భూమిపై తొలుత ఉద్భవించిన ఆదిమ గిరిజన జాతులు 70 దేశాల్లో 5వేల తెగలుగా, 37 కోట్ల జనాభా. ఉందని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఆదివాసీల వారసత్వ అటవీ వనరుల మానవ హక్కులపై 1982 ఆగస్టు 9న జెనీవాలో 26 మంది స్వతంత్ర మానవ హక్కుల నిపుణులతో జరిగిన వర్కింగ్ గ్రూపు సమావేశంలో ఆగస్టు 9ని ప్రపంచ ఆదివాసుల దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచంలోని ఏ దేశ ప్రభుత్వం కూడా ఆదివాసీల హక్కుల దినోత్సవాన్ని పాటించకపోవడం విచారకరం.
జనాభాలో గణనీయంగా ఉన్న ఆదిమ గిరిజన స్థానిక, దేశీయ సంచార తెగలుగా ఉన్న ప్రజల జీవన రీతులే గాక, ఆ జాతులే అంతరించిపోవడానికి ఆధునికత కారణమవుతోంది.
అభివృద్ధి చెందుతున్న సమాజంలో అవకాశాలు సమంగా అందేట్లు కృషి జరగాలి. అందుకు రాజకీయ పార్టీలు, నేతలు, ప్రభుత్వాలు, అధికారులు పూనుకోవాలి.
నేడు ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా.. ‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీనారాయణ రాసిన ప్రత్యేక వ్యాసం
భూమిపై తొలుత ఉద్భవించిన ఆదిమ గిరిజన జాతులు 70 దేశాల్లో 5వేల తెగలుగా, 37 కోట్ల జనాభా. ఉందని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఆదివాసీల వారసత్వ అటవీ వనరుల మానవ హక్కులపై 1982 ఆగస్టు 9న జెనీవాలో 26 మంది స్వతంత్ర మానవ హక్కుల నిపుణులతో జరిగిన వర్కింగ్ గ్రూపు సమావేశంలో ఆగస్టు 9ని ప్రపంచ ఆదివాసుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అంతర్జాతీయంగా ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వప్రతినిధుల సభ 1993లో తీర్మానం చేసి, 1994 ముసాయిదా ప్రకటనను విడుదల చేసింది. ప్రపంచంలోని ఏ దేశ ప్రభుత్వం కూడా ఆదివాసీల హక్కుల దినోత్సవాన్ని పాటించకపోవడం విచారకరం.
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2011 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 9 వరకు దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో జరిగిన వాతావరణ సదస్సులో భూగోళాన్ని రక్షించగల కొత్త గ్రీన్ ఎకానమీ ప్రణాళికను రూపొందించారు. ఇందుకు రెడీ ప్లస్ (అడవుల నరికివేత, అడవుల వినాశనం వల్ల కలిగే ఉపద్రవాల తగ్గింపు) విధానానికి ఒప్పందంచేసి కర్బణాన్ని పీల్చుకునేందుకు కొత్త తోటలను ప్రత్యామ్నాయ అడవులను పెంచడానికి వర్ధమాన దేశాలు తీర్మానించాయి. పురోగతి పేరుతో ప్రభుత్వాలు సహజ వనరులున్న ఆదివాసీ ప్రాంతాల్లో ప్రవేశపెడుతున్న పరిశ్రమలు, ప్రాజెక్టులు, గనుల తవ్వకాలు, హరిత వేట వంటి ఆపరేషన్లు ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన తీరుని తేటతెల్లం చేస్తున్నాయి.
ఒక వైపు జాతి, సంస్కృతిపరంగా ప్రపంచమంతా ఒకటే అనే లక్ష్యాన్ని సాధించడానికి కృషి జరుగుతున్నది. మరోవైపు అలాంటి అనేక జాతుల అంతానికి ఆస్కారం ఏర్పడుతున్నది. కులాలు, ఉప కులాలుగా ఉన్న నాగరిక సమాజమేకాక, మానవ జనాభాలో గణనీయంగా ఉన్న ఆదిమ గిరిజన స్థానిక, దేశీయ సంచార తెగలుగా ఉన్న ప్రజల జీవన రీతులే గాక, ఆ జాతులే అంతరించిపోవడానికి ఆధునికత కారణమవుతోంది. ఈ ఆధునిక కాలంలోనూ జనాభా లెక్కల్లోకి రాకుండానే. ఇలాంటి కనుమరుగయ్యే ప్రమాదపుటంచున మన నాగరికత ఉండటం శోచనీయం.
