ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది.
ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఆ లక్ష్య సాధనకు చట్టబద్ధమైన విధానాలే మార్గం కావాలి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, ప్రజల హక్కుల రక్షణ ఈ మూడు లక్ష్యాలు పరస్పర విరుద్ధమైనవి కావు. చట్టబద్ధత, పారదర్శకత, మానవీయత అనే మూడు సూత్రాల ఆధారంగానే హైడ్రా ముందుకు సాగితేనే తన ఉద్దేశాన్ని సార్థకం చేసుకున్న సంస్థగా నిలుస్తుంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
హైదరాబాద్లో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ, భూకబ్జాలు, అక్రమ నిర్మాణాల తొలగింపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2024 జూలైలో జీవో–99 ద్వారా ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏడాది కాలంలో గతంలో కనీవినీ ఎరగని రీతిలో విస్తృత స్థాయిలో కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల ఆక్రమణల తొలగింపు వంటి చర్యలకు ప్రజల నుంచి ప్రారంభంలో విశేష మద్దతు లభించింది. అయితే చట్టబద్ధ ప్రక్రియలను పాటించకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కోర్టు ఆదేశాలను సైతం విస్మరిస్తూ కూల్చివేతలు జరుపుతోందన్న ఆరోపణలు పెరగడంతో హైడ్రా పనితీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు, కమిషనర్ ఏవీ రంగనాథ్ను బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి గట్టి హెచ్చరికగా భావించాల్సిందే.
హైడ్రా ఏర్పాటైన తర్వాత దాదాపు ఏడాది వ్యవధిలో వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించడంలో హైడ్రా చురుకుగా వ్యవహరించింది. నగరాభివృద్ధి, వరద నివారణ దృష్ట్యా ఈ చర్యలు అవసరమనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. కానీ అదే సమయంలో పేదల నివాసాలపై బుల్డోజర్లు నడపడం, ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించకపోవడం, చట్టపరమైన ప్రక్రియలను విస్మరించడం వల్ల తీవ్ర వ్యతిరేకతను కూడా మూటగట్టుకుంది.
హైడ్రా వ్యవహార శైలిలో అత్యంత ఆందోళనకర అంశం కోర్టు ఉత్తర్వుల పట్ల నిర్లక్ష్య వైఖరి. హైడ్రా చర్యలపై ఇప్పటికే హైకోర్టులో 700కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, కమిషనర్పై 63 ధిక్కార పిటిషన్లు దాఖలైనట్లు కోర్టు విచారణల సందర్భంగా వెల్లడైంది. ప్రభుత్వ ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం న్యాయవ్యవస్థను అవమానించడమేనని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇది కేవలం ఒక అధికారిపై విమర్శ మాత్రమే కాదు. చట్టపాలనపై ప్రభుత్వ బాధ్యతను కూడా ప్రశ్నించినట్లే.
అంతేకాదు. గత కొన్ని నెలలుగా హైకోర్టు వరుసగా హైడ్రా పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ముత్తంగి గ్రామంలో షెడ్ కూల్చివేతను ‘దొంగల ముఠా చర్య’తో పోల్చిన ధర్మాసనం, రాత్రివేళల్లో నోటీసులు లేకుండా కూల్చివేతలు జరపడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. లోతుకుంట, కూకట్పల్లి, ఇతర ప్రాంతాల్లో జరిగిన కూల్చివేతలపై కూడా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కూకట్పల్లిలో 13.17 ఎకరాల విస్తీర్ణంలో కూల్చివేసిన నిర్మాణాలను తిరిగి పునరుద్ధరించాలని, అవసరమైతే ఖర్చును సంబంధిత అధికారుల వ్యక్తిగత నిధుల నుంచే వసూలు చేయాలని ఆదేశించడం అరుదైన పరిణామంగా నిలిచింది.
ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ఎలాంటి నోటీసు లేకుండా తెల్లవారుజామున కూల్చివేతలు చేపట్టడం, బాధితులకు తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వకపోవడం, అప్పీల్కు సమయం కల్పించకపోవడం సహజ స్ఫూర్తికి విరుద్ధం. అక్రమ నిర్మాణం అయినప్పటికీ, దానిపై చర్యలు చట్టబద్ధంగా, పారదర్శకంగా జరగాల్సిందే. చట్టాన్ని అమలు చేసే సంస్థే చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం దెబ్బతింటుంది.
హైడ్రా చర్యలు రాజకీయంగా తటస్థంగా లేవన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు చెందిన అక్రమ నిర్మాణాలపై అదే స్థాయిలో చర్యలు కనిపించకపోవడం, సాధారణ ప్రజలే ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నారనే అభిప్రాయం బలపడుతోంది. ఈ విమర్శలు వాస్తవమో కాదో ప్రభుత్వం స్పష్టమైన సమాచారం, పారదర్శక గణాంకాలతో ప్రజల ముందుకు రావాలి. ఎవరిపైనా వివక్ష లేకుండా చట్టం సమానంగా అమలవుతుందనే నమ్మకం కల్పించడం ప్రభుత్వ బాధ్యత.
ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఆ లక్ష్య సాధనకు చట్టబద్ధమైన విధానాలే మార్గం కావాలి. ప్రతి కూల్చివేతకు ముందు నోటీసు, విచారణ, అప్పీల్ అవకాశం, అవసరమైనచోట పునరావాసం వంటి చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలి. ముఖ్యంగా పేదల నివాసాల విషయంలో మానవీయ దృక్పథం అనుసరించాల్సిన అవసరం ఉంది.
హైకోర్టు తాజా వ్యాఖ్యలను ప్రభుత్వం కేవలం ఒక కేసుకు పరిమితం చేయకుండా పరిపాలనా సంస్కరణలకు అవకాశంగా తీసుకోవాలి. హైడ్రాకు స్పష్టమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించడం, కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయడం, అధికారుల జవాబుదారీతనాన్ని పెంచడం అత్యవసరం. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, ప్రజల హక్కుల రక్షణ ఈ మూడు లక్ష్యాలు పరస్పర విరుద్ధమైనవి కావు. చట్టబద్ధత, పారదర్శకత, మానవీయత అనే మూడు సూత్రాల ఆధారంగానే హైడ్రా ముందుకు సాగితేనే తన ఉద్దేశాన్ని సార్థకం చేసుకున్న సంస్థగా నిలుస్తుంది.

