కొత్త భవనంలో పార్లమెంటు ప్రారంభమై రెండేళ్ళైనా, మన పార్టీలు, పాలకులు, నేతల పాత విధానాలు ఏ మాత్రం మారినట్టు లేదు. సరైన చర్చలకు ఆస్కారమే లేకుండా పోయింది. ముఖ్యమైన బిల్లులు కూడా మూజువాణి ఓటుతో అమోదమవుతున్నాయి. ఏ ఒక్క అంశంపై కూడా ప్రజాభిప్రాయం ప్రతింబించడం లేదు. ఏకాభిప్రాయం కుదరడం లేదు. సభ అంతా ఏకపక్షంగానే సాగుతున్నది. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఏకస్వామ్యం నియంత్రుత్వానికి దారి తీస్తుంది. ప్రజాస్వామ్యం పజీత అవుతుంది. ప్రస్తుతం సంకీర్ణ యుగమే నడుస్తోంది. ఎదురులేని మెజార్టీ వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఇంత దాష్టీకాన్ని ప్రదర్శించలేదు. ప్రతిపక్షాలు కూడా నిర్మాణాత్మకంగా పని చేశాయి.
ఈ వానాకాలం పార్లమెంటు సమావేశాలు కూడా యథాలాపంగా మొదలయ్యాయి. బీహార్ ఓట్ల తొలగింపు, ఆపరేషన్ సిందూర్, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు వంటి అంశాలపై వాయిదా తీర్మాణాలతో సభ వాయిదా పడుతూ లేస్తూ నడుస్తోంది. అధికార పార్టీ చర్చకు అవకాశం ఇవ్వకపోవడం, విపక్షం వాకౌట్ చేయడం, బీహార్ క్షేత్రానికి విపక్షాలు వెళ్ళడం, ఇదే సమయంలో ఈ దేశానికి అతి ముఖ్యమైన బిల్లులు ప్రభుత్వం సభ ముందుకు తేవడంతో, సరైన చర్చ, సూచనలు, మార్పులు లేకుండానే బిల్లులు మూజువాణీ ఓటుతో ఆమోదం పొందడం చకచకా జరిగిపోతున్నాయి. పరస్పర విమర్శలు, సభ బుల్డోజింగ్ సరే, దూషణలు, దూసుకెళ్ళడాలు వంటివి ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా విరోధంగా నిరోధంగా మారుతున్నాయి.
ఐదేళ్ళకు మించి శిక్షపడే నేరారోపణలతో జైలులో వరసగా నెల రోజుల పాటు ఉంటే వారి పదవులు అటోమేటిక్ గా ఊడిపోతాయి. దీని పరిధిలోకి ప్రధాని, సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులను తీసుకువస్తూ చేపట్టిన బిల్లు సభలో పెద్దగా చర్చే లేకుండా ఆమోదం పొందింది. ఇది చూడ్డానికి అందరికీ సంబంధించినదిగానే కనిపిస్తున్నది. కానీ దీన్ని దుర్వినియోగం చేసే ప్రమాదమే ఎక్కువ. ఓట్ చోరీ ఆందోళనకు విరుగుడుగా, పైగా ప్రతిపక్షాలపై ప్రయోగించడానికే దీన్ని తెచ్చారన్న ఆరోణలు విపక్షాలు చేస్తున్నాయి. నిజానికి ఈ బిల్లు అత్యంత ఆవశ్యమే అయినప్పటికీ, రౌడీలు, నేరస్తులు, అవినీతిపరులు అంతా కలగలిసి పోయి, నేరారోపణలు లేని నేతలే లేకుండా పోయిన ఈ తరుణంలో దీన్ని విపక్షాలు వ్యతేకించడం సహజమే. ఈచట్ట పరిధిలోకి మొత్తం వ్యవస్థను తీసుకు వస్తే బాగుంటుంది. ముఖ్యంగా చట్టసభలు, ఉద్యోగస్వామ్యం, న్యాయవ్యవస్థ, ఫోర్త్ ఎస్టేట్ ను కూడా ఈ చట్ట పరిధిలోకి తెస్తే బాగుంటుంది.
మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టాక చరిత్ర సృష్టించే నిర్ణయాలు తీసుకుంటుందని అంతా ఆశించారు. మూడోదఫాలో మరింత సమర్థంగా, ఉత్సాహంగా పని చేస్తానన్న మోడీ వచనాలు ఎక్కడా ప్రతిఫలించడంలేదు. దేశంలో అభివృద్ది లక్ష్యంగా కార్యక్రమాలు సాగుతున్నాయన్న నమ్మకం కలిగించలేకపోయారు. ప్రజల సమస్యలను విస్తృతంగా చర్చించాలి. ఇందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వడం ద్వారా సమస్యలపై చర్చ జరిపి ఉంటే బాగుండేది. దేశంలో ప్రస్తుత రాజకీయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పటిష్టమైన ఎన్నికల విధానం కూడా అవసరం ఉంది. ఇవన్నీ చర్చించడం ద్వారా నవ భారతానికి శ్రీకారం చుట్టాలి. 370 ఆర్టికల్ను రద్ద చేయడం లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మీద ప్రభుత్వానికి ఈ నిర్ణయాలు ఏమంత పెద్దవి కావు. గవర్నర్ల వ్యవస్థ వల్ల కేంద్ర ప్రభుత్వేతర రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తున్నది. అత్యున్నత న్యాయస్థానంలో ఈ రభస నడుస్తున్నది. నలుగురు హర్షించే నిర్ణయాలు తీసుకోవాల్సిన మోదీ ప్రభుత్వం దానికి భిన్నంగా తమ పార్టీయేతర ప్రభుత్వాలని హరాష్ చేయడానికే ఈ విధంగా చేస్తోందన్న ఆరోపణల నుంచి బయటపడాలి.
దేశహితం కోసం మరిన్ని కఠిన చట్టాలను రూపొందించాలి. చర్చల్లో ప్రజాభిప్రాయం భాగస్వామ్యం రావాలి. ఎన్నికల్లో అక్రమాలు నిరోధించేలా నిర్ణయాలు రావాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చూడాలి. వారు అప్పుల్లో కూరుకుపోకుండా బతికేలా నిర్ణయాలు ఉండాలి. అలాంటి ప్రయత్నాలేవీ కానరావడం లేదు. పార్లమెంట్, అసెంబ్లీల సీట్ల సంఖ్యను పెంచడం అత్యావశ్యం. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఉన్న జనాభాకు అనుగుణంగా పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 542 సీట్లతోనే కొనసాగిస్తున్నాం. వాటిని ప్రస్తుత జనాభాకు అనుగుణంగా పెంచుకోవాల్సిందే. ఒకే దేశం, ఒకే చట్టం కోసం కసరత్తు జరుగుతున్న వేళ ఇలాంటి కీలక నిర్ణయాలు కూడా జరగాలి.
ఏపీలో కాకినాడను ఆనుకుని ఉన్న యానాంను పాండిచ్చేరిలో కాకుండా ఏపీలోనే విలీనం చేయడంపై ఇంత వరకు ఏ ఒక్కరూ ఎక్కడా ప్రస్తావించడం లేదు. పార్లమెంటులో చర్చలు ప్రజా వ్యవస్థలకు మేలు చేసేలా జరగాలి. ఒక సారి ఎన్నికైతే చాలు, ప్రజా ప్రతినిధులుగా కాకుండా, పార్టీల ప్రతినిధులుగా మాత్రమే వ్యవహరిస్తోన్న పార్టీలు, సభ్యుల తీరు మారాలి. సొంత ఎజెండాలకు కాకుండా ప్రజా ప్రయోజనాలకే పెద్ద పీట వేయాలి. అధికారమే పరమావధి కాకుండా ప్రజాసేవ పరమావధిగా పాలన సాగాలి. అంతేగాని గుడ్డిగా వ్యతిరేకించడం విపక్షాలకు తగదు. అలాగే విపక్షాలకు మాట్లాడేందుకు సరైన సమయాన్ని అధికార పార్టీ కేటాయించాలి. అప్పుడే ప్రజాస్వామిక పార్లమెంట్ ఔన్నత్యం నిలుస్తుంది.

