CM|సీఎం ఇయ్యడు… KCR|కేసీఆర్ అడగడు
ASSEMBLY|అసెంబ్లీకి పోడు… జనంలోకి రాడు
OPPOSITION LEADER|ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పనికి రాడు
తమ SALARIES|జీతాలు పెంచుకునే పాలకులు
పేదలకు పెన్షన్లు ఎందుకు పెంచరు?
కుల, మతాలకంటే మానవత్వమే ముఖ్యం
ఆరోగ్య బీమా నుండి ఆరోగ్యశ్రీ వరకు
తెచ్చిన ఘనత MRPS|ఎమ్మార్పీఎస్ దే!
పెన్షన్లు పెరిగింది ఎమ్మార్పీఎస్ కారణంగానే
మంద కృష్ణ ఉద్ఘాటన, ఘాటైన విమర్శలు
పాలకుర్తిలో సన్నాహక సదస్సు
సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో జరిగే చేయూత వికలాంగుల మహాసభ జయప్రదానికి విజ్ఞప్తి
పాలకుర్తి, ఆగస్టు 12 (అడుగు న్యూస్):
పెన్షన్లు పెంచుతరా? లేక గద్దె దిగుతరా? అధికార పార్టీ తేల్చుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పెన్షన్లను పెంచి ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఇవ్వదు. అడగాల్సిన బీఆర్ఎస్ అడగదు. అంటే సీఎం ఇయ్యడు, కేసీఆర్ అడగడు. కేసీఆర్ అసెంబ్లీకి పోడు. జనంలోకి రాడు. ప్రతిపక్ష నేతగా పనికి రాడని తేల్చేశారు. ఇద్దరూ చంద్రబాబు శిష్యులే మరి, చంద్రబాబు అమలు చేస్తున్న పెన్షన్లను వీరెందుకు చేయడం లేదని ప్రశ్నించారు? తనకు కులం, మతం కంటే కూడా మానవత్వమే ఎక్కువని అందుకే తాను వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తుల కోసం పోరాడుతున్నానని చెప్పారు. ఇప్పటి వరకు పెరిగిన పెన్షన్లన్నీ ఎమ్మార్పీఎస్ పోరాడి సాధించినవేనని సోదాహరణగా వివరించారు.

వికలాంగులకు రూ.6 వేలు, వ్రుద్ధులకు, వితంతువులకు రూ.4 వేలు, కండరాల సమస్య (మయోసైటీస్)లతో బాధపడేవారికి రూ.15వేలు పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ, సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో నిర్వహించనున్న చేయూత పెన్షన్ దారుల గర్జన మహాసభకు సన్నాహకంగా జరుపుతున్న నియోజకవర్గాల స్థాయి సన్నాహక సమావేశాల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గ స్థాయి సదస్సు పాలకుర్తిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో మంగళవారం జరిగింది. ఈ సదస్సుకు మంద కృష్ణమాదిగ ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రసంగించారు.
20 నెలలు గడిచినా, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పెన్షన్లను పెంచలేదన్నారు. ప్రతిపక్షం ఈ విషయమై ప్రశ్నించడం లేదన్నారు. వాళ్ళు విస్మరించినందునే తాను ఈ సమస్యను నెత్తినెత్తుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాని మంద కృష్ణ చెప్పారు. అత్యంత పేదల సమస్యలను అత్యున్నత వర్గాల పార్టీలు, పాలకులు, ప్రభుత్వాలు పట్టించుకోవన్నారు. రూ.75గా ఉన్న పెన్షన్ ను రూ.200లకు, తర్వాత 2007లో రూ.500లకు, 2014లో రూ.1500లకు, 2015లో రూ.3,000లకు, దీన్నే ర.3016లకు పెంచే విధంగా ఉద్యమాలు చేసి, ఒత్తిడి తెచ్చిన ఘనత ఎమ్మార్పీఎస్ దేనని ఆయన ఉదాహరణలు, పేపర్, ఫోటో, ఆడియో క్లిప్పింగులతో సహా వివరించారు. ఆనాడు దేశంలోనే అత్యంత తక్కువగా, ఈనాడు అత్యంత ఎక్కువగా పెన్షన్లు నిరుపేదలకు అందుతున్నాయంటే దానికి కారణం ఎమ్మార్పీఎస్ అన్నారు. అలాగే ఆనాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్న ఉమ్మడి ఏపీలో పేదలకు ఆరోగ్య బీమా, తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని అందించినందునే ఇవ్వాళ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు చేతిలో ఉన్నట్లేగాక, ఆ మేరకు ఆరోగ్యం అందే అవకాశం ఏర్పడిందంన్నారు. ఇలాంటి ఉద్యమ చరిత్ర ఉన్న ఎమ్మార్పీఎస్ సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా పెన్షన్ దారులంతా తరలి రావాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ దారులతోపాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, మంద కృష్ణ అభిమానులు పాల్గొన్నారు.

