ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్యానంతరం దేశంలో, ఓటింగ్ వ్యవస్థపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తడం ఆశ్చర్యకరమే గాక, అభ్యంతరకరం, ఆలోచనాత్మకం. ‘ఓట్ చోరీ’ ఆరోపణలు ప్రజాస్వామ్యంపై అప నమ్మకాలను పెంచుతున్నాయి. మరికొన్ని సంశయాలను కలిగిస్తున్నాయి. ఇది నైతికంగానే గాక, రాజ్యాంగ పరంగా అత్యంత శోచనీయం!
ప్రజాస్వామ్యం పది కాలాలపాటు మనజాలాలంటే, ఎన్నికల వ్యవస్థ అత్యంత పటిష్టంగా, పాదర్శకంగా ఉండాలి. అప్పుడే ప్రజలకు నమ్మకం పెరిగి, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యం పరిపుష్టంగా వర్ధిల్లుతుంది. మరి ఈ చిత్తశుద్ధి శాసనాలు చేసే రాజకీయ పార్టీలకు, అమలు చేసే అధికార యంత్రాంగానికి ఉందా?!
‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ ఎన్నికలు-సంశయాలు-సంస్కరణలు-పరిష్కారాలు!
ప్రజాస్వామ్యానికి మూలం స్వేచ్ఛాపూరిత, స్వచ్ఛంగా, పాదర్శకంగా జరిగే నిష్పాక్షిక ఎన్నికలు. ‘ప్రజలచే, ప్రజల కోసం, జరిగే పరిపాల’నే ప్రాథమిక సూత్రం. ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్యానంతరం దేశంలో, ఇటీవలి కాలంలో, ఓటింగ్ వ్యవస్థపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తడం ఆశ్చర్యకరమే గాక, అభ్యంతరకరం, ఆలోచనాత్మకం. ‘ఓట్ చోరీ’ అనే ఆరోపణలు ప్రజాస్వామ్యంపై అప నమ్మకాలను పెంచుతున్నాయి. మరికొన్ని సంశయాలను కలిగిస్తున్నాయి. ఇది నైతికంగానే గాక, రాజ్యాంగ పరంగా అత్యంత శోచనీయం.
ఇటీవల రాహుల్ గాంధీ ఓట్ చోరీపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో 65 లక్షల ఓట్ల చోరీ జరిగిందంటున్నారు. మహారాష్ట్రలో కోటి కొత్త ఓటర్లను చేర్చినట్లు ఆరోపించారు. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో తప్పుడు, రెప్లికేట్ అడ్రెస్సులు, ఏకమొత్తంలో రిజిస్ట్రేషన్లు, ఫారం -6 దోపిడీ వంటి విధానాలతో భారీగా ఓట్ల దోపిడీ జరిగిందన్నది రాహుల్ ఆరోపణ. అంతేగాక ఈ ఓట్ల చోరీ కోసం బీజేపీకి ఎన్నికల సంఘం సహకరిస్తున్నదని, దీనికి 2023లోనే చట్టం ద్వారా ఎలక్షన్ కమిషనర్లకు న్యాయ పరిరక్షణ కల్పించడం వల్ల అవినీతికి చట్టబద్ధత కల్పించినట్లైందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ చోరీపై బీహార్ నుంచి ఎన్నికల సంఘం, కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం కూడా ప్రకటించారు. ఈ ఆరోపణలను సహజంగానే ఎన్నికల సంఘం ఖండించడమేగాక, ఆధారాలుంటే అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వాదిస్తోంది. బహుషా ఎన్నికల సంఘం రాహుల్ పై చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉంది. ఇదే సమయంలో బీజేపీ, ప్రధాని కూడా రాహుల్ పై విరుచుకుపడుతున్నారు. ఇంకోవైపు ఈ వ్యవహారం కాస్తా కోర్టు దాకా వెళ్ళింది. ఓట్ల చోరీ కేసులో చనిపోయారని ఓట్లు తొలగించిన పలువురిని కాంగ్రెస్ సుప్రీం కోర్టులో హాజరు పరచడంతో, ఈ నెల 19వ తేదీ వరకు సవరించిన జాబితా, తొలగింపుల జాబితాలను 21వ తేదీలోగా తమకు సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ బీహార్ లో ఓట్ చోరీపై యాత్రను చేపట్టారు. ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.
