ఒక దేశ అభివృద్ధికి అధిక జనాభా ఆటంకమా? ఆలంబనా? సాధారణంగా ఆలోచిస్తే, అధిక జనాభా కచ్చితంగా అభివృద్ధి నిరోధకమే. కానీ, శిక్షణ, నైపుణ్యాల పెంపుతో సమర్థవంతంగా మానవ వనరులను వినియోగించగలిగితే జనాభా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలే చేస్తుంది! జనాభా ఒక అనుకూల అంశమే. నిజానికి ప్రపంచంలో ఇవ్వాళ అత్యంత సమస్యాత్మకం మానవ వనరులే. డబ్బు, పెట్టుబడులు వంటివి సమకూర్చుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. కానీ, సమర్థమైన మానవ వనరుల నిర్వహణ పెద్ద సమస్యగా ఉందంటే ఆశ్చర్యం వేయక మానదు. అభివృద్ధి చెందిన, చెందుతోన్న దేశాలకు మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. అదే వెనుకబడిన దేశాలకు మానవ వనరులు పెద్ద సమస్యగా, గుదిబండగా మారుతున్నాయి. ప్రజల నైపుణ్యాలు, జ్ఞానం, సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించడమే మానవ వనరుల నిర్వహణ. ఇది నియామకం, శిక్షణ, అభివృద్ధి, జీతాలు, ప్రయోజనాలు, ఉద్యోగి సంబంధాల నిర్వహణ వంటి అనేక అంశాల మీద ఆదారపడి ఉంటుంది.
భారతదేశంలో 1991లో జరిగిన ఆర్థిక సరళీకరణలు అత్యంత పోటీ వాతావరణాన్ని సృష్టించాయి. అంతర్జాతీయ సంస్థలు వారి వినూత్న, శక్తివంతమైన పోటీతత్వంతో మన దేశంలో పెట్టుబడుల పేరుతో ప్రవేశించగా, సంప్రదాయిక సంస్థలు తమ పురాతన పద్ధతులను సమూలంగా మార్చుకున్నాయి. కొత్త పంథాలో పయనించటం మొదలుపెట్టాయి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా గల దేశాలలో భారతదేశం ఒకటి. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న అక్షరాస్యతా శాతం వల్ల అర్హత గల మానవ వనరుల సంఖ్య పెరిగింది. గ్లోబలైజేషన్, సరళీకరణల వల్ల 1995 తర్వాత బహుళ జాతి సంస్థలు దేశంలో వ్యాపారం చేయటానికి ముందుకు వచ్చాయి. ఇక్కడ తగినన్ని మానవ వనరులు అందుబాటులో ఉండటం వల్ల మానవ వనరుల నిర్వహణ ప్రాముఖ్యత రానురాను పెరుగుతోంది.
దీంతో మానవవనరుల నిర్వహణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వారికి తగు శిక్షణనివ్వడం ద్వారా నైపుణ్యాలను పెంచడం, వారి సామర్థ్యాలకనుగుణంగా వారి నుంచి పనిని తీసుకోవడం అనేది సవాల్ గా మారింది. యాజమాన్యానికి, ఉద్యోగులకు మధ్య నెలకొనే ఘర్షణలను తగ్గుముఖం పట్టించటం. శిక్షణ, అభివృద్ధి ద్వారా నైపుణ్యాలను పెంచటం. భారతీయ సంస్థలు ఉద్యోగుల నైపుణ్యాలు, సామర్థ్యాలు అభివృద్ధిపరచటానికి, వృత్తి సంబంధిత అభివృద్ధిని విస్తరించటానికి వారి బాధ్యతలను గుర్తించటం వంటివి చేస్తున్నాయి. మహిళా ఉద్యోగులపై ఉన్న వివక్ష రూపు మాపటానికి భారతదేశంలో సంస్థలన్నీ సమాన ఉపాధికి కట్టుబడి ఉన్నాయి. మహిళలకు శిక్షణనిచ్చి మరీ నిర్వాహక స్థాయిలో పదవులనిస్తున్నాయి. వివిధ దశలలో మహిళల పరిమితులను గుర్తించి దీర్ఘకాలిక సెలవు, తగు సమయం వరకు ప్రసూతి సెలవు వంటి సదుపాయాలు అన్ని సంస్థలు అందిస్తున్నాయి.
