కుల గణనను ప్లాప్ చేయాలని కుట్ర జరుగుతోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హక్కులను కోరినందుకే ఈటల రాజేందర్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారన్నారు. బీసీ నేత అయిన ఈటలను బీఆర్ఎస్ బయటకు పంపిందేమిటని ప్రశ్నించారు.
బీఆర్ఎస్లో మూడు కీలక పదవులు ఒక్కరే చేపట్టినప్పుడు, దీని గురించి మాట్లాడే ధైర్యం ఉన్నదా అని ప్రశ్నించారు. కుల గణనలో పాల్గొనని వాడికి ఎలాంటి నైతికత ఉందని నిలదీశారు. కుల గణనలో ఏం తప్పు జరిగిందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ గణన ద్వారా బలహీన వర్గాలకు ఒక స్పష్టమైన రోడ్మ్యాప్ సిద్ధమైందని ప్రజలకు సూచించారు. ఏదైనా పొరపాట్లు ఉంటే అవి బాధ్యతగా సరిచేస్తామన్నారు.
“పదేళ్లలో బీసీల కోసం ఏమి చేశారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీలోనా? చార్మినార్ వద్దనా? లేక బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గరనా? ఎక్కడైనా చర్చకు రండి” అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అన్ని హామీలను అమలు చేస్తామని, బీసీల హక్కుల కోసం కేంద్రంపై పోరాడాలని పిలుపునిచ్చారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, “రెండు కులాల ప్రతినిధిగా చెబుతున్నా, కుల గణన ఒక చారిత్రక చర్య. బీసీల సంఖ్య పెరుగుతున్నా వారికి న్యాయం జరగడం లేదు. రాహుల్ గాంధీ ఆలోచన ప్రకారమే ఈ గణన చేపట్టాం. అసెంబ్లీలో దీనిపై చర్చకు అనుమతించినా, బీఆర్ఎస్ నేతలు మధ్యలోనే వెళ్లిపోవడం వారి నిజమైన వైఖరి ఏమిటో స్పష్టంగా చూపిస్తోంది” అని విమర్శించారు.
సమగ్ర కుటుంబ సర్వే పేరుతో బీసీల కోసం ఏమైనా చేశారా? కనీసం ఆ రిపోర్ట్ను కూడా బహిర్గతం చేయలేదని మండిపడ్డారు. కుల గణనపై నెగటివ్ ప్రచారం చేస్తూ, దాని అమలును అడ్డుకునే ప్రయత్నం బీసీలకే నష్టమని హెచ్చరించారు.

