టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ. పారదర్శక పాలన, అవినీతిపై కఠిన వైఖరి, అంతర్గత ప్రజాస్వామ్యం, అభివృద్ధి పట్ల స్పష్టమైన దృష్టి అవసరం. టీఎంసీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు ఈ అంశాల ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేస్తున్నాయి. రాబోయే కాలమే టీఎంసీ భవితవ్యాన్ని నిర్దేశించగలదు. ఈ దశలో టీఎంసీ అధినేత్రి మమత ఏ విధంగా స్పందిస్తారన్నదే ఆసక్తిగా మారింది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు వామపక్షాల అజేయ ఎర్ర కోటగా భావించిన బెంగాల్లో 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా మూడు సార్లు అధికారాన్ని నిలబెట్టుకుని రాష్ట్ర రాజకీయాలను శిసిస్తూ వచ్చారు. అయితే దీర్ఘకాల పాలనలో ఎదురైన అవినీతి ఆరోపణలు, పరిపాలనా వైఫల్యాల విమర్శలు, పార్టీ అంతర్గత అసంతృప్తులు, చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఇప్పుడు టీఎంసీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది.
2011లో 184 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన టీఎంసీ, 2016లో 211 స్థానాలు, 2021లో 213 స్థానాలు సాధించి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే ఎన్నికల విజయాలు మాత్రమే జనరంజక పాలనకు కొలమానం కాదు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, చట్టవ్యవస్థ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల్లో టీఎంసీ ప్రభుత్వం వైఫల్యాలు తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.
ప్రత్యేకించి నందిగ్రామ్ ఉద్యమం ద్వారా రైతు హక్కుల పరిరక్షకురాలిగా గుర్తింపు పొందిన మమతా బెనర్జీ, అదే సమయంలో రాష్ట్రంలో భారీ పరిశ్రమల పెట్టుబడులకు ఆటంకాలు కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. గత దశాబ్దంలో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగా, బెంగాల్ ఆ స్థాయిలో ముందుకు సాగలేకపోయిందనేది పరిశ్రమల వర్గాల అభిప్రాయంగా ఉంది.
ఇదిలా ఉండగా, ఉపాధ్యాయ నియామక కుంభకోణం, పశువుల అక్రమ రవాణా కేసులు, బొగ్గు అక్రమ తవ్వకాల ఆరోపణలు టీఎంసీ ప్రభుత్వ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీశాయి. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టు, పలువురు నాయకులపై దర్యాప్తు సంస్థల విచారణలు పార్టీ ఇమేజ్ను దెబ్బతీశాయి. ప్రతిపక్షాలు ఈ పరిణామాలను “వ్యవస్థీకృత అవినీతి”గా అభివర్ణిస్తుండగా, టీఎంసీ మాత్రం రాజకీయ కక్షసాధింపుగా కొట్టిపారేస్తోంది.
మరో కీలక అంశం సరిహద్దు భద్రత, అక్రమ వలసల సమస్య. బంగ్లాదేశ్తో 2,200 కిలోమీటర్లకు పైగా సరిహద్దు కలిగిన పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాట్లు పెను సవాల్ గా మారాయి. కేంద్ర భద్రతా సంస్థలు సరిహద్దు భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా, మమత మాత్రం మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఈ అంశం ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ ఆయుధంగా మారింది.
రాష్ట్రంలో చట్టవ్యవస్థపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలపై నేరాలు, రాజకీయ హింస, స్థానిక స్థాయిలో పార్టీ ఆధిపత్యం వంటి అంశాలపై ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పోటీ సహజమైనదే అయినప్పటికీ, హింసాత్మక ఘటనలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయనే చెప్పొచ్చు.
అసెంబ్లీ అధికారంతమున టీఎంసీకి చెందిన 58 మంది ఎమ్మెల్యేలు, 20మంది లోక్ సభ సభ్యులు, నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది. దీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీల్లో అంతర్గత విభేదాలు సహజమే అయినప్పటికీ, అవి బహిరంగంగా బయటపడితే పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ పరిస్థితి అగమ్య గోచరంగా నిలిచింది.
ఈ నేపథ్యంలోనే టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పాత్రపై కూడా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు బెంగాల్ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్, గత రెండు దశాబ్దాల్లో తన ప్రభావాన్ని కోల్పోయింది. ప్రస్తుతం టీఎంసీ ఎదుర్కొంటున్న సవాళ్లు బెంగాల్ లో కాంగ్రెస్కు పునరుజ్జీవన అవకాశాలను కల్పించవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే టీఎంసీ-కాంగ్రెస్ విలీనంపై వస్తున్న ఊహాగానాలకు ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. అందువల్ల అలాంటి వార్తలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర ఎంతో కీలకం. కానీ ఏ పార్టీ అయినా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే పారదర్శక పాలన, అవినీతిపై కఠిన వైఖరి, అంతర్గత ప్రజాస్వామ్యం, అభివృద్ధి పట్ల స్పష్టమైన దృష్టి అవసరం. టీఎంసీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు ఈ అంశాల ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు శాశ్వతం కాదు. ఎన్నికల విజయాలు ఎంత గొప్పవైనా, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం, అవినీతి ఆరోపణలు, నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తి ఏ రాజకీయ శక్తినైనా బలహీనపరుస్తాయి. రాబోయే కాలమే టీఎంసీ భవితవ్యాన్ని నిర్దేశించగలదు. ఈ దశలో టీఎంసీ అధినేత్రి మమత ఏ విధంగా స్పందిస్తారన్నదే ఆసక్తిగా మారింది.

