వైద్యశాస్త్రం ఎంతో పురోగమించినా, ప్రాణాంతక వ్యాధులకు సైతం చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, ‘క్షయ’-టీబీ వ్యాధి మాత్రం ఇప్పటికీ ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని వణికిస్తూనే ఉంది. గణాంకాలను పరిశీలిస్తే గుండె గుబేల్ మంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు, మన దేశంలో ప్రతిరోజూ వెయ్యి మంది క్షయ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు! ప్రపంచంలోని మొత్తం టీబీ కేసుల్లో మూడింట రెండు వంతులు కేవలం ఎనిమిది దేశాల్లో ఉండగా, అందులో భారత్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో ప్రతి సెకనుకు ఒకరికి టీబీ సోకుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది!!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
వైద్యశాస్త్రం ఎంతో పురోగమించినా, ప్రాణాంతక వ్యాధులకు సైతం చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, ‘క్షయ’-టీబీ వ్యాధి మాత్రం ఇప్పటికీ ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని వణికిస్తూనే ఉంది. గణాంకాలను పరిశీలిస్తే గుండె గుబేల్ మంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు, మన దేశంలో ప్రతిరోజూ వెయ్యి మంది క్షయ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. 1882 మార్చి 24న డాక్టర్ రాబర్ట్ కోచ్ ‘మైకో బ్యాక్టీరియమ్ టూబరిక్లోసిస్’ అనే సూక్ష్మక్రిమిని కనుగొన్నప్పటి నుండి, ఈ వ్యాధిపై పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ చారిత్రాత్మక ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి ఏటా మార్చి 24ను ‘ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం’గా జరుపుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. అయినప్పటికీ, నిర్లక్ష్యం, అవగాహనా లోపం, చికిత్సను మధ్యలోనే నిలిపివేయడం వంటి కారణాల వల్ల టీబీ మహమ్మారి ఇంకా విస్తరిస్తూనే ఉంది.
క్షయ అనేది కేవలం ఊపిరితిత్తులకు పరిమితమైన వ్యాధి మాత్రమే కాదు. ఇది గాలి ద్వారా వ్యాపించే ఒక ప్రమాదకరమైన అంటువ్యాధి. బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే సూక్ష్మ బిందువుల ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేసినప్పటికీ, ఇది మెదడు, వెన్నెముక, మూత్రపిండాలు, చర్మం వంటి శరీరంలోని ఇతర భాగాలకు కూడా పాకవచ్చు. రెండు వారాలకు మించి తగ్గని దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి మందగించడం, వేగంగా బరువు తగ్గడం, కఫంలో రక్తం పడటం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరం. సకాలంలో గుర్తిస్తే 6 నుండి 9 నెలల క్రమబద్ధమైన చికిత్సతో క్షయను పూర్తిగా నయం చేయవచ్చు.
భారతదేశం విషయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ప్రపంచంలోని మొత్తం టీబీ కేసుల్లో మూడింట రెండు వంతులు కేవలం ఎనిమిది దేశాల్లో ఉండగా, అందులో భారత్ అగ్రస్థానంలో ఉంది. 2016 నాటి గణాంకాల ప్రకారం 10 లక్షల మంది చిన్నారులు ఈ వ్యాధి బారిన పడటం, అందులో 2.5 లక్షల మంది మరణించడం అత్యంత విషాదకరం. దేశంలో ప్రతి సెకనుకు ఒకరికి టీబీ సోకుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ప్రభుత్వం 1962 నుండే నివారణ చర్యలు చేపట్టినప్పటికీ, సామాజికంగా ఉన్న అపోహలు, వ్యాధి పట్ల ఉన్న భయం వల్ల చాలా మంది చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా పోషకాహార లోపం ఉన్నవారు, సిలికోసిస్ బాధితులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వ్యాధి త్వరగా సోకే ప్రమాదం ఉంది.
క్షయ నివారణలో ఎదురవుతున్న అతిపెద్ద సవాలు ‘మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ’ –ఎండీఆర్, టీబీ. చికిత్స ప్రారంభించిన కొద్దిరోజులకే ఆరోగ్యం మెరుగుపడిందని భావించి, రోగులు డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం ఆపేస్తున్నారు. దీనివల్ల బ్యాక్టీరియా మందులకు లొంగని విధంగా శక్తివంతంగా మారుతుంది. ఇది ప్రాణాంతకం కావడమే కాకుండా, చికిత్సను మరింత సంక్లిష్టం చేస్తుంది. చికిత్స సమయంలో ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం తప్పనిసరి. ఎందుకంటే టీబీ మందులు కాలేయంపై ప్రభావం చూపుతాయి, మద్యం తోడైతే అది కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, బలవర్ధకమైన ఆహారం, చికిత్సలో క్రమశిక్షణ పాటిస్తే క్షయను జయించడం అసాధ్యమేమీ కాదు.
క్షయ కేవలం వ్యక్తిగత ఆరోగ్య సమస్య కాదు. అది సామాజిక విపత్తు. వ్యాధిని దాచడం కంటే, దానిని గుర్తించి చికిత్స పొందడం వల్ల అటు వ్యక్తిగతంగాను, ఇటు సమాజ పరంగాను మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం క్షయ నిర్మూలనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్న తరుణంలో, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. “క్షయ రహిత భారత్” నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవడం, రోగులు మందుల కోర్సును పూర్తి చేయడం ద్వారానే ఈ మృత్యుఘంటికలను ఆపగలం. అవగాహన, ఆచరణే ఈ మహమ్మారికి అత్యుత్తమ ఆయుధం.

