ఇది యుద్ధాల కాలంగా మారింది. ఎవరు ఎప్పుడు ఎవరిపై, ఏ దేశం మరే దేశంపై ఎప్పుడు దాడి చేస్తుందో తలియని కాలమిది. గత నాలుగైదేళ్లుగా ఉక్రెయిన్ రష్యాల మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం నిరంతరంగా చూస్తూనే ఉన్నాం. భారత్లో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత్ పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ప్రతిగా పాక్ ఇండియాపై దాడికి తెగించింది. పాక్ పప్పులుడకలేదు. దిక్కుతోచని పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. యుద్ధం ఆపాలన్న వినతిపై మరోమాట లేకుండా భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. 12 రోజుల క్రితం ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసింది. ఇరాన్ కూడా ప్రతిదాడులతో తిరగబడింది. చివరకు అమెరికా కూడా రణరంగానికి దిగి ఇరాన్పై విరుచుకు పడింది. చివరకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపించానని ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని కూడా తానే ఆపాలని కోరినట్లుగా ప్రకటించుకున్నారు. ప్రత్యక్షంగా యుద్ధానికి దిగి, ఇరాన్ దాడి చేసే సరికి తోకముడిచి, తానేదో శాంతికాముకుడినైనట్లు ట్రంప్ పోజు కొడుతున్నాడు.
ఏమైనప్పటికీ పశ్చిమాసియాలో ఒక యద్ధం ముగిసింది. లేదంటే ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన ప్రపంచ చమురు, ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభానికి గురయ్యేది. ఆయుధ సంపత్తి కలిగిన దేశాలు తమ ఆయుధాలను పరీక్షించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ మాదేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా ప్రకటన చేశారు. నిజానికి ఆయా దేశాల నేతల యుద్ధ కాంక్షల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వెనుకటికి రాజులు కూడా ఇలాగే యుద్ధాలు చేసి రాజ్యవిస్తరణకు పాల్పడేవారు. ఇప్పుడు మరో రూపంలో సామ్రాజ్యవాదం కొనసాగుతోంది. తమ ఆధిపత్యాన్ని అంగీకరించడం లేదన్న కారణంతో ఉక్రెయిన్పై రష్యా దాడికి తెగించింది. ఇరాన్ అణ్వస్త్ర ప్రయోగాలు చేస్తోందన్న కారణంతో ఇజ్రాయిల్, అమెరికాలు దాడికి తెగించాయి. ఈ దాడలతో ఇరాన్కు జరగాల్సిన నష్టం జరిగింది. అయితే పెద్దన్న పాత్రను పదిలపర్చుకోవాలన్న అమెరికా ఈ తరహా దాడులను ప్రోత్సహించడం సరికాదు. సాగినంత కాలం సరే, తర్వాత? యుద్ధ ప్రభావాలు బలహీన దేశాలపైనే కాదు, బలమైన దేశాలపై కూడా ఉంటాయి. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో, పరోక్షంగా అన్నీతానై ఇజ్రాయెల్తో కథ నడిపించిన అమెరికా, చివరకు ప్రత్యక్షంగా కూడా యుద్ధానికి దిగింది. ఇరాన్ పై దాడులకు తెగబడింది. ఇరాన్ ఎదురు తిరిగింది. తిరిగి కతార్ లోని అమెరికా స్థావరాలపై దాడులకు దిగే సరికి తోకముడిచి శాంతి జపం చేస్తోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తనను తాను యుద్ధ వ్యతిరేకిగా ప్రచారం చేసుకున్న ట్రంప్ స్వయంగా కయ్యానికి కాలు దువ్వాడు. చివరకు యుద్ధాన్ని ముగిస్తున్నట్లుగా ప్రకటించారు.
