పిచ్చ పీక్స్ సీఎం ఇమేజీ గ్రాఫ్!!
-డా. మార్గం లక్ష్మీనారాయణ
6 ఖండాలు, 42దేశాలు, 154మంది అతిథులు, 1686 మంది ప్రతినిధులు, అనేక మంది ప్రముఖుల మధ్య తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. సరిగ్గా ఈ సమ్మిట్ కు ఒక రోజు ముందు డిసెంబర్ 7న సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ప్రాంగణంలో యువకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేశారు. సమ్మిట్ పూర్తైన ఒక రోజు తర్వాత కూడా ఆయన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్లోని వోక్సన్ యూనివర్సిటీ క్రీడాకారులతో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు. అంతకుముందు నవంబర్ 25న పంచాయతీరాజ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. డిసెంబర్ 1 నుంచి 6 రోజులపాటు జిల్లాలు పర్యటించారు. నిజానికి పంచాయతీ ఎన్నికలు పెట్టడానికే అపసోపాలు పడిన పరిస్థితి నుంచి ప్రతిష్టాత్మక పంచాయతీ ఎన్నికలకు వెళ్లి, గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న బిజీలోనూ ఆయన ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తుండటం, మొదటి దశ సత్ఫలితాలను చూస్తే, ఆశ్చర్యం వేయకమానదు. రేవంత్ లో సంతరించుకున్న పరిపక్వతకే కాదు స్పష్టతకు ఈ ఉదాహరణకు పరాకాష్ట.
తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి పరిణామాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నాయకత్వం. పరిపాలన సామర్థ్యాన్ని, రాజకీయ వ్యూహాత్మకతను, ప్రజల నమ్మకాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా పంచాయతీ ఎన్నికల మొదటిదశ ఫలితాలు ఆయన ఇమేజ్ను అమాంతం పెంచాయి.
గత ఏడాది ఎన్నికలతో ప్రారంభమైన కాంగ్రెస్ పునరాగమనం ఇప్పుడు స్థానిక సంస్థల వరకు విస్తరించడమే కాకుండా, గ్రామ స్థాయి రాజకీయాల్లో కూడా రేవంత్ ప్రభావం మరింతగా బలపడుతున్నది.
రాష్ట్రంలో దాదాపు పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను కాదని ప్రజలు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఆ నిర్ణయానికి ప్రధాన కారణం ప్రజల్లో పెరిగిన మార్పు ఆకాంక్ష. ఆ మార్పునకు ప్రతీకగా రేవంత్ రెడ్డి నిలవడం, కనిపించడమే. రేవంత్ పోరాట, వాక్పటిమ, దూకుడు స్వభావం, వెరువని, వెన్నుచూపని మనస్తత్వం, మాట మీద నిలబడే వ్యక్తిత్వం వెరసి ‘నిర్ణయాత్మక నేత’గా ఆయనను ప్రజలు గుర్తించారు. ఇవన్నీ ఆయన్ని తెలంగాణకు ప్రత్యామ్నాయంగా నిలబెట్టాయి. అధికారంలోకి వచ్చిన రెండేండ్ల తర్వాత కూడా ఆ క్రేజీ తగ్గకపోవడం, పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన ఇమేజీ మరింత పెరగడం రాజకీయాల్లో అరుదైన ఆసక్తిగొలిపే అంశం. సాధారణంగా ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే ప్రజల్లో అసంతృప్తి మొదలవుతుంది. తెలంగాణలోనూ ఆ పరిస్థితి కనిపించింది. అధికారంలోకి రావడమే కొత్త, రాగానే ఖాళీ ఖజానా, అతికష్టం ఆర్థిక సమీకరణ, అప్పులు, వడ్డీలు కట్టడం, పథకాల ప్రారంభం, ఫలితాలు ఆలస్యంగా ప్రతిఫలించడం, ప్రతిపక్షాల దుష్ప్రచారం, అదుగడుగునా ఆటంకాలు, సీనియర్లు, పోటీదారుల పీకులాటలు, పార్టీలో, ప్రభుత్వంలో అతి స్వేచ్ఛ, అంతర్గత సమస్యలు, విధి, విధాన లీకులు, అధికారులు, ఉద్యోగ సంఘాల బెదిరింపులు, పార్టీ, కార్పొరేషన్ల చైర్మన్లు, పదవుల పందేరం.. ఏమి చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, అన్నింటికీ మించి అధిష్టానం ముకుతాడు. వీటన్నింటినీ అధిగమించి అధికారాన్ని నెట్టుకురావడం నుంచి చెలాయించడం వరకు ఆయన ప్రస్థానం అప్రతిహతంగా సాగుతూనే ఉంది.
ఈ దశలో 2024 పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు, పరిపాలనా పటిమకు అసలై పరీక్షగా నిలిచాయి. ఇవేగాక పంచాయతీ ఎన్నికల్లోనూ రేవంత్ తనవైన సొంత వ్యూహాలతోనే గెలిచారు. గెలుపే కాదు ఓటమైనా తన భుజాలపై మోసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే రేవంత్ ఓ భద్రత, భరోసాగా నిలిచారు.
ఎవరేమన్నా, పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చిన, రానున్న ఫలితాలు కూడా రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో రేవంత్ చెప్పినట్లు రెఫరెండమే. సరైన రాజకీయ, ప్రగతి సమయం కుదరక పంచాయతీ ఎన్నికలు ఆలస్యమవుతూ వచ్చాయి. జన, కులగణన, బీసీలకు 42శాతం రిజర్వేష్లన్లు, ఆ రిజర్వేషన్ల సాధనకు చేసిన విఫల యత్నాలు, కోర్టులు, కేసులు, కటాఫ్ డేట్లు, వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. అలా ఏడాదిన్నర వేచిచూడాల్సి వచ్చింది.
