ఈ ఏడాది వేసవి తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ, వాటి నివారణకు చర్యలు చేపట్టడంలో పాలకులు విఫలమవుతున్నారు. ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కోవడంలో దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేయాల్సిన ప్రభుత్వాల నిర్లిప్తత, ప్రజల బాధ్యతారాహిత్యం శాపంగా మారుతోంది!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ఈ ఏడాది వేసవి తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ, వాటి నివారణకు చర్యలు చేపట్టడంలో పాలకులు విఫలమవుతున్నారు. ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కోవడంలో దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేయాల్సిన ప్రభుత్వాల నిర్లిప్తత ప్రజలకు శాపంగా మారుతోంది.
ఇటీవలి రోజుల్లో అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44°C నుంచి 46°C వరకు నమోదవుతున్నాయి. సాధారణ స్థాయిలకు మించి కనీసం 3–4°C ఎక్కువగా నమోదవుతున్న ఈ ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యానికే కాకుండా జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కనీస దైనందిన జీవనానికి ముప్పుగా మారుతున్నాయి. గ్రామాలు సహా, పట్టణాలు, నగరాల్లో కాంక్రీట్ నిర్మాణాలు వేడిని మరింత పెంచుతున్నాయి.
పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఎల్నినో పరిస్థితులు భారతదేశంలో నైరుతి రుతుపవనాలను బలహీనపరుస్తాయి. దేశానికి అవసరమైన వార్షిక వర్షపాతం లో 70% ఈ రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. ఈ ఏడాది 10% నుంచి 15% వరకు వర్షపాతం లోటు ఉండవచ్చని అంచనాలు చెబుతున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రావాల్సిన వర్షాలు తగ్గితే, ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడటం ఖాయం.
నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, అడవుల నరికివేత, కొండల ధ్వంసం కలిసి పర్యావరణ, వాతావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చెట్ల కొరత వల్ల భూగర్భ జలాల నిల్వలు తగ్గిపోతున్నాయి. పట్టణాల్లో చెట్ల నీడ అరుదుగా మారింది. గత కొన్ని దశాబ్దాల్లో అటవీ విస్తీర్ణం తగ్గడం వాతావరణ మార్పులకు ఒక ప్రధాన కారణంగా నిలుస్తోంది.
దేశంలో లభ్యమయ్యే మంచినీటి వనరుల్లో 80% వ్యవసాయానికి వినియోగమవుతున్నాయి. అయితే అసమర్థ నీటి నిర్వహణ, నీటి వినియోగంలో లోపాలు నీటి కొరతకు ప్రధాన సమస్యలుగా మారాయి. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి వినియోగం 30% లోపే ఉంది. ఫలితంగా వేసవిలో తాగునీటి కొరత తీవ్రంగా మారుతోంది.
రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి సహజ సారం తగ్గిపోతోంది. మరోవైపు సరఫరా సమస్యల కారణంగా రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందడం లేదు. కొన్ని ప్రాంతాల్లో 10–20% వరకు కొరత నమోదవుతోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు చమురు ధరలను పెంచుతున్నాయి. భారత్ తన చమురు అవసరాల్లో 85% దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో డీజిల్ ధరలు పెరిగి, వ్యవసాయ యంత్రాల వినియోగ ఖర్చు అధికమవుతోంది. ఎరువుల తయారీకి అవసరమైన ముడిసరుకు రవాణాపైనా ప్రభావం పడుతోంది.
పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న లాభాలు రైతులను సంక్షోభంలోకి నెడుతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో యువత ఈ రంగం నుంచి వైదొలుగుతోంది. కూలీల కొరత పెరిగి, యాంత్రీకరణపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది మరింత పెట్టుబడిని అమాంతం పెంచేస్తోంది.
ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. వర్షాభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ, నివారణ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. విత్తనాలు, ఎరువులు, రుణాలు సకాలంలో అందించాలి. ప్రాంతాల వారీగా అనుకూల పంటలపై రైతులకు మార్గనిర్దేశం చేయాలి. అత్యవసర పరిస్థితులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.
వేసవిలో తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా నీటి కొరత కనిపిస్తోంది. వర్షపు నీటి సంరక్షణ, సరఫరా వ్యవస్థల మెరుగుదల, నీటి వాడకంపై నియంత్రణ వంటి చర్యలు తక్షణం అమలు చేయాలి.
వాతావరణ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని గుణపాఠంగా తీసుకుని మార్పులు తీసుకురావడం జరగడం లేదు. ప్రకృతి హెచ్చరికలు పెరుగుతున్న ఈ సమయంలో ముందుచూపుతో చర్యలు తీసుకోవడం తప్పనిసరి. రైతాంగాన్ని రక్షించడం, నీటి వనరులను సంరక్షించడం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడం వంటివి ఇక ఆలస్యం చేయకూడని బాధ్యతలు. లేకపోతే భవిష్యత్తులో ఈ సమస్యలు మరింత తీవ్ర పరిణామాలకు దారి తీయడం ఖాయం.

