దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కేవలం రాజకీయ విజయాలు, విమర్శలతో దేశం ముందుకు సాగదు. బలమైన ఆర్థిక వ్యవస్థే నిజమైన జాతీయ శక్తి. పరిస్థితి తీవ్రతను గుర్తించి తక్షణ చర్యలు చేపడితేనే దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలదు.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
దేశంలో రెండు పరస్పర విరుద్ధ అంశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజకీయాల్లో, నాయకుల్లో విజయోత్సాహాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆర్థిక సంక్షోభ ఆందోళనకర సంఘటనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల విజయాలు తాత్కాలిక ఉత్సాహాన్ని కలిగించవచ్చు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే ఆ ప్రభావం చివరకు ప్రజల జీవితాలపైనే పడుతుంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిశీలిస్తే, ఇది సాధారణ ఆర్థిక మందగమనం కాదు. సమగ్ర జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిగా చూడాల్సిన దశకు చేరుకుంది.
పశ్చిమాసియా యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల ప్రభావంతో అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 107 డాలర్లకు చేరుకుంది. మరోవైపు రూపాయి విలువ అత్యంత దయనీయంగా డాలర్కు రూ.96 సమీపానికి పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రూపాయి పతనం అంటే దిగుమతుల భారం మరింత పెరగడం. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారతదేశానికి ఇది తీవ్రమైన దెబ్బ.
ఇప్పటికే దేశ విదేశీ మారక నిల్వలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దిగుమతులు విపరీతంగా పెరుగుతుండగా, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవు. ఈ పరిస్థితిలో బంగారం దిగుమతులు మరింత భారం అవుతున్నాయి. బంగారం వంటి ఉత్పాదకేతర వస్తువుల దిగుమతులపై కఠిన నియంత్రణలు అవసరం. అంతేకాదు, దేశీయ రైతుల పంటలకు పోటీగా మారుతున్న ఆహార ధాన్యాల దిగుమతులపైనా ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం అధికారిక వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 3.5 శాతంగా ఉన్నప్పటికీ, ఆహార ద్రవ్యోల్బణం 4.33 శాతంగా నమోదవుతోంది. టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 8.3 శాతానికి చేరుకోవడం ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న సంకేతం. గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.913 కాగా, కమర్షియల్ సిలిండర్ ధర రూ.3077 నుంచి రూ.3237 వరకు ఉంది. పెరుగుతున్న ఇంధన ధరలు రవాణా ఖర్చులను పెంచి చివరకు ప్రతి వస్తువు ధరను ప్రభావితం చేస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తి పెంచే చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కావాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. వినియోగదారుడికి సరసమైన ధరకు సరుకులు అందడం లేదు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో వరి, మక్కజొన్న, మిర్చి, శనగ వంటి పంటలు విస్తారంగా పండుతున్నప్పటికీ రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. మధ్యవర్తుల లాభాలు పెరుగుతున్నాయి గానీ రైతు–వినియోగదారుల మధ్య ధరల అసమానత తగ్గడం లేదు.
దేశ గోదాముల్లో లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వగా ఉన్నప్పటికీ, వాటిని సరసమైన ధరలకు ప్రజలకు అందించే సమగ్ర విధానం కనిపించడం లేదు. ఉచిత పథకాలకన్నా, తక్కువ ధరలకు నాణ్యమైన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం సమర్థవంతమైన ఆర్థిక విధానంగా ఉంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడకపోతే దేశ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం రాదు.
ఇక ప్రభుత్వ వ్యయ నియంత్రణ కూడా అత్యంత కీలకం. ప్రజలు పొదుపు పాటించాలని చెప్పే ముందు పాలకులు ఆదర్శంగా నిలవాలి. ప్రజాప్రతినిధుల అధిక సౌకర్యాలు, భారీ కాన్వాయ్లు, అవసరం లేని ప్రభుత్వ వ్యయాలు తగ్గించాలి. వందల లీటర్ల ఇంధనం ఖర్చు చేసే కాన్వాయ్లు ఆర్థిక క్రమశిక్షణకు వ్యతిరేకం. ప్రభుత్వ యంత్రాంగం ముందుగా ఖర్చు నియంత్రణ పాటిస్తేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది.
అదేవిధంగా ఇంధనం, వంటనూనెలు, ఎరువుల వినియోగంలో దేశవ్యాప్తంగా పొదుపు చర్యలు చేపట్టాలి. అవసరం లేని దిగుమతులను తగ్గించి, “దేశీయ ఉత్పత్తి–దేశీయ వినియోగం” అనే విధానాన్ని బలోపేతం చేయాలి. స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా విదేశీ మారకద్రవ్యంపై ఒత్తిడి తగ్గించవచ్చు.
ప్రస్తుతం అత్యవసరంగా చేయాల్సింది రూపాయి మారకం విలువను స్థిరీకరించడం. రూపాయి నిరంతరం పతనం అవుతుంటే విదేశీ మారక నిల్వలు మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలి. దిగుమతుల నియంత్రణ, ఎగుమతుల ప్రోత్సాహం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ అవసరం.
దేశం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిని రాజకీయ కోణంలో కాకుండా జాతీయ సంక్షోభంగా చూడాలి. ఆర్థిక నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, గ్రామీణ సంఘాలతో కలిసి సమగ్ర చర్చలు జరపాలి. తక్షణ చర్యల కోసం ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజల అభిప్రాయాలు సేకరించాలి.
దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కేవలం రాజకీయ విజయాలు, విమర్శలతో దేశం ముందుకు సాగదు. బలమైన ఆర్థిక వ్యవస్థే నిజమైన జాతీయ శక్తి. పరిస్థితి తీవ్రతను గుర్తించి తక్షణ చర్యలు చేపడితేనే దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలదు.

