తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తమ నియోజకవర్గ పరిధిలో గల సమస్యలపై ప్రశ్నించే జీరో అవర్(ప్రశ్నోత్తరాల సమయం)లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ…..పెద్దవంగరలో అద్దె భవనాల్లో నడుస్తున్న పలు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరారు. దాతల స్థలాల్లో 50 శాతం వరకు పూర్తయిన భవనాలకు సత్వరం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు శిథిలావస్థలో ఉన్న పాలకుర్తి బస్టాండ్ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే సాగు నీటికి సంబంధించి మాట్లాడుతూ…. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు లబ్ధి చేకూరే ప్రాజెక్టుల పూర్తికి ప్రజాప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ-6 పనులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. సమస్యను ప్రజా ప్రభుత్వం తీసుకెళ్లగానే అంచనాలను సవరించి రూ.1,015 కోట్లు కేటాయించారని తెలిపారు. రైతుల సమస్యలపై అడిగిన వెంటనే నిధులు ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యలపై పై అసెంబ్లీలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించి సమాధానమిచ్చారు.

