|POLICE|OPERATION KAGAAR|
-‘ఆపరేషన్ కగార్’ ను ఆపండి!
-2026 మార్చినాటికి నక్సల్స్ నిర్మూలన అసాధ్యం?
-చంపే అధికారం ప్రభుత్వాలకు కూడా లేదు!
-శాంతి కాముకులపై అర్బన్ నక్సల్స్ ముద్ర తగదు
-ఇరువర్గాల నుంచి కాల్పుల విరమణ ప్రకటిద్దాం
-వెసులుబాటు ఉంటేనే నిర్ణయం తీసుకునే అవకాశం
-మా పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేం
-2002 నుంచే శాంతి చర్చలపై సానుకూలం
-2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంతో చర్చలు
-2010 నుంచీ శాంతి చర్చలపై ప్రయత్నిస్తున్నాం
-సమస్యలున్నంత వరకు విప్లవ పునాది ఉంటుంది
-ప్రభుత్వాలకు, శాంతికామకులకు మవోయిస్టు పార్టీ విజ్ఞప్తి!
-చర్చలకు సానుకూలత వ్యక్తం చేస్తూ మావోల మరో లేఖ విడుదల
‘మేం శాంతి చర్చలకు సిద్ధం. ఆపరేషన్ కగార్ ను ఆపండి. ప్రభుత్వం తరపున కాల్పుల విరమణ ప్రకటించండి. మేం చర్చలకు రావడానికి సరైన భద్రత, భరోసా, వాతావరణం కల్పించండి.’ అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన పేరుతో మే 14న ఓ ప్రకటన విడుదలైంది. అందులోని ముఖ్యాంశాలు.
‘ఆపరేషన్ కగార్ ను ఆపేందుకు, శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధమే! మోదీ ప్రభుత్వం ఇందుకు సుముఖమా, కాదా, స్పష్టం చేయాలి. జాతీయ, అంతర్జాతీయ ప్రజలు, శాంతికాముకులు, విప్లవ, ప్రజాస్వామిక శక్తులు ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముందుకు రావాలి. ఈ మేరకు మావోయిస్టు కేంద్రకమిటీ తరఫున 2025 ఏప్రిల్ 25న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ 2వ ప్రకటన విడుదల చేసాను. అదే 2025 మార్చి 28న విడుదలైన పత్రికా ప్రకటన. చర్చల పై తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగా స్పందించింది. బీఆర్ఎస్ నుంచి కూడా సానుకూల ప్రకటన వెలువడింది. కానీ కేంద్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత రావడం విచారకరం. కాల్పుల విరమణ ప్రసక్తే లేదనీ, మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టకుండా వారితో శాంతిచర్చలు జరిపే అవకాశం లేదని కేంద్ర హోంశాంఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి-రాష్ట్ర హోంమంత్రి విజయ్ శర్మ ప్రకటించారు.
నిజానికి మావోయిస్టు విప్లవోద్యమం తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లకు మాత్రమే పరిమితమైలేదు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో విస్తరించింది. అందువల్ల శాంతి చర్చలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిస్పందిస్తే ఉపయోగం ఉంటుంది.’ మా పార్టీ 2002 నుంచే శాంతి చర్చల పట్ల సానూలంగా ఉంది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపినప్పటికీ, మధ్యలోనే ఏకపక్షంగా వైదొలిగింది. కానీ 2010లో దేశంలోని పౌరసమాజం, ప్రజాస్వామికవాదుల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి చర్చల కోసం కృషి చేస్తున్న మా పార్టీ అధికార ప్రతినిధి ఆజాద్ ను కుట్రపూరితంగా పట్టుకుని హత్య చేసింది. ఈ చర్చల ప్రక్రియలో భాగంగానే పశ్చిమ బెంగాల్ లో మా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ రాంజీ(మల్లోఝల కోటేశ్వర్లు)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేసాయి. శాంతి చర్చల ప్రక్రియను భగ్నం చేసాయి. అయినా మా పార్టీ ఎల్లప్పుడూ శాంతి చర్చలకు సిద్ధంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచే సానుకూలత లేదు.
