భారత రాజకీయాల్లో ప్రతి అసెంబ్లీ ఎన్నిక జాతీయ ఎన్నికలపై ప్రభావం చూపేదే. దేశ రాజకీయాలను మలుపు తిప్పేవే. సంకీర్ణ దశ నడుస్తున్న ప్రస్తుత దశలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. గత కొన్ని దశాబ్దాలుగా సంకీర్ణాలే దేశాన్ని ఏలుతున్నాయి. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమిలేనిదే ఏ పార్టీ అధికారంలోకి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కో రాష్ట్రం, ఆయా రాష్ట్రాల్లోని ఒక్కో సీటూ కీలకంగా మారాయి. అందుకే ప్రతి ఎన్నికా, ఉప ఎన్నికా నువ్వా? నేనా? అన్నట్లుగా సాగుతున్నాయి.
ప్రజలు కోరుకుంటున్న మార్పునకు ప్రతీకే ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వాటి ఫలితాలు.
ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ ఐదు రాష్ట్రాల్లో వచ్చిన తీర్పులు ప్రాంతీయ రాజకీయ గణాంకాలను మాత్రమే కాదు, జాతీయ పార్టీల స్థితిగతులను కూడా ప్రతిబింబించాయి.
పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ మట్టి కరిచింది. అన్నది అన్నట్లుగానే బీజేపీ విజయం సాధించింది. 294 స్థానాల్లో సుమారు 206 సీట్లను గెలుచుకుని మమతపై తిరుగలేని విధంగా గెలిచింది. తృణమూల్ పార్టీ 80 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా మిగిలింది. జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, స్వతంత్రులు రెండేసి సీట్లతో సరిపెట్టుకున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో బీజేపీ కొనసాగించిన సర్ ఓట్ల సవరింపు, రాజకీయ చాణక్యం సక్సెస్ సాధించింది. బెంగాల్ ఓటర్లు స్థానికం నుంచి జాతీయ బీజేపీని ఈ సారి ఎంచుకున్నారు.
తమిళనాడులో ద్రవిడ పార్టీలు ఖంగు తిన్నాయి. దశాబ్దాల నాటి సంప్రదాయ ఓటుకు భిన్నంగా తమిళ ప్రజలు సంచలన తీర్పునిచ్చారు. ద్రవిడ పార్టీలను కాదని, తమిళగ వెట్రి కజగం అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకుంది. 234 స్థానాల్లో టీవీకే 107స్థానాలతో అత్యధిక మెజార్టీని సాధించిన పార్టీగా నిలిచింది. డీఎంకే కూటమి 74 సీట్లతో సరి పెట్టుకుంది. అన్నాడీఎంకే కూటమి 53 స్థానాలకు పరిమితమైంది. సీఎం ఎం.కే. స్టాలిన్ ఓడిపోయారు. ద్రావిడ రాజకీయాలకు తమిళ ప్రజలు తిలోదకాలిచ్చారు. రాజకీయాలకు కొత్త, పరిపాలనా అనుభవంలేని, విజయ నాయగన్ విజయ్ నే ప్రజలు నమ్మారు. దళపతికి ఎవరు మద్దతుగా నితుస్తారన్నది ఆసక్తిగా మారింది.
కేరళలోనూ సంప్రదాయాన్ని చెరిపేస్తూ ఎల్డిఎఫ్ ను కాదని యూడీఎఫ్ పై ప్రజలు మొగ్గారు. 140 స్థానాల్లో యూడీఎఫ్ 102 సీట్లు గెలుచుకుంది. ఎల్ డీఎఫ్ 35 స్థానాలకు పరిమితమైంది. ఇక్కడ ఎన్డీయే కేవలం 3 స్థానాలతోనే నిలిచింది. పినరయి విజయన్ తన పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతను చాటారు.
అసోంలో భారతీయ జనతా పార్టీ తన పట్టు నిలుపుకుంది. 127 స్థానాల్లో బీజేపీ కూటమి గతాని(75)కి మించి 102 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 21 స్థానాలు సాధించింది. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఈ ఎన్నికల ప్రత్యేకత. అభివృద్ధి, జాతీయ భద్రత, మరియు స్థానిక సమస్యలపై సమన్వయ ప్రచారం బీజేపీ విజయానికి దోహదపడింది.
పుదుచ్చేరిలో 30 స్థానాల్లో బీజేపీ-ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి 18 సీట్లతో అధికారాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ కూటమి ఇక్కడ వెనుకబడింది. చిన్న ప్రాంతం అయినప్పటికీ, ఈ ఫలితం దక్షిణ భారతంలో బీజేపీ విస్తరణకు సంకేతంగా పరిగణించబడింది.
మొత్తంగా ఈ ఐదు రాష్ట్రాల తీర్పులు కొన్ని కీలక సందేశాలను ఇస్తున్నాయి. ప్రజలు కోరుకుంటున్న మార్పును సూచిస్తున్నాయి. సంప్రదాయ పద్ధతులకు భిన్నమైన తీర్పులు వెలువడ్డాయి. మహిళలు, యువత అత్యధికంగా ఓట్లు వేయడాన్ని గమనించొచ్చు. అప్రతిహతంగా బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని, ఒక్కో ప్రాంతాన్ని వరసగా గెలుస్తుండటం కనిపిస్తోంది. ప్రాంతీయ నాయకత్వం బలంగా ఉంటే జాతీయ పార్టీల ప్రభావాన్ని తగ్గించగలదని తమిళనాడు స్పష్టం చేసింది. సంక్షోభ నిర్వహణ మరియు పాలనా విశ్వసనీయత ఓటర్లను ప్రభావితం చేస్తాయని బెంగాల్ చూపించింది. సరైన కూటమి వ్యూహం మరియు నాయకత్వ మార్పు విజయానికి దారితీస్తాయని అస్సాం, పుదుచ్చేరి నిరూపించాయి.
ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లో వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రతి రాష్ట్రం తన ప్రత్యేక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తీర్పు ఇస్తోంది. అందువల్ల ఈ ఫలితాలను ఒకే రాజకీయ పార్టీ విజయంగా లేదా ఓటమిగా చూడటం కంటే, భారత ప్రజాస్వామ్యంలోని బహుముఖ స్వభావంగా చూడటం సముచితం.
ఈ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపడం ఖాయం. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం కొనసాగుతూనే, జాతీయ పార్టీలు తమ వ్యూహాలను మరింత స్థానికీకరించాల్సిన అవసరం స్పష్టమైంది. ఓటరు చైతన్యవంతుడు, అతను తన రాష్ట్ర అవసరాల ప్రకారం నిర్ణయం తీసుకుంటాడు. అన్నింటికీ మించి మార్పును ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టమైంది.

