ప్రకృతి విధ్వంసాన్ని ఎదుర్కోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. ప్రకృతిని కాపాడటం, పర్యావరణ పరిరక్షణకు పూనుకోవడం తప్ప వేరే దారే లేదు. ఇందుకవసరమైన చైతన్యాన్ని ప్రజల్లో కల్పించడం తప్ప మరో మార్గమే లేదు. వీటికి తగ్గట్లుగా మనం ఉంటున్నామా? మన ప్రభుత్వాలు పని చేస్తున్నాయా? నిజానికి మనకంటే అంటే మానవుల కంటే కూడా జంతువులే నయం. అసలు ప్రకృతికి మొదటి శత్రువు మనషే. మనిషి ఉద్భవించిన తర్వాతే ప్రకృతి వినాశనం మొదలైంది. ఇప్పటికీ గమనిస్తే, మనిషి ఉన్న చోటే పర్యావరణానికి చేటు కలుగుతోంది. అదే పులి, సింహం వంటి ప్రాణాంతక జంతువులున్న చోట కూడా విధ్వంసం లేదు. పైగా అవి పర్యావరణానికి పాటు పడుతున్నాయి. కాబట్టే పులిని మన జాతీయ జంతువుగా పరిగణిస్తున్నాం. కానీ మనం పులిలా కాదు కదా, కనీసం పిల్లిలా కూడా వ్యవహరించలేకపోతున్నాం. అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాం. ప్రకృతి ప్రకోపానికి బలవుతున్నాం. అయినా మనం మారమా? మన అంతానికి మనమే కారణమవుదామా? లేక ఈ గుణపాఠాల నేపథ్యంతో ప్రకృతితో సహవాసం చేద్దాం.
‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ విధ్వంసాల పర్యవసానమే ప్రకృతి వైపరీత్యాలు!
విధ్వంసాల పర్యవసానమే ప్రకృతి వైపరీత్యాలు!
ప్రకృతి విధ్వంసాన్ని ఎదుర్కోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. ప్రకృతిని కాపాడటం, పర్యావరణ పరిరక్షణకు పూనుకోవడం తప్ప వేరే దారే లేదు. ఇందుకవసరమైన చైతన్యాన్ని ప్రజల్లో కల్పించడం తప్ప మరో మార్గమే లేదు. వీటికి తగ్గట్లుగా మనం ఉంటున్నామా? మన ప్రభుత్వాలు పని చేస్తున్నాయా? నిజానికి మనకంటే అంటే మానవుల కంటే కూడా జంతువులే నయం. అసలు ప్రకృతికి మొదటి శత్రువు మనషే. మనిషి ఉద్భవించిన తర్వాతే ప్రకృతి వినాశనం మొదలైంది. ఇప్పటికీ గమనిస్తే, మనిషి ఉన్న చోటే పర్యావరణానికి చేటు కలుగుతోంది. అదే పులి, సింహం వంటి ప్రాణాంతక జంతువులున్న చోట కూడా విధ్వంసమే లేదు. పైగా అవి పర్యావరణానికి పాటు పడుతున్నాయి. కాబట్టే పులిని మన జాతీయ జంతువుగా పరిగణిస్తున్నాం. కానీ మనం పులిలా కాదు కదా, కనీసం పిల్లిలా కూడా వ్యవహరించలేకపోతున్నాం. అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాం. ప్రకృతి ప్రకోపానికి బలవుతున్నాం.
కాలం కాలానుగుణంగా కాకుండా కాలాతీతంగా నడుస్తోంది. కాల చక్రం భూత, వర్తమాన, భవిష్యత్ లాగే, వానా కాలం, చలి కాలం, ఎండా కాలం ఉన్నాయి. కానీ అవి గతి తప్పాయి. కాలచక్రానికి అతీతంగా అటు ఇటుగా వాటి ప్రభావాలు ఉంటున్నాయి. అందులో భాగమే అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటివన్నీను. వర్షాకాలం మొదలైంది. కానీ, వర్షాలే ఆలస్యంగా పడ్డాయి. దీంతో పంటలు ఎండిపోయి ఇక కాలం కాదనే దాకా రైతాంగం వెళ్ళిపోయింది. హఠాత్తుగా ఆగస్టు నెలాఖరులో క్లౌడ్ బరస్ట్, కుంభవృష్టి, హఠాత్తుగా వరదలు, బురదలు, మునిగిపోవడాలు, కొందరు శవాలై తేలిపోవడాలు జరిగిపోతూనే ఉన్నాయి. మూసీ ముంచెత్తింది. గోదారి పోటెత్తింది. కృష్ణా పరుగులు పెట్టింది.
