-‘నవాం’శతో నెగ్గిన నవీన్ యాదవ్
-జూబ్లీ హిల్స్ లో పాగా వేసిన కాంగ్రెస్
-హైదరాబాద్ లో బోణీ కొట్టిన హస్తం
-ప్రత్యామ్నాయంగా నిలిచిన బీఆర్ఎస్
-డిపాజిట్ కోల్పోయి డీలాపడిన బీజేపీ
రాష్ట్రంలో 25శాతం జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. బీఆర్ఎస్ మరో సీటుకు గండి కొట్టింది. రాజధాని పై పట్టు బిగించింది. జూబ్లీ హిల్స్ లో పాగా వేసింది. కమ్మల కంచుకోటలో బీసీని గెలిపించింది. భాగ్య నగరంలో ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్ లో జూబ్లీ హిల్స్ సీటు కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయంగా నిలిచింది. డిపాజిట్ ను కూడా కోల్పోయిన బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న అపవాదును మూటగట్టుకుంది.
హైదరాబాద్, నవంబర్ 14 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీలో ఊపునిచ్చింది. కొత్త ఉత్సాహాన్ని నింపింది. నువ్వా? నేనా? అన్నట్లుగా ప్రచారం సాగిన జూబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలిచింది. 26,729 ఓట్ల బంపర్ మెజార్టీని సాధించింది. రాజధాని నగరంలో సీటే లేదన్న కాంగ్రెస్ జూబ్లీలో పాగా వేయడంతోపాటు, మహానగరంలో బోణీ కొట్టింది. బీఆర్ఎస్ సిటింగ్ సీటును కోల్పోయింది. బీజేపీ డిపాజిట్ ను కోల్పోయింది. అయితే జూబ్లీలో కాంగ్రెస్ గెలుపుకంటే, నవీన్ ఎన్నిక ప్రచారమే ఎక్కువగా సాగింది. నవీన్ విజయం వెనుక అనేక అంశాలు పని చేశాయి.
నవీన్ యాదవ్ ఎంపిక
కాంగ్రెస్ విజయంలో నవీన్ యాదవ్ ఎంపికే సగం గెలుపుగా మారింది. గతంలో కార్పొరేటర్ గా, ఒకసారి ఎంఐఎం అభ్యర్థిగా, మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా ఓటమి చవి చూసిన నవీన్ కు కలిసి వచ్చింది. ఆయనకున్న పరిచయాలు, సానుభూతి పండింది.
బీసీ కావడం
కమ్మల కోటలో బీసీ అభ్యర్థిని నిలపడం సీఎం రేవంత్ రెడ్డి చేసిన తెలివైన వ్యూహం, సాహసం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి అది కమ్మల అధీనంలో ఉంది. మూడు సార్లు వరసగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగంటి గోపీనాథ్ గెలుస్తూ వచ్చారు. 2014లో టీడీపీ, 2018లో టీఆర్ఎస్, 2023లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయనే గెలిచారు. పార్టీలు సైతం కమ్మలకే ఈ సీటును కేటాయిస్తూ వచ్చారు. కానీ ఈసారి వ్యూహాత్మకంగా బీసీల ఓట్లు అధికంగా ఉన్న జూబ్లీలో బీసీ అయిన నవీన్ యాదవ్ ఎంపిక కాంగ్రెస్ కు కలిసి వచ్చింది.
స్థానిక ముద్ర
నవీన్ యాదవ్ స్థానికుడు. స్థానికంగా పట్టున్నవాడు. అయితే ప్రత్యర్థి సునీత దివంగత ఎమ్మెల్యే రెండో భార్య. స్థానికేతర మూలాలున్న వారి నేపథ్యం నవీన్ కు కలిసి వచ్చింది. స్థానిక, స్థానికేతర ప్రచారం విపరీతంగా జరగకపోయినప్పటికీ, నవీన్ తనను తాను స్థానికుడిగా చెప్పుకోవడంతోపాటు ఓటర్లు కూడా నవీన్ యాదవ్ ని స్థానికుడిగా గుర్తించి ఓట్లేశారు.
కష్టమొచ్చినా, తెచ్చినా నవీనే!
ఇది జూబ్లీ హిల్స్ లో ప్రత్యేకించి, యూసుఫ్ గూడలో వినిపించే కామెంటు. కొన్ని సందర్భాల్లో కొందరి కష్టం కలిగించిన పేరున్న నవీనే, ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాడన్న పేరు వచ్చింది. దీంతో మంచికైనా, చెడుకైనా మనోడే అన్న భావన స్థానిక ఓటర్లలో నాటుకుపోయింది. అది ఓట్లుగా పడింది.
