తీర్మానించిన TELANGANA|తెలంగాణ అసెంబ్లీ|ASSEMBLY
తెలంగాణ ఉసురు తీసిన వారిని
ఉరి తీసినా తప్పులేదు: సీఎం|CM REVANTH REDDY
నిందలకు తావు లేకుండా సిబిఐ కి అప్పగింత
TELANGANA|తెలంగాణ శాసనసభలో ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా మాట్లాడారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన భారీ లోపాలు, అవినీతి, ప్రజా ధన దుర్వినియోగంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికలో అనేక ఊహించని విషయాలు, అవినీతి వెలుగులోకి వచ్చాయని, మాజీ సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాలంలో ప్రాజెక్టును అవినీతి పూరితంగా నిర్మించారని ఆయన ఆరోపించారు.
చరిత్రను గుర్తు చేసిన సీఎం
మొదటగా సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక ఉదాహరణలు గుర్తుచేశారు. 12వ శతాబ్దంలో కాకతీయులు 30 వేల గొలుసుకట్టు చెరువులను నిర్మించి, వ్యవసాయమే జీవనాధారం అని నిరూపించారని చెప్పారు. అలాగే నిజాం కాలంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ తాగునీరు, సాగునీరు అందిస్తున్నాయని వివరించారు. ఇటీవల కామారెడ్డి వరదల సమయంలో 14 గ్రామాలను రక్షించిన పోచారం ప్రాజెక్టును ప్రత్యేక ఉదాహరణగా ప్రస్తావించారు. శ్రద్ధగా, ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తే ఎలా ఉంటుందో పోచారం ప్రాజెక్టు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.
నెహ్రూ వారసత్వం – కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు
ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా వర్ణించిన పండిట్ JAWAHARLAL NEHRU|జవహర్లాల్ నెహ్రూను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పాలనలోనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిందని సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్షలు, అమరుల త్యాగాల వల్లే పుట్టుకొచ్చింది. ఈ రాష్ట్రం ఆకలి కేకల నుండి వెలిసింది. కానీ ఆ ఆకాంక్షలను మోసం చేసింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.
ప్రతిపక్ష వైఖరిపై విమర్శలు
సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులను ఉద్దేశించి మీకు పూర్తిస్థాయి సమయం ఇస్తున్నాం. కానీ మీరు దుర్వినియోగం చేస్తున్నారు. కాళేశ్వరం విచారణకు ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు అడిగింది ఒకటి ఐతే, సాంకేతిక నిపుణుడు వేరొకటి ఇవ్వరు కదా అని ప్రశ్నించారు.
NDSA నివేదికలో మేడిగడ్డ లోపాలు స్పష్టం
ముఖ్యమంత్రి పేర్కొన్న దాని ప్రకారం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికే మేడిగడ్డ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని వెల్లడించింది. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాదు. NDSA చెప్పింది. డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయని రిపోర్ట్ చెబుతోంది. కానీ అప్పటి ప్రభుత్వం దానిని దాచిపెట్టిందని సీఎం అన్నారు.
కేసీఆర్ దోపిడీ – హరీష్ సమాధానం చెప్పాలి
కేసీఆర్ నిజాం కంటే ధనవంతుడు కావాలని కలలు కనేశాడు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ధనవంతుడు అవ్వాలనే ఆశతో ప్రజల డబ్బును దోచుకున్నాడు. కాళేశ్వరం రీడిజైనింగ్ పేరుతో దోపిడీ చేశారు. మేడిగడ్డలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్ రమణారెడ్డి లేఖ రాశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీనికి కేసీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మేడిగడ్డ చుట్టూ పోలీసులు – నిజాలను దాచిన గత ప్రభుత్వం
2020 అక్టోబర్ 21న మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇంజనీర్ ఫిర్యాదు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోపాలు బయటపడ్డాయి. కానీ ఆయన పిట్టని కూడా రానీయకుండా మేడిగడ్డ చుట్టూ పోలీసులు పెట్టాడు. తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినవారు కేసీఆర్, హరీష్ రావు. సాంకేతికతను విస్మరించి, దోపిడీ చేశారని ఆయన ధ్వజమెత్తారు.
ప్రాణహితను ఉరి వేసిన కేసీఆర్ – ప్రజలపై అప్పుల భారం
ప్రాణహిత ప్రాజెక్టు పూర్తిచేయాల్సిన అప్పటి సీఎం కేసీఆర్ దానిని ఉరి వేసాడని సీఎం అన్నారు. కాళేశ్వరం కోసం 85,449 కోట్ల అప్పులు తెచ్చారు. వాటిలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 27,738 కోట్లు 11.5% వడ్డీకి, 30,536 కోట్లు 12% వడ్డీకి తీసుకున్నారు. ఇప్పటివరకు 49,835 కోట్లు ప్రిన్సిపల్, వడ్డీగా చెల్లించాం. ఇంకా 60,869 కోట్లు భారం మిగిలి ఉంది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయాలంటే మరో 47 వేల కోట్లు అవసరమని చెప్పారు.
ఢిల్లీలో రుణాల రీ-స్ట్రక్చరింగ్ – మోడీతో సంబంధాలు
తాను ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నానని కేటీఆర్ లెక్కలతో సహా చెప్పి చిల్లర ప్రచారాలు చేస్తున్నాడని, కానీ తాను కేసీఆర్ తెచ్చిన 11.5% వడ్డీని 7.25%కి తగ్గించి రుణాలను రీ-స్ట్రక్చర్ చేశాను. మోడీ ప్రధానమంత్రి. మనకు కావలసిన నిధులు తెచ్చుకోవడమే నా బాధ్యత. అందుకే ప్రధానిని కలవడం తప్పా? అని అన్నారు. అలాగే కేసీఆర్, కుటుంబం ఆస్తులపై ప్రశ్నలు లేవనెత్తుతూ వందల ఎకరాల ఫార్మ్ హౌస్లు, టీవీలు, పత్రికలు ఎక్కడి నుండి వచ్చాయి? లక్షల కోట్ల ఆస్తి ఎట్లా వచ్చింది? అని ప్రశ్నించారు.
విచారణ కమిషన్ నివేదిక – కీలక అంశాలు
రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ 2025 జూలై 31న నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4న మంత్రి మండలి ఆ నివేదికను ఆమోదించింది. నివేదికలో:
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో ప్రణాళికా లోపాలు
- డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు
- ఆర్థిక అవకతవకలు, దురుద్దేశపూర్వక నిర్ణయాలు
- ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టడం
వంటి అంశాలను స్పష్టంగా ప్రస్తావించిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర సంస్థల పాత్ర, ఆర్థిక సంస్థల ప్రమేయం ఉన్నందున సీబీఐ విచారణ తప్పనిసరి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది కేవలం రాష్ట్ర సమస్య కాదు. కేంద్ర సంస్థలు కూడా పాలుపంచుకున్నాయి. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం అని సభలో ప్రకటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల కలల ప్రాజెక్టుగా చెప్పబడినా, అవినీతి, లోపభూయిష్ట నిర్మాణం వల్ల అది భారీ కుంభకోణంగా మిగిలిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును దోచుకున్నవారు శిక్షించబడతారని, పారదర్శక దర్యాప్తు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

