దేశాభివృద్ధి మానవ గణాంకాలలో కాదు. నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధిలో ఉంటుంది. జనాభా పెంపు రాజకీయ అవసరమా? సామాజిక అవసరమా? ముందుగా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలపై ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎక్కువ మంది పిల్లలను కనే కుటుంబాలకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గిపోవడం, భవిష్యత్తులో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళనను ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఆయనే కాదు, దక్షిణ భారత దేశంలోని రాజకీయ నేతలు, రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు ఇంచుమించు ఇంతే కావచ్చు. రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత కోణంలో బాబు బాధను అర్థం చేసుకోవచ్చు. అయితే, అంతకంటే కీలకం… ప్రస్తుతం ఉన్న జనాభాకే సరిపడా మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు దేశంలో అందుబాటులో ఉన్నాయా? ఇవేవీ ఇవ్వలేని దేశంలో జనాభా మరింత పెరిగితే సంభవించే సమస్యలకు పరిష్కారాలేంటి?
భారత్ ప్రస్తుతం 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. అయినప్పటికీ కోట్లాది మంది ప్రజలు నాణ్యమైన ఆరోగ్య సేవలు, గృహ వసతి, తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు, స్థిర ఉపాధి కోసం ఇంకా పోరాడుతున్నారు. జనాభా పెంపుపై ప్రోత్సాహకాలు ప్రకటించే ముందు ఈ వాస్తవాలను ప్రభుత్వాలు నిజాయితీగా అంగీకరించాల్సిన అవసరం ఉంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5, 2019-21 ప్రకారం భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు 2.0కు పడిపోయింది. జనాభా స్థిరంగా కొనసాగేందుకు అవసరమైన ‘రిప్లేస్మెంట్ లెవల్’ 2.1గా పరిగణిస్తారు. అంటే దేశం ఇప్పటికే సహజ జనాభా నియంత్రణ దశలోకి ప్రవేశించింది. మహిళల విద్యాభివృద్ధి, పట్టణీకరణ, ఆరోగ్య సేవల విస్తరణ, కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన కారణంగా ఈ మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో జననాల రేటు ఇప్పటికే రిప్లేస్మెంట్ స్థాయి కంటే తక్కువగా ఉంది.
జనాభా పెంచాలని పిలుపునిచ్చే ముందు యువత పరిస్థితిని పరిశీలించాలి. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే-2023-24) ప్రకారం దేశ నిరుద్యోగ రేటు 3.2 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 5.1 శాతానికి చేరుకుంది. మరోవైపు, ఉద్యోగాల్లో ఉన్నవారిలో కూడా పెద్ద శాతం అసంఘటిత రంగంలో, తక్కువ ఆదాయంతో, భద్రతలేని పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. శాశ్వత ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, నైపుణ్యాలకు సరిపడే ఉద్యోగాలు లేకపోవడం యువతను తీవ్ర అనిశ్చితిలోకి నెడుతోంది.
ఇక ఆరోగ్య రంగ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో పోలిస్తే భారతదేశ ప్రభుత్వ ఆరోగ్య వ్యయం ఇంకా తక్కువగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కలిపిన ప్రజా ఆరోగ్య వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో 2% పరిధిలోనే కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది, అత్యవసర సేవల కొరత ఇప్పటికీ తీవ్ర సమస్యగానే ఉంది. గర్భిణీ స్త్రీలను వైద్యశాలలకు తరలించేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరింత మంది పిల్లలను కనమని ప్రోత్సహించడం కన్నా మాతా-శిశు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం అత్యవసరం.
ఈ విధానాల ప్రభావం మహిళలపై ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా నిర్లక్ష్యం చేయరాదు. భారత సమాజంలో మహిళలు ఇప్పటికే వివాహం, సంతానం, కుటుంబ బాధ్యతల విషయంలో తీవ్రమైన సామాజిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. జనాభా పెరుగుదలకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా ఆ ఒత్తిడి మరింత పెరిగే ప్రమాదం ఉంది. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో మహిళల ఆరోగ్యం, విద్య, ఉద్యోగ అవకాశాల కంటే సంతానోత్పత్తికే ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంటుంది.
జనాభా పెరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందనడం సరైన వాదన కాదు. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల అనుభవం చెబుతున్నది ఏమిటంటే జనాభా సంఖ్య కంటే మానవ వనరుల నాణ్యతే ఆర్థికాభివృద్ధికి కీలకం. విద్యావంతులు, ఆరోగ్యవంతులు, నైపుణ్యాలు కలిగిన యువతే దేశ సంపద. జనాభా పెరిగినా వారికి సరైన విద్య, వైద్యం, ఉపాధి లేకపోతే అది అభివృద్ధికి కాకుండా అసమానతలకు, నిరుద్యోగానికి, సామాజిక అస్థిరతకు దారితీస్తుంది.
ప్రభుత్వాలు, రాజకీయ నేతలు నిజంగా భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తే ముందుగా ప్రతి గ్రామంలో నాణ్యమైన పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తాగునీటి సదుపాయాలు, పోషకాహార కార్యక్రమాలు, మహిళల భద్రత, ఉపాధి అవకాశాలు కల్పించాలి. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ హామీ, అందుబాటులో ఉన్న వైద్య సేవలు, సరసమైన గృహ వసతి కల్పించే దిశగా పెట్టుబడులు పెట్టాలి. పిల్లలను కనమని చెప్పడం కంటే ప్రతి పుట్టే బిడ్డకు గౌరవప్రదమైన జీవితం హామీ ఇవ్వడం ప్రభుత్వాల అసలు బాధ్యత.
దేశాభివృద్ధి మానవ గణాంకాలలో కాదు. నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధిలో ఉంటుంది. జనాభా పెంపు రాజకీయ అవసరమా? సామాజిక అవసరమా? ముందుగా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలపై ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి.