ఆపరేషన్ కగార్ లో మా పార్టీ నాయకత్వం-కేడర్లతో పాటు పెద్ద సంఖ్యలో ఆదివాసుల్ని హత్య చేయడమే కాకుండా మా పార్టీకీ, ఆదివాసుల అస్తిత్వానికి పెనుసవాలు ఎదురైన మాట వాస్తవమే. కానీ ఇందువల్లనే మా పార్టీ శాంతి చర్చలపై పత్రికా ప్రకటనలు గుప్పిస్తోందని గోదీ మీడియా చేస్తున్న విష ప్రచారంలో వాస్తవం లేదు. తెలంగాణలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, శాంతికాముకులు శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరచేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిపై అర్బన్ నక్సల్స్ ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో లక్షలాది మంది ప్రజలు శాంతి చర్చలను కోరుకుంటున్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో వివిధ మావోయిస్టు పార్టీల, ప్రజాస్వామిక సంస్థలు కూడా మన దేశంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే నేను ఏప్రిల్ 25న రెండవ ప్రకటన విడుదల చేసాను. రాజ్యహింసకు ప్రతిగానే మా పార్టీ సాయుధ పోరాటానికి దిగిందనేది జగమెరిగిన సత్యం. ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తూ మావోయిస్టులను, ఆదివాసీ-గైరాదివాసీ ప్రజలను వందలాది మందిని హత్య చేసింది, చేస్తోంది. మే 7న కర్రెగుట్టల్లో ప్రభుత్వ సాయుధ బలగాలు పాశవికంగా నిర్వహించిన హత్యాకాండలో 22 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. దీంతో కర్రెగుట్టల ఆపరేషన్ లో అమరులైనవారి మా కామ్రేడ్స్ సంఖ్య 26కు చేరుకుంది. ఒక వైపు చర్చల ప్రక్రియ ప్రయత్నాలు కొనసాగుతుండగా ఈ విధంగా హత్యాకాండ కొనసాగించడాన్ని తీవ్రంగా ఖండించాల్సిందిగా దేశవాసులకు, ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
నిజానికి తుపాకులు పట్టుకునే వారిని కాల్చిచంపే అధికారాన్ని ఏ చట్టం ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఈ వాస్తవాన్ని వారు కప్పిపెట్టేందుకు, తలకిందులు చేసేందుకు పడరాని పాట్లు ఎందుకు పడుతున్నారో వారికే తెలియాలి. కానీ, ఇందులో వారు ఎన్నడూ సఫలం కాలేరు.
ఇక మేం ఆయుధాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసే విషయానికి వస్తే -ఈ విషయంపై మా పార్టీలో ఏ ఒక్కరో నిర్ణయం తీసుకోలేరు. మా పార్టీ ప్రజాస్వామికంగా పని చేసే పార్టీ. ఆపరేషన్ కగార్ లో లక్షలాది మంది పోలీసు, పారామిలిటరీ, కమాండో బలగాలు మా ఉద్యమ ప్రాంతాలను చుట్టిముట్టి వున్న స్థితిలో మా పార్టీలో కనీసం ‘కోర్’ అయినా సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోతోంది. అందువల్లనే సమయావధితో కూడిన కాల్పుల విరమణను నేను ప్రతిపాదించాను. ప్రజలకు గానీ, మా పార్టీ కేడర్లకు గానీ రక్షణ లేని పరిస్థితుల్లో ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వంతో చర్చలకు రావడం అసాధ్యమని పేర్కొన్నాను. కనుక రెండు పక్షాల నుంచి కాల్పుల విరమణ ప్రకటిస్తే మా పార్టీ కేంద్ర నాయకత్వం/కోర్ కలుసుకుని చర్చించుకుని, అన్ని విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకుని ఇప్పటికైనా సమయావధితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి మా పార్టీతో శాంతి చర్చలకు అంగీకరించాల్సిందిగా కోరుతున్నాను.
ఈ విషయాన్ని మా పార్టీ దండకారణ్య ఉత్తర-పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జ్ రూపేష్ పత్రికా ప్రకటనల ద్వారా, లెటర్స్ ద్వారా ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ కి తెలియజేసాడు. వీటిపై ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బ్రీఫింగ్ చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ మావోయిస్టులను మార్చి 31, 2026 నాటికి నిర్మూలించే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ ను మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమని మరోసారి స్పష్టం చేస్తున్నాను.