అయితే పంచాయతీ ఎన్నికలకు రేవంత్ సంసిద్ధమైన తీరు ఆసక్తిగా కొనసాగింది. సాధ్యమైనన్ని ఉద్యోగాలను భర్తీ చేశారు. ముందుగా రైతు భరోసా నిధులు వేశారు. ఇందిరమ్మ ఇండ్లను వేగంగా గ్రౌండ్ చేశారు. ఆలస్యమైనా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ జరిగేలా చూశారు. మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు బీజేపీ, బీఆర్ఎస్ లే కారణమని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళడమేగాక, తమ పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, అంతకంటే ఎక్కువ ఇస్తామని ఆ వర్గ ప్రజలకు నమ్మకం కలిగించారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించగలమనే దీమాను అందించారు.
పార్టీని వ్యవస్థీకరించి పటిష్టం చేసుకున్నారు. డీసీసీలను నియమించారు. క్షేత్ర స్థాయి ప్రిపరేషన్ బాగా చేశారు. గ్రామాల్లో అభ్యర్థుల ఎంపిక, నాయకుల సమన్వయం. అనుసంధానం, బూత్ స్థాయి సమన్వయం వరకు కేరళ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ను తలపించేలా పకడ్బందీగా చేశారు. పార్టీ, ప్రభుత్వ అన్ని నిర్ణయాల్లోనూ, వాటి అమలు వ్యూహాలన్నీ రేవంత్ సొంతంగా తీసుకుని నడిపించారు. కాంగ్రెస్ అంటేనే కలహాల సంస్క్రుతి. అలాంటి పార్టీలో ప్రస్తుతం ఆ వర్గాలన్నీ రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించి, ఆయన ఆదేశాలను ఆచరించే ఒకే దారిలో నడుస్తున్నాయి. ఇవి రాజకీయంగా పార్టీపై, ప్రభుత్వంపై రేవంత్ సాధించిన పట్టుకు నిదర్శనం.
అయితే ఇదంతా కేవలం రేవంత్ విజయం మాత్రమే అని చూడ్డానికి వీల్లేదనే విమర్శలూ ఉన్నాయి. బీజేపీ ఉదాసీనత, బీఆర్ఎస్ బలహీనపడటం, నాయకత్వ సంక్షోభం కాంగ్రెస్కు కలిసొచ్చాయని వచ్చాయని చెప్పొచ్చు. ఇదీ నిజమే అయినప్పటికీ, ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాథమిక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే! ప్రత్యర్థులు బలహీనంగా ఉన్నప్పటికీ, ప్రజలు అధికార పార్టీకే అనుకూలంగా ఓటు వేయడం విశేషమే.
రేవంత్ నాయకత్వంలో కనిపిస్తున్న మరో స్పష్టమైన మార్పు ప్రగతి ఆధారిత పాలన. వ్యవసాయం, విద్య, పేదల సంక్షేమం, ఉద్యోగాలు, ఐటీ వంటి ప్రధాన రంగాల్లో ప్రభుత్వ చర్యలు ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. రైతులకు పంటల భీమా, గిరిజన ప్రాంతాల్లో భూమి సమస్యల పరిష్కారం, విద్యార్థుల కోసం గ్లోబల్ స్కాలర్షిప్లు వంటి ప్రజలకు ప్రయోజనం ఇచ్చే నిర్ణయాలు తీసుకోవడం వలన ‘పని చేసే సీఎం’ అనే గుర్తింపు రేవంత్కు వచ్చింది. ఆయనే చెప్పుకున్నట్లు ఈ రెండేళ్ళల్లో ఆయన ఒక్క సెలవూ తీసుకోలేదు.
అయినప్పటికీ, రేవంత్ ప్రభుత్వంలో పరస్పరం సహకారం, సమన్వయం ఇంకా బలపడలేదని, కొందరు మంత్రులకు వారి శాఖలపై పట్టులేదనే అభిప్రాయాలు ఉన్నాయి. పెద్ద ప్రాజెక్టులు, నీటి పారుదల, మున్సిపల్ రంగాల్లో త్వరిత గతిన పనులు జరగాలన్న ఆకాంక్ష కూడా పెద్దగా నెరవేరలేదు. ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగుల సమస్యలు ఇంకా పరిష్కార దశలోనే ఉన్నాయి. ఇవి భవిష్యత్లో రేవంత్కు సవాళ్లు.
రేవంత్ రెడ్డి వరుస విజయాలు ఒక వ్యక్తి ప్రాభవం మాత్రమే కాదు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ప్రభుత్వ పనితీరు, ప్రత్యర్థుల బలహీనతు వంటివన్నీ కలిసిన సమగ్ర ఫలితాలు. ఇదే ఒరవడి కొనసాగాలంటే పాలనలో సమర్థత, పాదర్శకత, మరింత వేగం, క్రమశిక్షణ అవసరం. పదేళ్ళు నేనే సీఎం అంటున్న రేవంత్ రెడ్డి నాయకత్వానికి, రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు, ఆతర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలు అసలైన పరీక్షలు. ఇప్పుడు వస్తున్న మార్కులు అప్పుడూ వస్తూ ఉంటేనే ఆయన పదేళ్ళ సీఎం కల నెరవేరుతుంది. ప్రస్తుతం మాత్రం ఆయన తెలంగాణ రాజకీయాల్లో తనదైన కొత్త అధ్యాయాన్ని రాస్తున్నారనడంలో సందేహం లేదు.


