ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే ఉండాలి. పరిపక్వమైన సాంకేతికతల వాణిజ్య ఉత్పత్తి, భారీ స్థాయి తయారీ, సేవల విస్తరణలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించాలి.
ప్రైవేటీకరణ లేదని ప్రభుత్వం చెబుతున్నప్పుడు, అనుమానాలకు తావులేకుండా విధి, విధానాలపై మరింత పారదర్శకత చూపాలి. ఉద్యోగుల ఆందోళనలకు సమాధానాలు ఇవ్వాలి. ఇస్రో శాస్త్రవేత్తల పరిశోధనా స్వాతంత్య్రం, సంస్థాగత సామర్థ్యం, ఉద్యోగ భద్రతను కాపాడాలి.!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశ శాస్త్ర సాంకేతిక సామర్థ్యానికి ప్రతీక. చంద్రయాన్ నుంచి ఆదిత్య-ఎల్1 వరకు, ఉపగ్రహ ప్రయోగాల నుంచి మానవ సహిత అంతరిక్ష యాత్ర లక్ష్యాల వరకు ఇస్రో సాధించిన విజయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అలాంటి జాతీయ సంస్థ భవిష్యత్తుపై ఇటీవల చెలరేగిన చర్చను తేలికగా కొట్టిపారేయలేం. అయితే, ఇస్రోను ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతోందన్న వార్తలను ఆ సంస్థ స్వయంగా 2026 సెప్టెంబర్ 6న ఖండించింది. ఇస్రోను ప్రైవేటీకరించబోమని, దాని ప్రాధాన్యాన్ని తగ్గించబోమని స్పష్టం చేసింది.
అయితే, ఆందోళనకు కారణం లేకపోలేదు. 2023 అంతరిక్ష విధానం ద్వారా ప్రైవేటు సంస్థలకు ఉపగ్రహాల తయారీ, ప్రయోగ వాహనాల నిర్మాణం, ప్రయోగాలు, గ్రౌండ్ స్టేషన్లు, డేటా సేవలు వంటి అంతరిక్ష కార్యకలాపాల్లో దాదాపు పూర్తి స్థాయి అవకాశాలు కల్పించారు. ప్రైవేటు రంగానికి అనుమతులు, పర్యవేక్షణ కోసం ఇన్-స్పేస్ ఏర్పాటైంది. 2026 జనవరి నాటికి ఇన్-స్పేస్ డిజిటల్ వేదికపై 1,050 ప్రైవేటు సంస్థలు తమ సామర్థ్యాలను నమోదు చేసుకున్నాయి.
ఇది కేవలం విధాన ప్రకటనగా మిగలలేదు. భారత అంతరిక్ష స్టార్టప్ల సంఖ్య 2014లో ఒక్కటుండగా, 2023 నాటికి 189కు చేరింది. ఆ ఏడాదిలోనే వాటిలో పెట్టుబడులు 124.7 మిలియన్ డాలర్లకు పెరిగాయి. 2026 నాటికి అంతరిక్ష రంగంలో 399 స్టార్టప్లు పనిచేస్తున్నాయని కేంద్రం రాజ్యసభకు తెలిపింది.
అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను విస్తరించడమే ఈ విధానాల ప్రధాన లక్ష్యం. 2023లో భారత స్పేస్ ఎకానమీ 8.4 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2033 నాటికి 44 బిలియన్ డాలర్లకు, 2040 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2023లో ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 2% కాగా, 2033 నాటికి దాన్ని 8 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అందుకే ప్రైవేటు భాగస్వామ్యాన్ని వ్యతిరేకించడం పరిష్కారం కాదు. భారీ పెట్టుబడులు, వేగవంతమైన తయారీ, వాణిజ్యీకరణ, కొత్త సాంకేతికతల అభివృద్ధికి ప్రైవేటు రంగం అవసరం. ఇందుకోసం కేంద్రం వెయ్యి కోట్ల రూపాయల స్పేస్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ను కూడా ఏర్పాటు చేసింది.
కానీ, అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. ప్రైవేటు రంగాన్ని పెంచడం వేరు, ఇస్రో పాత్రను తగ్గించడం వేరు. ఈ రెండింటినీ ఒకటిగా చూడలేం. 2025-26లో అంతరిక్ష శాఖకు సంబంధించిన స్పేస్ టెక్నాలజీ కార్యక్రమాల కోసం రూ.10,230.21 కోట్ల ఆర్థిక కేటాయింపు ఉంది. అదే సంవత్సరంలో 300 కొత్త పరిశోధన-అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించడం, 270 పూర్తిచేయడం వంటి లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. అంటే పరిశోధన, అధునాతన సాంకేతికతలో ప్రభుత్వ రంగ పాత్ర ఇప్పటికీ కీలకమే.
ఇస్రో బలం కేవలం రాకెట్లు తయారు చేయడంలో లేదు. జాతీయ భద్రత, అంతరిక్ష శాస్త్రం, మానవ సహిత అంతరిక్ష యాత్ర, చంద్ర-గ్రహ అన్వేషణ, కీలక సాంకేతికతల స్వావలంబన వంటి వ్యూహాత్మక రంగాల్లో దాని పాత్ర అపారమైనది. 2025 చివరి నాటికి ప్రభుత్వానికి చెందిన 22 ఉపగ్రహాలలో ఎర్త్ ఆర్బిట్లో, 31 ఉపగ్రహాలు జియోసింక్రోనస్ ఆర్బిట్లో పనిచేస్తున్నాయి.
అందువల్ల ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే ఉండాలి. పరిపక్వమైన సాంకేతికతల వాణిజ్య ఉత్పత్తి, భారీ స్థాయి తయారీ, సేవల విస్తరణలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించాలి.
ప్రైవేటీకరణ లేదని ప్రభుత్వం చెబుతున్నప్పుడు, అనుమానాలకు తావులేకుండా విధానాలపై మరింత పారదర్శకత చూపాలి. ఉద్యోగుల ఆందోళనలకు సమాధానాలు ఇవ్వాలి. ఇస్రో శాస్త్రవేత్తల పరిశోధనా స్వాతంత్య్రం, సంస్థాగత సామర్థ్యం, ఉద్యోగ భద్రతను కాపాడాలి.
అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి తలుపులు తెరవడం అవసరమే. కానీ ఆ తలుపులు తెరిచే క్రమంలో ఇస్రో తలుపులు మూసుకుపోకూడదు. దేశ అంతరిక్ష భవిష్యత్తుకు ఇస్రో నాయకత్వం కొనసాగుతూ, ప్రైవేటు రంగం బలమైన భాగస్వామిగా ఎదగడమే సమతౌల్యమైన మార్గం.