అమెరికా నిరంతరం యుద్ధాల్లో మునిగితేలడంతో ప్రపంచంలో అశాంతి చెలరేగిందంటూ ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్ , తాను అధికారంలోకి రాగానే అన్ని యుద్ధాలనీ ఆపేసి ప్రపంచానికి శాంతినిస్తానన్నాడు. ఆర్నెల్ల కాలంలోనే ఆయన తన అసలు రంగును బయటపెట్టుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఏడు బి2 స్పిరిట్ బాంబర్లు ఇరాన్లోకి ప్రవేశించి, మూడు అణుస్థావరాలవిూద బంకర్ బస్టర్ బాంబులు కురిపించాయి. ఇజ్రాయెల్ చేద్దామనుకున్న పనిని తానే స్వయంగా పూర్తిచేశారు. ఫర్దో, నతాంజ్ పాటు, శుద్ధి చేసిన యురేనియంను భారీ ఎత్తున నిల్వచేసిన ఇసఫహాన్ అణుకేంద్రాన్ని నాశనం చేయడానికి అదనంగా సబ్మెరైన్ల నుంచి ప్రయోగించిన టామాహాక్ క్రూయిజ్ మిసైళ్ళను ఉపయోగించారని వార్తలు వచ్చాయి. బీటూ బాంబర్లు, వందలాది యుద్ధవిమానాలు, సబ్మెరైన్లతో సహా సర్వ శక్తులనూ వాడి అమెరికా జరిపిన ఈ దాడిలో ఇరాన్ అణు స్థావరాలు ధ్వంసమైపోయాయి. పూర్తిగా, సమూలంగా వాటిని తుడిచిపెట్టేసినట్టు ట్రంప్ ప్రకటించాడు. చివరకు ఫలితం తేలింది కనుక యుద్ధం ముగిస్తున్నట్లు ప్రకటించాడు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పిటీలో భాగస్వామి కాకుండా, భారీగా అణ్వాయుధాలు పోగేసుకున్న ఇజ్రాయెల్, ఆ ఒప్పందం మీద సంతకం చేసిన ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు పోగుబడివున్నాయన్న ఆరోపణతో, ఇరాన్ను నిరాయుధం చేయడమే తన లక్ష్యంగా ప్రకటించి జూన్ 13న ఈ యుద్ధంలోకి దిగింది. కదనరంగంలోకి అమెరికా ప్రత్యక్ష ప్రవేశంతో ఆ మూడు అణుకేంద్రాలను నాశనం చేయడమనే లక్ష్యం పరిపూర్ణమైంది. అందుకే వెంటనే యుద్ధం ఆగిపోవాలి. ప్రపంచం ఇక కంటినిండా నిద్రపోవచ్చునని ప్రకటించి యుద్ధ విరమణను ప్రకటించేశాడు. అణుస్థావరాల నాశనంతో ఇరాన్ కాళ్ళబేరానికి వస్తుందని ట్రంప్ నమ్ముతున్నారు. శాంతిచర్చలకు, ఒప్పందాలకు కాలం చెల్లిందని, ఇక ప్రతీకారమే మిగిలిందని ప్రకటించిన ఇరాన్ కూడా శాంతిని కోరుకుంటూ యుద్ధ విరమణకు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఇందులో ఎవరు పట్టుదలకు పోయినా మారణహోమం తప్పదు. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చిరించినా ఆపని చేసే శక్తి లేదనే చెప్పాలి. దోహాలో ఉన్న అమెరికా స్థావరంపై దాడి చేసినా అది కూడా నామమాత్రమనే చెప్పుకోవాలి. ఇరాన్కు అత్యంత సమీపంలోనే అది గట్టిగా దెబ్బతీయగల దూరంలోనే అమెరికా స్థావరాలు అనేకం ఉన్నాయి. అయినా సాహసం చేయలేకపోయింది.
హర్ముజ్ జలసంధి మూతబడే ప్రమాదం ఉందంటూ వార్తలు రావడంతో స్టాక్మార్కెట్లు తలకిందులయ్యాయి. చమురుధరలు అమాంతంగా పెరిగాయి. ఇరాన్కు మాట సాయం చేస్తున్న దేశాలు ఆయుధాలతో ఆదుకుంటాయన్న నమ్మకం లేకుండా పోయింది. ప్రపంచానికి ఇంధనాన్ని సమకూర్చే ఈ కీలకమైన ప్రాంతం యుద్ధ జ్వాలల్లో కొనసాగడం సరికాదు. ఇదే ప్రపంచ దేశాలూ కోరుకున్నాయి. దీంతో ఎట్టకేలకు యుద్ధం ముగిసిందన్న ప్రకటన ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది.