కాల్పులు విరమణ చేస్తే మావోయిస్టులు బలపడతారని గోదీ మీడియా ప్రచారం చేస్తున్నది. ఇది వాస్తవం కాదు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే విప్లవకారులు బలపడేందుకు పునాది కల్పిస్తాయి. సమస్యలున్నంత వరకూ ఈ పునాది ఉంటుంది. ప్రభుత్వ విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉంటే విప్లవకారులు బలపడే అవకాశమే ఉండదు. మా పార్టీ ముందుకు తెచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే శాంతి చర్చలు జరపి, సమస్యలకు సరైన పరిష్కారాలను కనుగొని ఒక ఒప్పందానికి వస్తే విప్లవోద్యమ ప్రాంతాల్లో రాజ్యహింసకు, మా సాయుధ పోరాటానికి పునాది లేకుండా పోతుంది.
2025-05-07_CC stmt-3 on Peace talks_Tel
21రోజుల్లో 31మంది మావోయిస్టులు మృతి!
-కర్రెగుట్టలో కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్’
-సీఆర్పీఎఫ్ డీజీ, చత్తీస్గఢ్ డీజీపీ వెల్లడి
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలో జరుగుతున్న భారీ నక్సల్ ఆపరేషన్స్లో మావోయిస్టులకు పెద్దఎత్తున ఎదురుదెబ్బ తగిలింది. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో చేపట్టిన ఆపరేషన్లో భద్రతా దళాలు 31మంది నక్సలైట్లను హతమార్చినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. బుధవారం బీజాపూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్కు సంబంధించిన విషయాలను సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, చత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్గౌతమ్ వెల్లడించారు.
‘‘కర్రెగుట్ట కొండలు చుట్టూ ఏప్రిల్ 21న ‘ఆపరేషన్ కగార్’ పేరుతో నక్సల్స్ ఏరివేతను ప్రారంభించాం. దాదాపు 21 రోజలు పాటు జరిగిన భారీ ఆపరేషన్లో దాదాపు 20వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. వారిలో చత్తీస్గఢ్ పోలీసులు, సీఆపీఎఫ్ సిబ్బంది ఉన్నారు. మే 11న ఆపరేషన్ను విరమించుకున్నాం. ఈ భారీ ఆపరేషన్లో మొత్తం 21 ఎన్కౌంటర్లు జరిగాయి. 16మంది మహిళ కేడర్స్తో సహా 31మంది మావోయిస్టులు మరణించారు. వారి నుంచి ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ సహా 35 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం’’ అని ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్గౌతమ్ తెలిపారు. ఇక మృతుల్లో 28మందిని గుర్తించినట్లు సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. వారిలో రూ. 1.75 కోట్ల రివార్డు ఉన్న మావోయిస్టు కూడా చనిపోయినట్లు తెలిపారు. ‘ కర్రెగుట్టలో 214 బంగర్లు గుర్తించి ధ్వంసం చేశాం. 450 ఐఈడీలు, 818 బారెల్ గ్రెనేడ్ లాంచర్ల షెల్స్, 899 కార్డ్టెక్స్ డిటోనేటర్లు, భారీ మొత్తం పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. అంతేకాకుండా దాదాపు 12వేల కిలోల ఆహార పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నాం.
దేశంలో ఇంకా 6 జిల్లాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. అందులో ఛత్తీస్గఢ్లో నాలుగు, మహారాష్ట్ర, జార్ఖండ్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో సుక్మా, బీజాపూర్, నారాయణపూర్, కాంకేర్ జిల్లాలు నక్సల్స్ ప్రభావిత జిల్లాలు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజం పూర్తిగా అంతమవుతుంది. నక్సలిజాన్ని ఎలాగైనా నిర్మూలించాలి. ఇదే మా ప్రతిజ్ఞ.
ఇక ఈ ప్రాంతంలో మా కదలికను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం. పూర్వం, ప్రజలు ఆలయంలో పూజలు చేయడానికి ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడ నక్సలైట్ శిబిరాలు ఏర్పాటు చేసినప్పటీ నుంచి ఈ కార్యకలాపాలు ఆగిపోయాయి. మేం దాన్ని మళ్లీ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని డీజీపీ తెలిపారు.

