సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి.

హరప్పా
ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన మొదటి నగరం. అందుకే ఈ నాగరికతను హరప్పా నాగరికత అని కూడా అంటారు.
ఇక్కడ నాట్యం చేస్తున్న పురుషుడి బొమ్మ లభ్యమైంది. చెక్కతో చేసిన శవపేటిక, కుమ్మరి చక్రం, కాంస్యంతో చేసిన దర్పణాలు లభించాయి.
ఎడ్ల బండి మరియు కాంస్యంతో చేసిన కొలబద్ద కూడా లభించింది. ఈ కాలంలో శ్రామికులు నివసించిన ఇరుకైన గదులతో కూడిన ఇల్లు బయటపడ్డాయి. ఇక్కడ రెండు వరుసలలో ఆరు ధాన్యాగారాలు, ఒక్కో ధాన్యాగారం 50×20 పరిమాణంలో ఉంది.
మోహెంజోదారో
ఇది 1922లో సింధు నాగరికతలో బయల్పడిన రెండవ నగరం. సింధీ భాషలో మోహేజోదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం.
ఇక్కడ కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహము మరియు స్టీటైట్ తో చేసిన గడ్డపు మనిషి బొమ్మ ఇక్కడే లభించాయి. రాళ్ళతో చేసిన లింగాలు లభించాయి. దీనిని బట్టే అనుకోవచ్చు సింధు ప్రజలు లింగాన్ని పూజించేవారు అని. పశుపతి మహాదేవ ఉన్న ముద్రిక మరియు ఎద్దు బొమ్మ ఇక్కడే లభించింది.

మెసపోటోనియా కు చెందిన స్థూపాకార ముద్రికలు లభించాయి. దీనిని బట్టి సింధు ప్రజలు మెసపటోనియా ప్రజలతో వాణిజ్య సంబంధాలు జరిపారు అని గ్రహించవచ్చు.
ఇక్కడ తవ్వకాల్లో కుషానుల కాలంనాటి బౌద్ధస్థూపం బయల్పడింది.
ఒక ఊహ ప్రకారం ఈ నగరం ఏడు సార్లు వరదల్లో ధ్వంసం అయిందని తిరిగి నిర్మింపబడిందని చరిత్రకారులు చెప్తున్నారు.
ఇక్కడ 39×2×8 సైజుతో ఒక పెద్ద స్నానవాటిక, మహాధాన్యాగరం మరియు అసెంబ్లీహల్ కట్టడాలు బయల్పడ్డాయి.
లోథాల్
ఈ నగరం 1955లో కనుగొనబడింది. గుజరాతీ భాషలో లోథాల్ అంటే మృతులదిబ్బ అని అర్థం. ఇక్కడ ద్విఖననం అంటే ఒకే సమాధిలో రెండు అస్థిపంజరాలు ఉండడం. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ కాలంలో వివాహ వ్యవస్థ ద్వారా సతి లాంటి ఆచారాలు కూడా ఉన్నాయి అని.
లోథాల్ సింధు నాగరికత యొక్క ప్రధాన రేవుపట్టణం. సింధు ప్రజలు ఇక్కడి నుండే తమ వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించేవారు.
ఇక్కడ హోమగుండం, చదరంగపుబల్ల, బియ్యపుగుంజ, కాంస్యంతో చేసిన కొలబద్ద లభించింది. ఇక్కడి ప్రజలు వరి పండించారని లభించిన బియ్యపుగింజ ద్వారా కచ్చితంగా చెప్పవచ్చు.
బంగారం మరియు ఇతర విలువైన రాళ్ళతో చేసిన పూసలు మరియు రాగి గాజులు కూడా లభించాయి.
కాళీబంగన్
ఈ నగరం 1961లో బయల్పడింది. కాళీబంగన్ అంటే నల్లటి గాజులు అని అర్థం. ఇక్కడ నాగలితో దున్నిన భూమి బయల్పడింది.
ఇక్కడ హోమగుండాలు మరియు జంతుబలులకు సంబంధించిన ఆధారాలు లభించాయి.
