ఈనెల 17న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సందర్భంగా అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తమ ప్రతిపాదనలను జనవరి 16వ తేదీ లోగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా గీత కార్మికుల కులాలకు మద్యం షాపుల కేటాయింపు, మద్యం ధరల సవరణపై చర్చించనున్నట్లు సమాచారం.
అంతేకాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి 18న దావోస్కు బయల్దేరి ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొననున్నారు. ఈ పర్యటనపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గతంలో, జనవరి 2న జరిగిన కేబినెట్ సమావేశంలో 14 కీలక అంశాలను మంత్రివర్గం ఆమోదించింది. తాజా సమావేశంలో మరోమారు ఆర్థిక, సామాజిక, వాణిజ్య అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మద్యం పాలసీకి సంబంధించి తీసుకోబోయే నిర్ణయాలు, ముఖ్యమంత్రికి సంబంధించిన అంతర్జాతీయ పర్యటనలు ప్రత్యేక ఆసక్తి రేపుతున్నాయి. ఈ కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర అభివృద్ధి పై మరింత స్పష్టత రానుందని అంచనా.