అసలు ఓట్ చోరీ అంటే ఏమిటి? ఓట్ చోరీ అనేది అనేక ప్రక్రియల్లో జరుగుతున్నది. ఓటర్ల పేర్లు తొలగించడం లేదా జాబితాలో ఉండకుండా చేయడం. బూత్ క్యాప్చరింగ్ అంటే ఓటింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకుని తప్పుడు ఓట్లు వేయడం. నకిలీ ఓటర్లు , మృతుల పేరుతో ఓటింగ్ చేయడం, ఒకరికి బదులుగా మరొకరు ఓటు వేయడం. ఈవీఎంలను టాంపరింగ్ చేయడం. ఓటర్లను బెదిరించడం లేదా ప్రలోభాలకు గురిచేయడం వంటివి. ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది. ఇది ఒకటి రెండు ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థ మీదనే ప్రభావం చూపుతుంది.
ఇక ఓట్ చోరీ జరగడానికి పలు సామాజిక, రాజకీయ, సాంకేతిక కారణాలున్నాయి. అధికార దాహంతో రాజకీయ పార్టీలు ఇలాంటి దుర్నీతికి ఒడిగడుతున్నాయి. ప్రజల్లో రాజకీయ అవగాహన లోపం. ప్రభుత్వ యంత్రాంగం తప్పిదాలు, కఠినమైన చట్టాల లేకపోవడం, పార్టీల ప్రాబల్యం అధికంగా ఉండటం వంటి కారణాల వల్ల ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయి.
ఓట్ చోరీ వంటి ఆరోపణలు నిజమైతే ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతారు. తమ ఓటుకు విలువ లేదన్న భావనతో ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అసమర్థ నాయకత్వం ఎన్నిక అవుతుంది. రాజకీయ హింస పెరుగే వీలుంది. పారదర్శకత, జవాబుదారీతనం లోపిస్తే, ప్రజలు ప్రశ్నించలేని పరిస్థితులు ఏర్పడతాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంస్కరణలు అవసరం. ప్రజల్లో ఓటుపై అవగాహన, చైనత్యం పెంచాలి. ఎన్నికల చట్టాలను పటిష్టంగా రూపొందించి అమలు చేయాలి. ఎన్నికల నిందితులను ఫాస్ట్ ట్రాక్, ప్రత్యేక కోర్టుల్లో విచారణ జరిపి, కఠినంగా శిక్షించాలి. ఫేస్ రీడింగ్ అథెంటికేషన్, బయోమెట్రిక్ ఓటింగ్ వంటి అధునాతన సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టాలి. వీవీ ఫ్యాట్ జాబితాలతో ఈవీఎంలపై అనుమానాలు తొలిగించాలి. పారదర్శకతను పెంచాలి. లేదంటే తిరిగి బ్యాలెట్ పద్ధతినే అవలంబించాలి. ఎన్నికల సంఘం ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా స్వత్రంతంగా, స్వేచ్ఛగా పని చేసే చట్టాలు తేవాలి. ఎన్నికల సంఘానికి సరిపడా నిధులు, విధులు కల్పించాలి.
ఇప్పటికైనా ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం చేసి, ఆలోచించాలి. ఇప్పటికే 1974లో తర్కుండే కమిటీ, 1998లో ఇంద్రజీత్ గుప్తా కమిటీ, 2001లో లాయా కమిటీలు ఇచ్చిన సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. వాటిని అమలు చేయాలన్న రాజకీయ చిత్తశుద్ధీ కరువైంది.
ప్రజాస్వామ్యం పది కాలాలపాటు మనజాలాలంటే, ఎన్నికల వ్యవస్థ అత్యంత పటిష్టంగా, పాదర్శకంగా ఉండాలి. అప్పుడే ప్రజలకు నమ్మకం పెరిగి, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యం పరిపుష్టంగా వర్ధిల్లుతుంది. మరి ఈ చిత్తశుద్ధి శాసనాలు చేసే రాజకీయ పార్టీలకు, అమలు చేసే అధికార యంత్రాంగానికి ఉందా?!

