భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉన్నవే. ప్రకృతిని ఆరాధించడం మన జీవన విధానంలోనే ఇమిడి ఉంది. ప్రకృతితో ముడిపడి ఉన్న పంచభూతాలను ఆరాధించడం వేదకాలం నుంచే ఉంది. మొదట మనం ఆరాధించిన దేవతామూర్తుల ప్రతిమలన్నీ మట్టితో చేసినవే. తర్వాత రాతివి, ఆతర్వాత లోహాలతో చేసే విగ్రహాలు మనం చూస్తున్నాం. వినాయకచవితి పర్వదినంలో మనం అనేక పుష్పాలు, ఫలాలతో విఘ్నేశ్వరుడిని పూజిస్తాం. విఘ్నాలను నివారించే వినాయకుని పూజతోనే ప్రతి శుభకార్యాన్ని ఆరంభిస్తాం. వినాయకుడిని విఘ్నాలు తొలగించి, శుభాలు కలిగించే ఆది దేవుడిగా కొలుస్తాం. ప్రత్యేకించి వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ –పీఓపీ-తో తయారు చేయడం చూస్తున్నాం. ఈ వినాయక, దుర్గామాత విగ్రహాలను, 10 రోజులపాటు పూజించి, మన చెరువుల్లో వేస్తున్నాం. పూలూ, పత్రి వంటి వాటిని చెరువులో వేయడం వెనక ప్రకృతి పరమార్థం దాగివుంది.
వినాయక పూజలో ఉపయోగించే పూలు, పత్రిలో విశేష ఔషధ గుణాలు ఉన్నాయి. గోరంత పత్రి పెడితే చాలు కొండంత వరాలు గుప్పిస్తాడు. అందుకే వినాయక పూజ అంటే అందరికీ ఇష్టం. వారిని ప్రోత్సహించడం ద్వారా ప్రకృతికి పాటుపడేలా చేయాలి. ఉండ్రాళ్ళ నైవేద్యానికే మహదానందపడిపోతాడు విఘ్నేశ్వరుడు. ఒక్క వినాయకుడికే పత్రిపూజ ఎందుకు చేస్తాం? ఆయన గజముఖుడు కదా! ఏనుగుకు ఇష్టమైనవి ఆకులే కదా! అందుకే ఈ పత్రి పూజ. ఏకవింశతి అంటే ఇరవై ఒక్క రకాల పత్రితో గణేశుణ్ణి పూజిస్తాం. గజాననుడని కీర్తించినా, మూషిక వాహనుడని మొక్కినా, సర్వ విఘ్నాలకు అధినాయకుడని శిరస్సు వంచినా, తొలిపూజలు దక్కేదతనికే. అందుకే భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ చేసుకోవడం పుణ్యప్రదం. మోక్ష దాయకం!
విఘ్నాలను నివారించే వినాయకుని పూజతో మనం పండగను జరుపుకొంటాం. గణపతి అంటే ప్రకృతి ప్రియుడు. ఆయనకు మనం చేసే పూజ అంతా ప్రకృతి ఆరాధన కిందకే వస్తుంది. చెరువుల్లో మట్టిని తవ్వి తీసుకుని వచ్చి వినాయకుడిగా చేసి, మళ్లీ చెరువులోనే పూజించిన పత్రీపూలతో నిమజ్జనం చేయడం వెనక శాస్త్రీయత ఉంది. మట్టిని తీసి మళ్లీ అది ఎరువుగా, చెరువు నీరు కాలుష్య రహితంగా కావడానికి జరిగే ప్రక్రియ ఇందులో ఇమిడి ఉంది. మనం పూజించే మారేడు, ఉత్తరేణి వంటివి ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల వీటిని కాలుష్యం నుంచి కాపాడుతాయి. అందుకే వినాయకచవితి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పర్వదినంగా చూడాలి. ఏటా కొన్ని వేల గణపతి విగ్రహాలను రంగులతో అలంకరించి మండపాల్లో ఏర్పాటు చేస్తుంటాం. అలాగే ప్రతి ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ నిర్వహిస్తాం. ఇవన్నీ ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూడాలి. అలాగే ప్రకృతి పరిరక్షణ ద్వారా పండగల పరమార్థం తెలుసుకోవాలి. గణపతి నవరాత్రుల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని ప్రకృతి పరిరక్షణకు ఉపయోగిస్తే కరోనా లాంటి వైరస్లు మన దరి చేరవు. నేత్ర, మూత్ర, చర్మ సంబంధమైన రోగాలతోపాటు మరికొన్ని ఇతర వ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుందీ పత్రి. అంతేకాక ఆ పత్రి నుంచి వెలువడే సుగంధాన్ని పీల్చడం వల్ల కూడా స్వస్థత చేకూరుతుంది. పత్రిని మనం చేత్తో ముట్టుకోవడం వల్ల అందులో ఉండే వృక్ష సంబంధ రసాయన పదార్థాలు కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.
తొమ్మిది రోజుల తర్వాత వినాయకుణ్ణి బావుల్లో, నదుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా ఎందుకు చేయడం అంటే కలుషితమైన ఆ నీటిని శుభ్రం చేయడానికి ఈ 21 పత్రాలు ఉపయోగపడతాయట. ఇరవైమూడు గంటలయ్యాక తమలో ఉన్న ఔషధగుణాల ఆల్కలాయిడ్స్ ని నీళ్లలోకి వదిలేస్తాయి. దాని వల్ల నీటిలో ఉండే బాక్టీరియా నిర్మూలన జరిగి ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. పత్రి సేకరణ వల్ల వృక్ష విజ్ఞానంతో పాటు వినోదం, పర్యావరణం పట్ల స్నేహభావం కలుగుతాయి. చెరువుల్లో మట్టిని తవ్వి తీసి, వినాయకుడిగా చేసి, మళ్లీ చెరువులోనే పత్రీపూలతో నిమజ్జనం చేయడం అది ఎరువుగా, చెరువు నీరు కాలుష్యరహితంగా అవుతుంది. అందుకే వినాయకచవితి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పర్వదినంగా చూడాలి.
ఇటీవల కొంతకాలంగా విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్యారిస్, రసాయనాలు కలిగిన రంగులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వినాయక నిమజ్జనంతో ఈ రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చెరువులు, కుంటలు, తటాకాలు, బావులు, నదులకు పర్యావరణ నష్టం జరుగుతోంది. జలాల్లో నివసించే అనేక జీవకోటి మనుగడకు విఘాతం ఏర్పడుతోంది. నీరు కలుషితం అవుతోంది. హైదారాబాద్ హుస్సేన్ సాగర్లా కాలుష్య కాసారంగా మారుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను వాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. మట్టి గణపతులను తయారుచేయడం ద్వారా కొంతయినా పర్యావరణం కాపాడుకోగలం. ఇంట్లో పూజించే చిన్న చిన్న వినాయక విగ్రహాలను పూర్తిగా మట్టితో తయారుచేస్తే అవి పర్యావరణహితంగా వుంటాయి. నీటిలో సులభంగా కరిగిపోతాయి. ఎలాంటి రంగులను వాడకపోవడంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉండదు.
ఇక వీధుల్లో ప్రతిష్టించే పెద్ద విగ్రహాల తయారీలోనూ మట్టినీ, పర్యావరణ హితమైన రంగుల్నీ వాడటం ద్వారా పర్యావరణానికి మేలు చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి విగ్రహాల వల్ల నిమజ్జన సమయంలో జలాలు కలుషితం కావని చెబుతున్నారు.
ప్రకృతిని ప్రేమిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం!|EDITORIAL