ఛాన్సుధారో
ఈ నగరం 1931లో బయల్పడింది. కేవలం ఈ నగరం మాత్రమే సింధు నాగరికత కాలంలో కోట లేని ఏకైక నగరం.
ఛాన్సుధారో నగర నిర్మాణం స్పష్టంగా జరగలేదు. ఇక్కడ ప్రణాళికాబద్ధమైన ఇల్లు, రహదారులు నిర్మించబడలేదు. ఇక్కడ సిరాకుండ(inkpot) మరియు కాంస్యంతో చేసిన ఎడ్లబండి లభించాయి.
ఇక్కడ కొన్ని జంతువులు ముఖ్యంగా పిల్లికి సంబంధించిన అవశేషాలు లభించాయి.
ధోలవీర
ఈ నగరం 1991 లో బయల్పడింది. ఇక్కడ జలాశయం, స్టేడియం బయల్పడ్డాయి. ఈ ప్రాంతం నదీ తీరానికి దగ్గరగా లేకపోవడం వల్ల రిజర్వాయర్ నిర్మించడానికి ఆవశ్యకత ఏర్పడింది.
సింధు ప్రాంతాలన్నీ రెండు భాగాలు (ఎగువ నగరం, దిగువ నగరం) గా విభజించబడ్డాయి. కానీ ధోలవీర మాత్రం మూడు భాగాలుగా విభజించబడింది – ఎ) ఎగువ నగరం, బి) మధ్య నగరం, సి) దిగువ నగరం.
ఈ నగరం భిన్నమైన ప్రణాళికతో నిర్మింపబడింది. ఇక్కడి ప్రజలు గ్రిడ్ పద్ధతిని వినియోగించారు. రహదారులు వంకరలు లేకుండా అన్ని రహదారులు 90° ల కోణంలో ఖండించుకుంటూ ఉండే విధంగా నిర్మించారు. వీటిని చూస్తే చదరంగపుబల్ల నిర్మాణాన్ని తలపించేవిధంగా ఉంటాయి. ఇక్కడ భూగర్భ మురికి కాలువలు మరియు తలుపులు, కిటికీలు రహదారికి వెలుపలవైపున పెట్టుకున్నారు. ఇది సింధు నగర నిర్మాణం లో విశిష్ట లక్షణం. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు సింధు ప్రజలు పారిశ్యుద్ధానికి అధిక విలువ ఇచ్చారని.
సామాజిక వ్యవస్థ
సింధు ప్రజల సామాజిక వ్యవస్థపై కచ్చితమైన ఆధారాలు లభ్యంకావడంలేదు. కానీ చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.
- సింధు నాగరికతలో మాతృస్వామిక వ్యవస్థ కొనసాగింది. సింధు ప్రజల దైవం మాతృ దేవత కావడం తవ్వకాల్లో లభించిన స్త్రీమూర్తుల బొమ్మల ఆధారంగా ఆ కాలంలో మహిళలదే ఆధిపత్యం ఉండొచ్చని ఒక అభిప్రాయం.
- ఆనాటి సమాజంలో కుల వ్యవస్థ కనబడదు కానీ ఆర్థిక వ్యత్యాసాలు మరియు వివక్షలు కొనసాగేవి అని చెప్పవచ్చు. ఎందుకంటే ధనికులు అత్యాధునిక హంగులతో ఎగువ నగరంలో జీవిస్తే సామాన్య ప్రజలు సాదాసీదా జీవితాన్ని దిగువ నగరంలో గడిపారు.
- సింధు ప్రజలు అలంకార ప్రియులు. ఎందుకనగా తవ్వకాల్లో దువ్వెనలు, దర్పణాలు, కాటుక మరియు ఇతర సౌందర్య సాధనాలు లభించాయి. బంగారం, వెండి వంటి ఆభరణాలను కూడా ఉపయోగించారు.
పరిపాలనా వ్యవస్థ
సింధు నాగరికత బలమైన కేంద్రీకృత వ్యవస్థగా కొనసాగిందని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. పట్టణాల్లో స్ధానిక ప్రభుత్వాలు ఉండి పారిశ్యుద్ధం, వీధి దీపాలు మరియు నగర నిర్వహణ గురించి చూసుకునేవారు అని చెప్పుకోవచ్చు.
