DISCPLINE|క్రమశిక్షణ కమిటీకే తప్పుడు నివేదిక!
అన్ని పార్టీలు మారింది ఆ కుటుంబమే
‘కొండ’పై NAINI|నాయిని ఇంట్లో సుదీర్ఘంగా చర్చించిన CONGRESS|కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
వరంగల్, మే 30 (అడుగు న్యూస్):
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తప్పుడు సమాచారం ఇచ్చారని, షోకాజ్ నోటీసు ఇచ్చినందుకు హాజరై నన్నెవ్వరూ పిలవలేదంటూ అబద్ధాలు చెబుతున్నారని, పార్టీ మారలేదని చెబుతున్న కొండా కుటుంబానిది అన్ని పార్టీలు మారిన చరిత్ర అని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య విమర్శించారు. ‘కొండ’ వ్యవహారంపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అధిష్టానం డెడ్ లైన్ గా విధించిన 5వ తేదీ వరకు వేచి ఉండాలని నిర్ణయించారు.
అనంతరం మీడియాతో బస్వరాజు సారయ్య మాట్లాడుతూ, 38 ఏళ్లుగా కాంగ్రెస్ను బతికించానంటూ కొండా మురళి చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలన్నారు. కొండా కుటుంబానికి టీడీపీ రాజకీయ జన్మనిస్తే, తర్వాత కాంగ్రెస్, ఆతర్వాత వైఎస్సార్ సీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లకు మారారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వారు, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను గెలిపించామనడం హాస్యాస్పదం అన్నారు. గతంలో సోనియా గాంధీని బూతులు తిట్టిన వ్యక్తి ఇప్పుడు పార్టీ సేవలు, పార్టీ నాయకత్వంపై గురించి మాట్లాడటం దారుణం. క్రమశిక్షణ కమిటీపై కూడా కొండా కుటుంబానికి గౌరవం లేదు. కొండా పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలి. ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీ నాయకత్వాన్ని తిట్టడం ఈ కుటుంబానికి అలవాటైంది” అంటూ ధ్వజమెత్తారు. జూలై 5 వరకు కాంగ్రెస్ అధిష్టానం కొండా మురళిపై తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తాం. పార్టీ డిసిప్లిన్కు మించి ప్రవర్తించే వారిని సహించలేమంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
‘తూర్పు’ అసెంబ్లీలో రూ.70 కోట్లు ఖర్చా?
స్వయంగా వెల్లడించిన కొండా మురళి
వివాదాస్పదమవుతోన్న మంత్రి కొండా సురేఖ భర్త వ్యాఖ్యలు
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక్క వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి కొండా సురేఖ రూ.70 కోట్లు ఖర్చు పెట్టారా? అంటే అవుననే సమాధానం వేరే ఎక్కడి నుంచో రావడం లేదు. స్వయంగా ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ నోటి నుండే వెలువడ్డాయి. ఇప్పుడు అవే వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. నిన్న వరంగల్ లో జరిగిన ఒక సమావేశంలో మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరినీ ఆశించలేదన్నారు. ‘మా నాన వతన్ దార్. ఇంకా 500 ఎకరాల ఉన్నది నాకు. 70 కోట్లు ఖర్చు పెట్టిన. మీకందరికీ తెలుసు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి. వివాదాస్పదమవుతున్నాయి. రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలను తూలనాడిన ఘటన, ఆ ఘటనపై వివరణ ఇవ్వడానికి గాంధీ భవన్ కు వెళ్ళి క్రమశిక్షణా కమిటీకి ఇచ్చిన 6 పేజీల ఫిర్యాదు, ఆ తర్వాత బయట మీడియాతో మాట్లాడుతూ నన్ను రెచ్చగొట్టొద్దంటూ చేసిన ఘాటైన మాటలు మరచిపోక ముందే తాజా వ్యాఖ్యలు ఇప్పటికే ఉన్న వివాదాలకు ఆజ్యం పోసినట్లయింది. కొండా మాటలను తీవ్రంగా పరిగణిస్తున్న ఆయన ప్రత్యర్థులు ఆయన సతీమణి, మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ కు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయండి!
శాసన సభ్యత్వాన్ని రద్దు చేయండి
సుమోటోగా స్వీకరించి, విచారించాలని బీజేపీ డిమాండ్
ఎన్నికల నియమాళికి విరుద్ధంగా గత అసెంబ్లీ ఎన్నికలో తూర్పు నియోజకవర్గం నుంచి తన సతీమణి, ప్రస్తుత మంత్రి కొండా సురేఖను రూ.70 కోట్లు పెట్టి, గెలిపించానని ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్వయంగా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కోర్టు, ఎన్నికల కమిషన్ విచారించాలని, ఆమెను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, ఆమె శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని గత ఎన్నికలో ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు డిమాండ్ చేశారు. కొండా సురేఖ తమ అఫిడవిట్ లో తన పేరు మీద ఒక ఎకరం, తన భర్త కొండా మురళి పేరున 13.31 ఎకరాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారన్నారు. కానీ ప్రస్తుతం కొండా మురళి తమకు 500 ఎకరాలున్నట్లు చెప్పారన్నారు. అందులో 16 ఎకరాలమ్మి రూ. 70 కోట్లు ఖర్చు చేశానని చెప్పారని పేర్కొన్నారు. 16 ఎకరాలు అమ్మితే రూ.70 కోట్లు వచ్చాయా? ప్రభుత్వానికి పన్ను కట్టారా? మొత్తానికి కొండా మురళి వ్యాఖ్యలతో సురేఖ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని తేలిందన్నారు. అంతేగాక రూ.70 కోట్లు ఖర్చు చేశామని చెప్పడం ద్వారా ప్రజల్ని కూడా అవమానించారని, ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని అన్నారు. ఈ ఆధారాలతో తాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, కోర్టులోనూ ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నైతిక బాధ్యత వహించి, కొండా సురేఖ తమ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. లేదంటే సీఎం తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