హైదరాబాద్ లో అనేకసార్లు, కామారెడ్డి, రామాయం పేట, సిరిసిల్ల, సిద్దిపేట, ఏపీలో అమరావతి, తీర ప్రాతాలతో పాటు ఉత్తారాఖండ్ వంటి ఉత్తరాది, అసోం, మేఘాలయ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వానా కాలం జలప్రళయాన్నే కలిగించింది. ఆయా ప్రాంతాలు, ప్రజలు విలవిల్లాడుతున్నారు. నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వరదలకు ప్రకృతి విధ్వంసం సృష్టించింది. క్లౌడ్ బరస్ట్ లతో కుంభవృష్టి కురుస్తోంది. ఉత్తరాఖండ్ లోని రుదప్రయాగ్, చమోలీ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ఇదే ప్రాంతంలో తాజాగా మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. నానా విధ్వంసానికి అనేక మంది గల్లంతయ్యారు. ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో అనేక జిల్లాలకు సంబంధాలు తెగిపోయాయి. ఒక్క కశ్మీర్లోనే ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీనగర్, అనంత్నాగ్ల్లో నదులు ప్రమాద స్థాయిని మించి ఉప్పొంగడంతో, గండ్లుపడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాబ్లో గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వ్యవసాయ భూములు అదృశ్యమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నైరుతి పవనాల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఈ ఆగస్టులో ఎప్పుడూ లేనంతగా క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాలయ పర్వత వాలు ప్రాంతాలు ఒరిగిపోయాయి. మైదానప్రాంతాల్లో గట్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. రైతన్నలు పూర్తిగా రోడ్డున పడ్డారు. నేలకోత పెరిగింది. కొండచరియలు విరిగిపడి సమీప నివాసాలను ధ్వంసం చేస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లే కొట్టుకు పోతున్నాయి. పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు.
ఇలా ఎందుకు జరుగుతుందో మనమంతా ఆలోచించాలి. ప్రభుత్వాలు చర్చించాలి. కార్యాచరణకు దిగాలి. ప్రకృతి వైపరీత్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. పర్యావరణానికి మనం చేస్తున్న విధ్వంసాన్ని విస్మరించి, ప్రకృతి విపత్తును అసాధారణమైనవిగా చర్చిస్తున్నాం. కొండచరియలు విరిగి పడడానికి కూడా మనం చెట్లను నరికేయడం, బండలను పగుల గొట్టడం అని తెలసీ చేస్తున్నాం. దేశంలోని 16 రాష్టాల్రు, హిమాలయ రీజియన్ లోని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్యంలోని హిమాలయ పర్వత దిగువ భాగాలు, పశ్చిమ కనుమలు ఇవన్నీ కొండచరియలు విరిగిపడే ప్రాంతాలుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనంలో గుర్తించింది. రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు, ఎలాంటి ప్రణాళిక లేకుండా సాగించే క్వారీ పనుల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయని చేసిన హెచ్చరికలేవీ మన మొద్దుబారిన చెవికి ఎక్కడలం లేదు.
పర్వత ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లుగా చెట్లనునరకడం వల్లే కొండలపై ఉన్న సారవంతమైన మట్టి వర్షాలకు కొట్టుకుపోయి, కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతోపాటు పంట పొలాల్లోకి, ఇళ్లలోకి బురద ప్రవాహంలా వచ్చిచేరుతోంది. ఎన్నో ప్రాణాలు జలసమాధి అవుతున్నాయి. ఇవన్నీ స్వయం కృతాపరాధాలే. హిమాలయ పర్వత ప్రాంతాల్లో కొండవాలు ప్రాంతాలు అత్యంత బలహీనమైనవని, వాటిని తిరిగి పొందలేమని పర్యావరణ శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలు ఎవరికి పట్టాయి? ప్రభుత్వాలు ఈ విధ్వంసాన్ని అడ్డుకోవడం లేదు. అలాగని ప్రజలు కూడా తమ వైఖరి మార్చుకోవడం లేదు. భారీ వర్షాల కారణంగా భూమి కొతకు గురై, చెరువుల్లో పూడిక పేరుకుపోతోంది. ఇదంతా మానవ తప్పిదమని గుర్తించడం లేదు.
ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళికతో ప్రకృతి విధ్వంసాన్ని ఆపితే తప్ప, ఈ విపత్తులను ఆపలేం. ఎదుర్కోలేం. ఈ విపత్తుల నివారణకు ముందస్తు ప్రణాళికలు ఆలోచించాలి. అడవులను నరకడం తక్షణం ఆపాలి. కాలువలు, చెరువులను పునరుద్ధరించాలి. జనాభా నియంత్రణ అవసరం. మనిషి తన మనుగడ కోసం ప్రకృతిని విద్వంసం చేస్తున్నాడని గుర్తించి కఠిన నివారణ చర్యలకు పూనుకోవాలి. అప్పుడే ఈ విధ్వంసాన్ని కొంతయినా ఆపగలం.