నాగరికత సమాజాలకు దూరంగా, యంత్ర నాగరికత పూర్వయుగపు ఆచారాలు, అలవాట్లతో లిపిలేని భాషలు, వీలుకాని జీవన పరిస్థితులతో జీవిస్తున్న చిన్న చిన్న తెగలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. అలాంటి తెగలనే ఆదిను తెగలని అన్నారు. కొందరు సమాజ శాస్త్రవేత్తలు, తెగకు పర్యాయపదంగా ‘రేస్’ అనే పదాన్ని వాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 700 గిరిజన తెగలకు చెందిన 10.43 కోట్ల ఆదివాసీ ప్రజలు నివసిస్తున్నారు. ఇది దేశ జనాభాలో 8.6శాతం, వీరిలో 92శాతం గిరిజనులు అటవీ ప్రాంతంలో వేట, ఫలసాయం పై అటవీ ఉత్పత్తులను ఆధా రంగా చేసుకుని జీవిస్తున్నారు.
ఏపీ పునర్ వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణలోని 32 తెగలు, రాష్ట్ర జనాభాలో 9 శాతం. ఐటీడీఏ జిల్లాల్లో ఎస్టీ జనాభా మొత్తం జనాభాలో 52.96శాతం, మిగిలిన 47.04శాతం గిరిజనులు మైదాన ప్రాంతాల్లో జీవిస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం 35 గిరిజన తెగలు ఉండగా, ఇందులో మైదాన ప్రాంత గిరిజన తెగలు 5 ఉండగా 30 ఆదిమ జాతి గిరిజన తెగలు మాత్రం షెడ్యూల్డ్ ఏరియా (అనుచిత ప్రాంతం) 31,450 చ.కి.మీ. అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇది రాష్ట్ర విస్తీర్గంలో 11.48శాతం.
అదిమ తెగలు క్రమంగా నాగరిక లక్షణాలను అలవరచుకున్నాయి. ఏజెన్సీలో గిరిజనేతరుల చొరబాటు ద్వారా ఏర్పడ్డ సంబంధాలతో తెగల వారు తమ ఆదిమ లక్షణాలను వదులుకోవడం ప్రారంభించారు. తెగల నిరాడంబరమైన జీవితాన్ని పారిశ్రామిక సంస్కృతిని సర్వనాశనం చేసింది. పారిశ్రామిక సంస్కృతిలో కొన్ని గిరిజన జాతులు, వాటి సంస్కృతులు అదృశ్యం మవడం లేదా పూర్తిగా మారిపోవడం జరిగింది.
మొదట అదివాసీల దరి చేరింది బ్రిటీష్ వారే, 1887 తర్వాత మన దేశాన్ని సంపూర్ణంగా సమర్థవంతంగా పాలించేందుకు, అన్ని ప్రాంతాలపై తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి బ్రిటీశ్ వారు అటవీ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయారు. తంతి తపాల, రోడ్లు, రైల్వే సర్వీసులని విశేషంగా విస్తృతం చేశారు. అధికారులు, పోలీసులను పరిష్టంచేసి, లోతట్టు గిరిజన ప్రాంతాలకు విస్తరించారు. గిరిజన ప్రాంతాల్లో నగదు బదిలీని పరిచయం చేశారు. గిరిజనుల భూముల్ని అపారంగా ఆక్రమించారు. పోడులో ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని, వాణిజ్య వంటల్ని ప్రవేశపెట్టారు. క్రైస్తవ మత ప్రచారకులను గిరిజన ప్రాంతాలోకి అనుమతించగా, వారి ప్రభావం ఈశాన్య భారత గిరిజన తెగలపై అపారంగా పడింది.
ప్రధాన జీవన స్రవంతికి దూరంగా, చైతన్య శీలమైన, ప్రయోజనకరమైన కార్యాచరణ లేకపోవడం, జీవన ప్రమాణాలను మెరుగు పరచుకోకపోవడం, భౌతిక సుఖాలతో బతకాలనుకోకపోవడం వల్ల ఆదిమ జాతులు తమ సంస్కృతిని కొంత మేరకు నిలుపుకోలిగారు. ఏకాంతవాసం వల్ల గిరిజనేతరుల జీవన రీతుల పోటీని, గిరిజనులు తట్టుకోలేకపోయారు. సంప్రదాయకపోడు నుంచి ఆధునిక సాంకేతిక నైపుణ్య వ్యవసాయ పద్ధతుల్ని అలవరచుకోలేకపోయారు. వడ్డీ వ్యాపారులు, భూముల్ని లాక్కున్న రైతులు, అవినీతి అధికారుల మధ్య గిరిజనులు నలిగిపోయారు. ఘర్షణ పడ్డారు. కొన్ని చోట్ల తిరుగుబాట్లు చేశారు. అధికారులుగా వచ్చిన బ్రిటీష్ పరిశోధకుల ద్వారానే మానవ విజ్నాన వికాసానికి పునాలు వడ్డాయి.
