ఉగాది పండుగ ఆచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించాడు. నువ్వుల నూనెతో తలంటు స్నానం (తైలాభ్యంగనం), ఉగాది స్తోత్రం, ఉగాది పచ్చడి సేవనం, పూర్ణకుంభ దానం, పంచాంగ శ్రవణం వంటి ఐదు చర్యలను నిర్దేశించాడు. ఈ పంచ విధులను ఎలా ఆచరించాలనే విషయాన్ని మనం మన పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయంగా జరుపకుంటున్నాం. ఈ సంప్రదాయ పద్ధుతలనే మరింత వివరంగా తెలుసుకుందాం. సాధ్యమైనంత మేరకు తు.చ తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేద్దాం.
1. తైలాభ్యంగన స్నానం
తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. పండుగాది శుభదినాలలో సూర్యోదయానికి ముందే లక్ష్మీదేవి నూనెలోనూ, గంగమ్మతల్లి నీటిలోనూ ఆవహించి ఉంటుందని నమ్మకం. కాబట్టి నూనెతో తలంటుకుని స్నానం చేస్తే లక్ష్మీదేవి, గంగమ్మతల్లుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్య రీత్యా, ఆధ్యాత్మిక రీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడింది.
2. ఉగాది స్తోత్రం
స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్య దీప ధూపాధి, పుణ్యకాలానుష్టానం ఆచరించిన తర్వాత మామిడి ఆకుల తోరణాలు, పూలతోరణాలతో దేవుని గదిలో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో పాటు పూజించి ఉగాది పచ్చడి నివేదించాలి.
3. ఉగాడి పచ్చడి సేవనం
ఉగాది ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేప పువ్వు, కొత్త చింత పండు, బెల్లం, ఉప్పు, మామిడి కాయ ముక్కలు, కారం షడ్రుచులతో కూడినదే ఉగాడి పచ్చడి!
అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అంతా కలిసి పరగడుపుననే తాగాలి. ఉగాదినాడు ఉగాది పచ్చడి తాగడం వల్ల ఆ ఏడాదంతా సుఖ:సంతోషాలు కలుగుతాయని ఈ శ్లోక భావం. షడ్రుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! చేదు, తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు ఇలా షడ్రుచులకు జీవిత గమన అనుభూతులకు ప్రతీకలనే సత్యాన్ని చాటుతున్నాయి. అన్నింటినీ సమ భావంతో స్వీకరించాలనే సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఆరోగ్య పరిపుష్టి చేకూరుతుంది.
4. పూర్ణ కుంభదానం
ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం లాగా కట్టి దానిపై కొబ్బరికాయ పెట్టిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణ కుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్త కుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచ పల్లవాలు అంటే మామిడి, అశోక, నేరేడు, మోదుగ, వేప ఆకులు ఉంచాలి. సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి, కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం పెట్టి, పూజించాలి. పురోహితునకుగానీ, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభ దానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.
5. పంచాంగ శ్రవణం
తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనే పంచ అంగాల సమన్వితం పంచాంగం. ఉగాది రోజు దేవాలయంలోగానీ, గ్రామ కూడలి ప్రదేశాల్లోగానీ, పండితుల, సిద్థాంతుల సమక్షంలో కందాయ ఫలాలు స్థూ లంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకోవడానికి ఆనాడే అంకురార్పణం గావించాని చెప్పబడింది. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.
ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహు బలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడింది. ‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు.
అలాగే ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవికి చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి. కాబట్టి తెలుగు పండుగలలో యుగాదిగా పేరున్న ఉగాదికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యత రీత్యా ఉగాదిని కేవలం సంప్రదాయంగా కాకుండా, నిర్దేశించిన పద్ధతిలో నిర్వర్తిస్తే, ఆచరిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.


