ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో మూడు రోజుల పాటు జరుగుతున్న 24 వ వచన విజయోత్సవం ప్రారంభ సమావేశ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మొదట, సభాధ్యక్షత వహించిన కర్ణాటక ప్రభుత్వ గౌరవ మంత్రి, వచన విజయోత్సవ స్వాగత సమితి అధ్యక్షులు శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారికి నా మనఃపూర్వక నమస్కారాలు. తమ దివ్య సాన్నిధ్యంతో ఆధ్యాత్మిక అనుకంపనలు ప్రసాదించిన పరమ పూజ్యులు డాక్టర్ బసవలింగ పట్టదేవరు మరియు డాక్టర్ శివానంద మహాస్వామి వారలకు నా ప్రణామాలు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ నేతృత్వం వహిస్తున్న పూజ్య డాక్టర్ గంగాంబిక అక్క గారికి నమస్కృతులు. వరిష్ఠ సాహితీవేత్త ప్రొఫెసర్ సిద్ధరామయ్య, విచ్చేసిన ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, సర్వులకూ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజానాయకుడు డాక్టర్ భీమన్న ఖండ్రే గారిని స్మరించుకుంటూ, వారి ఆశీస్సులు అర్థిస్తున్నాను.
నేను డాక్టర్ రాపోలు సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా పాలకుర్తి లోని సోమనాథ కళాపీఠం అధ్యక్షుడిని. పాలకుర్తి – తెలంగాణ ఆది కవి పాలకురికి సోమనాథుని జన్మస్థలం. సాంస్కృతికంగా, భౌగోళికంగా మనకు ఆత్మీయ బంధం ఉన్నది. బీదర్ ప్రాంతం, కళ్యాణ కర్ణాటక 1956 దాకా హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగం. పాలకురికి సోమనాథుడు బసవన్న మరియు శరణుల జీవిత చరిత్రను తెలుగు భాషలో వ్రాసిన తొలి కవి. తర్వాత భీమ కవి ద్వారా కన్నడలోనికి అనువదించబడింది. బసవన్న గారిని భక్తికి ప్రతి రూపంగా భావించినాడు సోమన్న.
ఉదాహరణ:
వడి వీచు గాడ్పున కొడలెల్ల తలలు,
వడి కాలు చిచ్చున కొడలెల్ల నోళ్లు,
వడి పారు జలమున కొడలెల్ల కాళ్లు,
వడి సేయు బసవని కొడలెల్ల భక్తి.
ఈ పద్య పాదాలు పాలకురికి సోమనాథునికి బసవన్న పట్ల ఉన్న భక్తి గాఢతను చూపిస్తున్నాయి.
గురు బసవన్న, ఇతర శరణుల వచనాలు ప్రజల భాషలో వ్రాయబడినాయి. సోమనాథుడు కూడా ప్రజలకు చేరేలా సరళమైన ద్విపద పద్యాలలో బసవ పురాణాన్ని వ్రాసినారు. ఈ ద్విపదలు సులభంగా పాడి ఆస్వాదించగల రీతిలో ఉంటాయి. సోమనాథుడు బసవ పురాణం ద్వారా తెలుగు నేలపై బసవ తత్త్వం, బసవ ధర్మం విస్తరించడంలో మహత్తరమైన కృషి చేసినాడు. అంతేకాదు, ప్రజల ఆలోచన శైలిలో మార్పుతో పాటు, సాహిత్య విప్లవం తీసుకొని వచ్చినాడు. వచన సాహిత్యం ప్రజల సాహిత్యం. సోమనాథుని రచనలు కూడా ప్రజల కోసమే.
గురు బసవన్న ప్రజలకు ఇష్టలింగాన్ని ప్రసాదించడం ద్వారా భగవంతుని ప్రజాస్వామ్యీకరించినారు. భక్తి, కాయకం, దాసోహం, హేతుబద్ధత వంటి విలువలను ప్రజల్లో చొప్పించినారు. సోమనాథుడు కూడా అదే మార్గంలో నడిచినాడు. సోమనాథుడు బసవన్న భావాలను తెలుగు నేల మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేసినారు. బసవన్న అనుచరులు ఇప్పటికీ సామాజిక, రాజకీయ రంగాల్లో మార్పులు తీసుకువస్తున్నారు.
సుప్రసిద్ధ తెలుగు కవి – గాయకుడు గద్దర్ లింగాయత అనుయాయి మరియు బసవ అవార్డు గ్రహీత. ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతమైన సమాజం కోసం జరిగే ప్రయత్నాలు అన్నీ మనకు బసవన్న గారి సిద్ధాంతాలను గుర్తుచేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం పాలకుర్తిలో సోమనాథ స్మృతి వనం నిర్మించి, పెద్ద శిల్పాన్ని ప్రతిష్టించింది.
హైదరాబాద్లో బసవ భవన్ నిర్మాణానికి భూమి కేటాయించింది. కర్ణాటక ప్రభుత్వం బసవన్నను సాంస్కృతిక నాయకుడిగా ప్రకటించింది. ఇక్కడ రామనగర జిల్లా, మాగడి సమీప కల్య గ్రామంలో పాలకురికి సోమనాథుని లింగైక్య స్థలాన్ని స్మారక స్థలంగా అభివృద్ధి చేయాలని, ముఖ్యమైన భాషలలో బసవ పురాణం మరియు వచనాలు అనువదించి ప్రచురించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సోమనాథ కళాపీఠం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము.
చివరగా, డాక్టర్ గంగాంబిక అక్క గారిని పరిచయం చేసిన శరణ మడపతి వీరయ్య స్వామికి, లింగాయత ధర్మంలో ముఖ్యమైన సూక్ష్మాలు తెలిపిన ప్రొఫెసర్ కె నీలకంఠేశ్వర్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మూడు రోజుల ఉత్సవాలు ఘనంగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ శరణు శరణార్థులు!


