మన ప్రజా పాలనకు ప్రజల ఆదరణ
నిజామాబాద్ రైతు మహోత్సవ సదస్సులో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
#congress #telangana #tpcc
నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన రైతు మహోత్సవ సదస్సులో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతిగా నిలుస్తుందని, రైతుల కోసం సమర్పిత భావంతో పనిచేస్తోందని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలు వాస్తవాలకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పాలన కొనసాగిస్తోందని వెల్లడించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, లక్షన్నర కోట్లు గోదావరిలో పోసిన పాపం పూర్తిగా కేసీఆర్దే అని మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పూర్వ వైభవాన్ని పునరుద్ధరించగల పార్టీ కాంగ్రెస్ మాత్రమెనని పేర్కొన్నారు. జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులపై ఉందని పేర్కొంటూ, వారి నైతిక, పాలనాపరమైన బాధ్యతను గుర్తు చేశారు.
నిజామాబాద్ జిల్లా రాజకీయాలకు, సామరస్యానికి మారుపేరుగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల నాటికే పార్టీ భిన్నతలు ఉంటాయని, కానీ ఎన్నికల అనంతరం జిల్లా అభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాకు రావలసిన నిధులు, ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ తీసుకోవాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేశారు.
రైతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు కలిసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కొంతమంది రైతులను ఎంపిక చేసి విదేశాలకు తీసుకెళ్లి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన కల్పించేలా మంత్రి చొరవ తీసుకోవాలని సూచించారు.
ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూనే, సన్న బియ్యం పంపిణీ వంటి చారిత్రాత్మక పథకాలను కొనసాగిస్తోందని తెలిపారు. దీనిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ముందుండి అమలు చేస్తున్నారు. ధనిక, పేద తేడా లేకుండా ప్రతి కుటుంబానికి ఈ పథకం లబ్ధి చేకూరుస్తోందని వివరించారు.
రానున్న రోజుల్లో ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి 90 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ లాగా మాట ఇచ్చి మోసం చేసే పద్ధతికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాంగ్రెస్ ధర్మమని చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ డీ-సెడ్మెంటేషన్ ద్వారా మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని, దేశంలోనే గొప్ప ప్రాజెక్ట్ అయిన శ్రీరాంసాగర్ను కూడా డీ-సెడ్మెంటేషన్ చేస్తే అదనంగా రెండు లక్షల ఎకరాలకు పైగా నీరు లభిస్తుందని వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులతో ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా సస్యశ్యామలంగా మారిందని, ఆంధ్ర ప్రాంత రైతులు వలసలు కూడా వచ్చారని గుర్తు చేశారు.
ఈ విధంగా సస్యశ్యామలానికి పేరుగాంచిన నిజామాబాద్ జిల్లాకు పునరుత్థానం, పూర్వవైభవం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

