ఎల్నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఎల్నినో హెచ్చరికలు కేవలం వాతావరణ శాఖ నివేదికలకే పరిమితం కాకుండా, ప్రభుత్వాల కార్యాచరణకు పునాది కావాలి. లేకపోతే కరువు, నీటి కొరత, వ్యవసాయ సంక్షోభం, పర్యావరణ విపత్తుల రూపంలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రకృతిని రక్షించడం, జలవనరులను సంరక్షించడం, భూమిని పునరుద్ధరించడం ద్వారానే భవిష్యత్ తరాలకు భద్రమైన జీవనాన్ని అందించగలం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైన వేళ ఎల్నినో హెచ్చరికలు దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షాలపై ఆధారపడిన భారత వ్యవసాయ రంగానికి ఇది అసాధారణ వాతావరణ హెచ్చరిక. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, గ్రామీణ ఉపాధి, ఆహార భద్రతలను ప్రభావితం చేసే జాతీయ సవాల్. అయితే, ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వాల స్థాయిలో ఆశించిన స్థాయి అప్రమత్తత మాత్రం కనిపించడం లేదు.
ఎల్నినో అనేది మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే కనీసం 0.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ దృగ్విషయం. ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావం ఏర్పడిన సంవత్సరాల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి. భారతదేశంలో ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. భారతదేశ వార్షిక వర్షపాతంలో 70 శాతం వర్షాలు నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తాయి. దేశంలోని వ్యవసాయ భూముల్లో 52 శాతం ఇప్పటికీ వర్షాధార సాగుపైనే ఆధారపడి ఉన్నాయి.
చరిత్రను పరిశీలిస్తే ఎల్నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతుంది. 2002లో దేశంలో సాధారణ వర్షపాతం కంటే 19 శాతం తక్కువ వర్షాలు నమోదయ్యాయి. 2009లో 22 శాతం లోటు నమోదైంది. ఈ రెండు సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తి భారీగా దెబ్బతింది. లక్షలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశ జీడీపీ వృద్ధిపైనా ప్రభావం పడింది. అందుకే ఎల్నినో హెచ్చరికలను కేవలం వాతావరణ సమాచారంగా కాకుండా ఆర్థిక హెచ్చరికగా కూడా చూడాల్సి ఉంటుంది.
ఎల్నినో ప్రభావంతో సాధారణంగా వర్షపాతం తగ్గుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. భూమి మరింత పొడిగా మారుతుంది. కరువు పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఇది కేవలం వర్షాభావానికే పరిమితం కాదు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, క్లౌడ్బరస్ట్ ఘటనలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అంటే ఒకవైపు నీటి కొరత, మరోవైపు విపత్తులు అనే ద్వంద్వ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
దేశంలో తలసరి నీటి లభ్యత 1951లో 5,177 క్యూబిక్ మీటర్లుగా ఉండగా ప్రస్తుతం 1,500 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. 1,700 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ తలసరి నీటి లభ్యత ఉన్న దేశాలను నీటి ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశాలుగా పరిగణిస్తారు. ఈ పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు, వాగులు, నదీ పరివాహక ప్రాంతాలు ఇప్పటికే ఆక్రమణలకు గురవుతున్నాయి. భూగర్భ జలాల వినియోగం అధికమవుతోంది. ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గితే తాగునీటి సంక్షోభం తీవ్రమవడం ఖాయం.
వ్యవసాయ రంగంలో కూడా ముందస్తు ప్రణాళికలు అత్యవసరం. వరి, చెరకు వంటి అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా జొన్న, సజ్జ, రాగి, పెసర, కంది వంటి ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి. విత్తనాల సరఫరా, పంటల బీమా, మార్కెట్ భరోసా వంటి అంశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలి. వ్యవసాయ శాఖలు గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలి. ఎల్నినో ప్రభావం తెలిసిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సిద్ధపడటం వల్ల నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు.
అయితే, ఎల్నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచ భూభాగంలో 40 శాతం ప్రాంతం ఇప్పటికే భూమి క్షీణత ప్రభావానికి లోనైంది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు దీని ప్రభావాన్ని అనుభవిస్తున్నారు.
ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నాం. కానీ పర్యావరణ పరిరక్షణ విషయంలో ఆచరణాత్మక మార్పులు కనిపించడం లేదు. చెరువులను ఆక్రమిస్తున్నాం. అడవులను నరికేస్తున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రకృతిని కలుషితం చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణపై సమావేశాలు, ప్రసంగాలు పెరుగుతున్నా కార్యాచరణ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రత్యేక ఎల్నినో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. నీటి సంరక్షణ, పంటల మార్పిడి, భూగర్భ జలాల నిర్వహణ, గ్రామీణ ఉపాధి, విపత్తు నిర్వహణ అంశాలను సమగ్రంగా అమలు చేయాలి. పర్యావరణ సంస్థలు, శాస్త్రవేత్తలు, యువజన సంఘాలు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. దీనిని ప్రజా ఉద్యమంగా మలచాలి.
ఎల్నినో హెచ్చరికలు కేవలం వాతావరణ శాఖ నివేదికలకే పరిమితం కాకూడదు. అవి ప్రభుత్వాల కార్యాచరణకు పునాది కావాలి. లేకపోతే కరువు, నీటి కొరత, వ్యవసాయ సంక్షోభం, పర్యావరణ విపత్తుల రూపంలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రకృతిని రక్షించడం, జలవనరులను సంరక్షించడం, భూమిని పునరుద్ధరించడం ద్వారానే భవిష్యత్ తరాలకు భద్రమైన జీవనాన్ని అందించగలం. ఎల్నినోను ఎదుర్కొనే అసలైన కార్యాచరణ అదే.

