలి.
భారత్-పాకిస్తాన్ వివాదం గురించి ట్రంప్ తప్పుగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో పాక్ అప్పటి ప్రధాని ఇమ్రాన్ఖాన్తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ, కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించడానికి సహయం చేయమని ప్రధాని మోడీ అభ్యర్థించారని బుకాయించారు. అప్పట్లోనే భారత్ పార్లమెంట్లో దీన్ని ఖండించింది. ఇలాంటి అబద్ధాలకోరు అమెరికాకు మరోమారు అధ్యక్షుడయ్యాక ఇటీవల అనేక గందరగోళ చర్యలు తీసుకున్నారు. దీంతో అమెరికాలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు. ట్రంప్ తీరును దుయ్యబట్టారు.
ట్రంప్ చెప్పాడని పాక్ను నమ్మితే నట్టేట మునిగినట్లేనని భారత్ గుర్తించాలి. పహల్గాంలో భారత మహిళల సిందూరాన్ని నేలరాల్చిన పాక్ ముష్కరుల స్థావరాలపై భారత సైనిక, వైమానిక, రక్షణ దళాలు మూకుమ్మడిగా క్షిపణులతో అగ్నివర్షం కురిపించాయి. లక్ష్యాలను ఛేదించడంలో, శత్రు స్థావరాలను నేలమట్టం చేయడంలో మన సైనిక దళాల పాటవానికి ’సిందూర్’ నిలువుటద్దంగా నిలిచింది. ఒకేసారి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై గురిపెట్టి గట్టిగా చావుదెబ్బ కొట్టడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అయింది. మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. అలాగే పాక్ కు అమ్మిన చైనా, అమెరికా ఆయుధాలు ఎలా పేలిపోయాయో చూశాం. ఎఫ్-16లను కూడా మన వాయుసేన కుప్పకూల్చింది. భారత్ ఎంచుకున్న 9 లక్ష్యాల్లో ఐదు పాక్ భూభాగంలో, నాలుగు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి. అక్కడి ప్రజలకు, ఆస్తులకు నష్టం జరగకుండా కేవలం ఉగ్ర మూలకనే మట్టు పెట్టింది. తమ వాళ్లు 14 మంది భారత్ దాడుల్లో మరణించినట్టు- జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. కాగా, భారత్ ఆయుధ సంపత్తి ముందు అమెరికా, చైనా ఆయుధాలు తుపాస్ అయ్యాయి. మరోవైపు ఈ దాడులతో యుద్ధంలో భారత్ పరిణతి అందరినీ ఆశ్యర్య పరచింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే, లేని పెత్తనాన్ని నెత్తినెత్తుకుని పేనుకు పెత్తనమిస్తే, నెత్తంతా కొరిగినట్లుగా, ట్రంప్ భారత్ పాక్ ల మధ్య మధ్యవర్తిత్వ పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
అప్పులివ్వడం, ఆయుధ వ్యాపారాన్నే నమ్ముకున్న అమెరికాకు పాక్ దైన్యం అందివచ్చినట్లయింది. పైగా భారత్ దాడితో దిమ్మతిరిగి మైంగ్ బ్లాక్ అయిన పాక్, అమెరికా కాళ్ళుపట్టుకుంది. దీంతో ఇప్పటికే పాక్ కు ఐఎంఎఫ్ ద్వారా అప్పు ఇప్పించింది. ఆయుధాలు అందిస్తున్నది. ఇప్పుకు తమ వ్యాపారం కోసం పాక్ ను రక్షించేందుకు మధ్యవర్తిత్వం పేరుతో ప్రయత్నాలు చేస్తున్నది. దీన్ని ఇప్పటికే భారత్ గట్టిగా తిప్పి కొట్టింది. భారత ప్రధాని మోడీ సైతం తాము ఎవరి జోక్యాన్నీ అంగికరించబోమని, ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందని, పాక్ కు తగిన బుద్ధి చెబుతామని, యుద్ధం ఆగలేదని, పాక్ మనుగడ దాని ఉగ్రమూలాలను విడిచి పెట్టడంలోనే ఉందని తీవ్రంగానే హెచ్చరించారు. అందుకే పాక్ లాగే అమెరికా కూడా నమ్మదగిన మిత్ర దేశం కాదు.