ఆర్థిక వ్యవస్థ
ఈ కాలంలో అత్యంత సంపన్నమైన, బలమైన ఆర్థిక వ్యవస్థ కొనసాగింది. ఎందుకంటే సింధు ప్రజలు మెసపటోనియా ప్రజలతో వ్యాపార సంబంధాలను కలిగి ఉండి వస్తువులను ఎగుమతి చేసేవారు. ఆర్థిక వ్యవస్థలో మనం ముఖ్యంగా మూడు విషయాలను. చర్చించాలి.
1) వ్యవసాయం: సింధు నాగరికత వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ వ్యవసాయం వెన్నెముకగా ఉండి ప్రజలు గోధుమ, బార్లీ, పత్తి, నువ్వులు మరియు వివిధ రకాలైన పండ్ల, కూరగాయలను పండించేవారు.
వరికి సంబంధించిన ఆధారాలు లోథాల్ లో లభించిన బియ్యపుగింజ, గుజరాత్ లో లభించిన వరి పొట్టు ఆధారంగా ఇక్కడి ప్రజలు వరిని పండించారని చెప్పవచ్చు. కాళీబంగన్ లో లభించిన నాగలి దీనికి మరొక ఉదాహరణ.
2) పరిశ్రమలు: సింధు ప్రజలు ముఖ్యంగా గుజరాత్ తీర ప్రాంతంలో వాణిజ్య వ్యాపారాలను కొనసాగించేవారు. లోథాల్ ప్రాంతంలో వివిధ రకాలైన చేతి వృత్తులు, ఒక నౌకాశ్రయం బయటపడింది. సింధు ప్రజల కాలంలో వస్త్ర పరిశ్రమ, కుండల పరిశ్రమ, ఇటుక పరిశ్రమ, లోహ పరిశ్రమలు బాగా అభివృధ్ది చెందాయి.
సింధు ప్రజలకు ఇనుము తెలియదు. వీరు పూర్తిగా రాగి, కాంస్యంతో వివిధ రకాలైన పనిముట్లు, ఆయుధాలను తయారుచేసుకునేవారు.
3) వాణిజ్య సంబంధాలు: సింధు ప్రజలు నదీ తీరాన జీవించడం వల్ల నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యాపారం బాగా అభివృధ్ది చెందింది. ఎడ్లు, పడవల ద్వారా నదీ వ్యవస్థలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. సింధు ప్రజలు మెసపటోనియా ప్రజలతో మరియు అంతర్జాతీయ వ్యాపారాన్ని కూడా కొనసాగించారు. లోథాల్ వీరి కాలంలో ప్రధాన రేవుపట్టణంగా కొనసాగింది. వీరు పత్తి, నూలు వస్త్రాలు, ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేవారు. బంగారం, వెండి, రాగి, తగరం మొదలగు వాటిని దిగుమతి చేసుకునేవారు.
మత విశ్వాసాలు
సింధు ప్రజల ప్రధాన దైవం మాతృ దేవత లేదా అమ్మతల్లి. వీరి మరొక దైవం పశుపతి మహాదేవుడు. ఈ పశుపతి మహాదేవుడే తరువాతి కాలంలో శివుడిగా మారాడని నమ్మకం. మోహేంజోదారోలో లభ్యమైన ఒక చతురస్రాకార ముద్రిక పైన మూడు తలలు కలిగిన దేవుని ప్రతిమ ఉంది. దీనికి ఇరువైపుల ఏనుగు, బర్రె, పులి, ఖడ్గమృగపు బొమ్మలు మరియు పాదాల దగ్గర జింకలు ఉంటాయి.

వీరు పాము, చెట్టు, ఎద్దు, పావురాలను కూడా పూజించేవారు.
వీరి కాలంలో మూఢనమ్మకాలు కూడా ఉండేవి. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం తవ్వకాల్లో బయల్పడిన తాయత్తులు దీనికి నిదర్శనం.