అజహర్ కు మంత్రి పదవి
మైనార్టీ ఓట్లు కూడా అధికంగా ఉన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అజహరుద్దీన్ కు మంత్రి పదవిని తెచ్చి పెట్టింది. పదే పదే బీఆర్ఎస్ చేసిన విమర్శల ఫలితంగా, జూబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్, కాంగ్రెస్ పార్టీలు అజహరుద్దీన్ కు మంత్రి పదవినిచ్చారు. ముస్లీంలకు అండగా కాంగ్రెస్ ఉంటుందనే భరోసా కల్పించారు. మెజార్టీని బట్టి ముస్లింల ఓట్లు నవీన్ కే పడ్డాయన్న రూఢీనిస్తున్నాయి.
స్వయంగా సీఎం ప్రచారం
ఈ ఉప ఎన్నికను అందరికంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వయంగా తానే రంగంలోకి దిగారు. అభ్యర్థి ఎంపిక నుండి ఆయన్ని గెలిపించే వరకు అన్నీ తానై పని చేశారు. తన ఎన్నికలో లాగే ప్రచారం చేశారు. వారం రోజులు సీఎం జూబ్లీ నియోజకవర్గంలోని గల్లీల్లో ప్రచారం చేశారు. స్థానిక ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్న భరోసాని కల్పించారు.
మంత్రులు, పార్టీ శ్రేణుల మోహపరింపు
ఒక్కో డివిజన్ లో ఇద్దరు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్త పార్టీ శ్రేణులను దించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రచారానికి దీటుగా ప్రజల్లో ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ పట్ల నమ్మకాన్ని కలిగించగలిగారు.
ప్రచారంలో ముందంజ
దీంతో ప్రత్యేకించి బీఆర్ఎస్ కు మించిన ప్రచారం చేయగలిగారు. ఒకవైపు బీఆర్ఎస్ పై విమర్శలు, మరోవైపు ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ తాను ఓడి, బీఆర్ఎస్ ను గెలిపించే కుట్ర పన్నిందని ప్రజల్లో బాగా తీసుకెళ్ళారు. సీఎం ఆరోపణలను నిజమా? అన్నట్లుగానే బీజేపీ డిపాజిట్ కోల్పోవడం విస్మయానికి గురి చేసింది.
పోల్ మేనేజ్ మెంటు
పోల్ మేనజ్ మెంట్ కూడా ఈసారి కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చింది. బీఆర్ఎస్ కంటే ఎక్కువ డబ్బులు, బట్టలు పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది. అలాగే ప్రతి ఓటర్ నూ కలిసి, ఆ ఓటు తమకే పడేట్లు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
దీనికి తోడు బీఆర్ఎస్ చేసిన పొరపాట్లు, లోపాలు కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి. ప్రత్యేకించి అభ్యర్థి రౌడీ అంటూ చేసిన వ్యక్తిత్వ హననం ప్రచారం బీఆర్ఎస్ కు బెడిసి కొట్టింది. రాజకీయంగా ఆఖరి అస్త్రం అంతగా పనిచేయకపోగా, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మాగంటి రెండో భార్యగా ప్రచారం జరిగింది. పైగా మాగంటి తల్లి, కోడలు, కొడుకు పోలీస్ స్టేషన్లలో చేసిన ఫిర్యాదులను ప్రజలు పట్టించుకుంటున్నారు. పైగా ఆమె అభ్యర్ధిత్వం కంటే కేటీఆర్, హరీశ్ రావులే ప్రచారం మొత్తం కనిపించారు. అధికారంలో ఉన్న విధంగానే ప్రవర్తించారు. సొంత సోషల్ మీడియాను ఉసి గొల్పినా, ప్రజలు పట్టించుకోలేదు. సొంత సర్వేలను కూడా ప్రజలు పట్టించుకోలేదు. వాటికి జనం ప్రభావితం కాలేదు. అయితే ఈ ప్రచారాలన్నీ ప్రత్యర్థిని, ఆయన పార్టీని అలర్ట్ చేశాయి. దీంతో వారు మరింత పకడ్బందీగా తయారయ్యారు.
ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి, అభ్యర్థి నవీన్ యాదవ్ కు కలిసి వచ్చిన అంశాలు.