ఈ క్రమంలో జనాభా పెరగాలని రష్యా లాంటి దేశాలు ఆరాటపడుతున్నాయి. భారత్ లాంటి దేశాలు జనాభా నియంత్రణను కోరుకుంటున్నాయి. కొన్ని దేశాలు అధిక జనాభాతో సతమతమవుతూ, జనాభా నియంత్రణ చర్యలు పాటిస్తున్నాయి. మరికొన్ని దేశాలు జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. గతంలో జనాభా నియంత్రణను కఠినంగా అమలు చేసిన దేశాలు కూడా ఇప్పుడు ఆ నిబంధనను సడలిస్తున్నాయి. దేశంలో కొన్ని రాష్ట్రాల పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి. జనాభా పెరగాలని కొన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇప్పటికీ జనాభా నియంత్రణకు ప్రాధాన్యమివ్వడం లేదు. జనాభా అనేది సమస్యే కాదని, మావన వనరుల నిర్వహణకు ప్రభుత్వాల వద్ద సరైన ప్రణాళికలు లేకపోవడమే అసలు సమస్యని తేట తెల్లమవుతోంది. కేవలం రాజకీయ ప్రయోజనాలే పరాకాష్టగా పని చేస్తున్నందువల్లే సమస్యలుత్పన్నమవుతున్నాయి. సరైన ప్రణాళికలతో జనాభాను వినియోగించుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. వస్తూత్పత్తని పెంచవచ్చు. ఆహారోత్పత్తిని జరపవచ్చు. వ్యవసాయంలో విప్లవం తేవచ్చు. ఇలా ఆలోచించ గల నేతలు దేశంలో లేకుండాపోయారు.
మన దేశం 146 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో ఉన్నది. జనాభా ఆయా దేశాల ఆర్థిక, సామాజిక, పర్యావరణంపై ఆధారపడి ఉంటాయి. సరైన ప్రణాళిక లేనప్పుడు జనాభా పెరుగుదల ఒత్తిడిని సృష్టిస్తుంది. వనరులను దెబ్బతీస్తుంది. పర్యావరణ విధ్వంసానికి కారణం అవుతుంది. అయితే సమర్థవంతమైన విధానాలతో ఈ సవాళ్లను అధిగమించవచ్చు. అధిక జనాభా ఉన్నా, చైనా సరైన ప్రణాళికలతో అభివృద్ధి పథంలో దూసుకు పోతోంది. ప్రపంచంలో మూడో అధిక జనసాంద్రత గల దేశం సింగపూర్ ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించింది. సింగపూర్ వైశాల్యం 719.9 చ. కి. మీ. కాగా, చదరపు కిలో మీటర్కు 8,595 మంది నివసిస్తున్నారు. అయితే అధిక ఆర్థిక వృద్ధి, అత్యుత్తమ గృహనిర్మాణం, ఆరోగ్య సేవలతో ప్రపంచంలోనే ఆ దేశం అగ్రగామిగా ఉంది. 1980 నుంచి 2015 వరకు చైనా వన్ చైల్డ్ పాలసీని అమలు చేసి, దాదాపు 40 కోట్ల జనాభాను నియంత్రించింది. ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన ఆ దేశం జనాభా వనరులను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించింది. ఫలితంగా చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. భారతదేశంలో 35 ఏళ్ల లోపు యువ జనాభా 65 శాతం ఉంది. ఈ జనాభాను పని విధానంలోకి మారిస్తే అద్భుతాలు సాధించవచ్చు. వీరిని ఉత్పాదక శక్తిగా మారిస్తే, ఆర్థిక వృద్ధికి దోహదపడతారు. ఈ దిశగా ఆలోచనలు సాగడం లేదు. మన ప్రజాస్వామ్యంలో ఓటు ప్రధానం కనుక అంతా ఆ ఓటు బ్యాంకు వైపే మొగ్గుతున్నారు. దీంతో ఉచితానుచితాలు పెరిగి, ప్రజలు సోమర్లుగా మారి, ఉత్పాదక తగ్గి మొత్తం దేశమే సమస్యల్లో కూరుకుపోతోంది.
…..

