కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి సారించాలి. కనీసం ఈ బిల్లు సందర్భంగా అయినా విద్యా విధాన సంస్కరణలపై పార్లమెంటులో సార్థకమైన చర్చ జరిగి ఉంటే దేశానికి మరింత ఉపయోగకరంగా ఉండేది. ఆ పని మన పార్టీలు, మన ప్రభుత్వాలు చేయలేవన్నది మరోసారి ఆవిష్కారమైంది. ఆ చిత్తశుద్ధి మన పాలకులకు కొరవడటం మన దేశ ప్రజల దౌర్భాగ్యం.
‘పిల్లికి చెలగాటం… ఎలుకకు ప్రాణసంకటం’ అన్నట్లు మన దేశంలోని పరీక్షల వ్యవస్థ మారిపోయింది. ఇటీవల జరిగిన నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ ఘటన దేశ పరీక్షల నిర్వహణ ఎంత బలహీనంగా ఉందో మరోసారి బహిర్గతం చేసింది. డబ్బు కోసం కొందరు అధికారులు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కలిసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఆ తర్వాత పరిణామాల్లో ప్రభుత్వం కొత్త బిల్లును తెచ్చింది.
నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలలో అక్రమాలను నిరోధించేందుకు కొత్త బిల్లును తీసుకొచ్చింది. పార్లమెంటులో దీనిపై చర్చ జరిగినా, అధికార పక్షం గానీ, ప్రతిపక్షం గానీ పరీక్షల వ్యవస్థను సమూలంగా సంస్కరించే స్పష్టమైన నిర్మాణాత్మక సూచనలు చేయలేకపోయాయి. ప్రతిపక్షం ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికే పరిమితమైంది. ప్రభుత్వం కూడా కఠిన శిక్షలపై దృష్టి పెట్టింది తప్ప, అసలు లీకేజీలకే అవకాశం లేకుండా పరీక్షల నిర్వహణను పటిష్ఠం చేయాలనే కీలక అంశానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు.
పేపర్ లీకేజీ వంటి నేరాలకు కఠిన శిక్షలు అవసరమే. అయితే శిక్షలతో మాత్రమే సమస్య పరిష్కారం కాదు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, సాంకేతిక భద్రత, స్వతంత్ర పర్యవేక్షణ వంటి అంశాలను బిల్లులో తప్పనిసరిగా పొందుపరచాలి. లేకపోతే ఈ చట్టం కూడా కేవలం ప్రతీకాత్మక చర్యగానే మిగిలిపోతుంది.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతోనే దేశ విద్యా వ్యవస్థలోని లోపాలు తొలగిపోవు. తర్వాత జరిగే పరీక్షలన్నీ సజావుగా జరిగిపోవు. అసలు సమస్య వ్యవస్థలో ఉంది. అవినీతి, అక్రమాలు, పేపర్ లీకేజీలకు వ్యవస్థీకృత మూల కారణాలను నిర్మూలించకుండా వ్యక్తులను మార్చడం వల్ల శాశ్వత పరిష్కారం లభించదు.
ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరును సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఎన్టీఏ ఒక అకడమిక్ లేదా రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరీక్షల నిర్వహణ సంస్థ మాత్రమే. అయినప్పటికీ దేశవ్యాప్తంగా అనేక కీలక ప్రవేశ, పోటీ పరీక్షల నిర్వహణ బాధ్యతను దానికే అప్పగించారు. ఫలితంగా పరీక్షల నిర్వహణలో అధికారం కేంద్రీకృతమైంది.
నీట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే ప్రశ్నపత్రాల రూపకల్పనలో భాగస్వాములయ్యారన్న ఆరోపణలు వినిపించడం ఆందోళనకరం. దీని ద్వారా కోచింగ్ మాఫియా పరీక్షల వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతోందో అర్థమవుతోంది. వేల కోట్ల రూపాయల వ్యాపార ప్రయోజనాలు ముడిపడిన ఈ వ్యవస్థలో అధికార యంత్రాంగం సహకారం లేకుండా ఇలాంటి అక్రమాలు జరగడం సాధ్యం కాదు.
అందువల్ల ఎన్టీఏ ఉనికిని, దాని పనితీరును, జవాబుదారీతనాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. కేవలం కొందరు మధ్యవర్తులను, అధికారులు లేదా ఉద్యోగులను శిక్షించడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. అవినీతికి కారణమవుతున్న మొత్తం వ్యవస్థనే సంస్కరించాలి.
అదే సమయంలో, మెడికల్ ప్రవేశ పరీక్షలను మళ్లీ రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ప్రతిపాదనను కూడా చర్చించి, సమీక్షించాల్సిన అవసరం ఉంది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రాల హక్కులను పరిరక్షించే విధానాలపై కూడా చర్చ జరగాలి. అయితే రాష్ట్రాల స్థాయిలో గతంలో కూడా పేపర్ లీకేజీలు, అక్రమాలు జరిగిన విషయం మరవకూడదు. కాబట్టి పరిష్కారం కేవలం కేంద్రం లేదా రాష్ట్రం అనే ప్రశ్నలో కాకుండా, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పటిష్టమైన పరీక్షల నిర్వహణ వ్యవస్థను రూపొందించడంలో ఉంది.
ఇప్పటి పరిస్థితుల్లో చదువు అంటే వైద్యం, ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొద్ది కోర్సులకే పరిమితమైపోయింది. జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో ర్యాంకు సాధించడమే విద్యార్థుల లక్ష్యంగా మారింది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కోచింగ్ పరిశ్రమ వేల కోట్ల రూపాయల వ్యాపారంగా విస్తరించింది. విద్య ఒక సేవగా కాకుండా వ్యాపార వస్తువుగా మారిపోవడానికి ప్రభుత్వ విధానాలు కూడా కారణమయ్యాయి.
నిరుద్యోగం పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం వల్ల తల్లిదండ్రుల్లో పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితులను కోచింగ్ సంస్థలు వ్యాపార అవకాశాలుగా మలుచుకుంటున్నాయి. ఫలితంగా విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతోంది.
కాబట్టి పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కేవలం కఠిన శిక్షలు విధించడం సరిపోదు. సమగ్ర విద్యా సంస్కరణలు, పారదర్శక పరీక్షల నిర్వహణ, కోచింగ్ మాఫియాపై కఠిన నియంత్రణ, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, విద్యలో సమాన అవకాశాలను కల్పించడం వంటి చర్యలు అవసరం. ఇవన్నీ ప్రజల భాగస్వామ్యంతో, విస్తృత చర్చల ద్వారా అమలు చేయాల్సి ఉంటుంది.
కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి సారించాలి. కనీసం ఈ బిల్లు సందర్భంగా అయినా విద్యా విధాన సంస్కరణలపై పార్లమెంటులో సార్థకమైన చర్చ జరిగి ఉంటే దేశానికి మరింత ఉపయోగకరంగా ఉండేది. ఆ పని మన పార్టీలు, మన ప్రభుత్వాలు చేయలేవన్నది మరోసారి ఆవిష్కారమైంది. ఆ చిత్తశుద్ధి మన పాలకులకు కొరవడటం మన దేశ ప్రజల దౌర్భాగ్యం.