గిరిజనులు అనేక తిరుగుబాట్లు, సామాజిక ఉద్య మాలు చేసినా, పరిమిత స్థాయిలో స్వాతంత్య్ర్య ఉద్యమంలో పాల్గొన్నా, భారతీయుల ద్రుష్టిలో గిరిజనులకు తగిన స్థానం దొరకలేదు. 20వ శతాబ్దం మొదలు వరకు భారతీయ మేధావులు సైతం గిరిజనుల గురించి అంతగా పట్టించుకోలేదు. పరిమిత స్థాయిలోనైనా గాంధీ, నెహ్రూ లే ఆదివాసీలు, ఆదిమానవుల సమస్యలపై స్పందించారు.
స్వాతంత్ర్యానంతరం ఆధునిక భారతంలో అభివద్ధి పరివ్యాప్తమైంది. గిరిజన ప్రాంతాల్లోనూ రోడ్లు, సమాచార వ్యవస్థ విస్తరించింది. తదనుగుణంగా గిరిజనులకు సవాళ్ళు పెరిగాయి. ఆధునిక ప్రగతి తమ జీవన సమతౌల్యతను, సంఘీభావాన్ని దెబ్బతీయరాదని గిరిజనులు కోరుకుంటున్నారు. తమ సంప్రదాయ వ్యవస్థలు, సంస్థల ద్వారానే తమ కనుమరుగైన అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. తమ ప్రగతిని తీర్చి దిద్దుకోవడంలో తమకు స్వేచ్ఛ ఉండాలని, గిరిజనేతరులు దూపొందించిన పథకాలు, బలవంతంగా రుద్దిన విధంగానే భావిస్తున్నారు. జాతీయ ప్రయోజనాలను, గిరిజన తెగల ప్రయోజనాలను రైలు పట్టాల్లా సమన్వయంతో, సమర్థవంతంగా నడిపించడమే ప్రధాన సవాల్ గా మారింది.
తాజాగా గిరిజన తెగల్లో అంతర్గత విభేదాలు పొడ చూపుతున్నాయి. తెగల జీవన సంస్కృతిలో ఏకరూపకత ఉన్నప్పటికీ, సంప్రదాయాల్లో విభిన్నత్వం గిరిజన తెగల్లో కనిపిస్తుంది. అవకాశాలు, అభివృద్ధిలో తేడాలు తెగల్లో తేడాలు వర్గ వైషమ్యాలను రెచ్చగొడుతున్నాయి.
1977లో లంబాడాలను షెడ్యూల్డ్ తెగల్లో చేర్చిన తర్వాత అభివృద్ధిలో తేడాలు ఆదివాసీ తెగలు, మైదాన ప్రాంత లంబాడాల మధ్య వైషమ్యాలను పెంచాయి. లంబాడాలే అధికంగా లాభపడుతున్నారన్న అభిప్రాయం ఆదివాసీల్లో ఏర్పడింది. తమ అవకాశాలను లంబాడాలు ఎగరేసుకుపోతున్నారని ఆదివాసీలు భావిస్తుండగా, ఆదివాసీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాల్సిన గతి పట్టలేదని లంబాడాలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలు హింసాత్మక పరిణామాలకు దారి తీసున్నాయి.
భిన్నత్వంలో ఏకత్వంగల ఒక జాతిగా, దేశంగా భారత దేశానికి ఉన్న గౌరవానికి భంగం కలగకుండా గిరిజనులు తమ ఆత్మగౌరవాన్ని సాధించుకోవాలి. ప్రభుత్వాలు ప్రతి ఏటా ఆగస్టు 9ని అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా పాటించాలి. ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించి జయంతి, వర్ధంతులను జరపాలి. వారి విగ్రహాలను ట్యాంక్ బండ్ పై నిలపాలి. అభివృద్ధి చెందుతున్న సమాజంలో అవకాశాలు సమంగా అందేట్లు కృషి జరగాలి. అందుకు రాజకీయ పార్టీలు, నేతలు, ప్రభుత్వాలు, అధికారులు పూనుకోవాలి.


