ఆనాడే ప్రజల భాషకు కావ్య గౌరవం కల్పించిన సవ్యసాచి
సోమనాథుడి కవిత్వ వారసత్వాన్ని భావి తరాలకు అందించాలి
ఇదీ స్థానికుల మనోభావం… అతిథుల ఆశాభావం
పాలకుర్తిలో ఘనంగా సోమనాథుడి 786వ దీపారాధన
సోమనాథుడు అన్నింటా ఆరితేరిన అసామాన్యుడు. తెలంగాణ ఆదికవి. తెలుగు భాషలో తొలి స్వతంత్ర కవి. ఆయనకు ముందు అందరూ అనువాద కవులే. సోమనాథుడు అష్ట భాషా కోవిదుడు. ప్రతిభా శాలి, ప్రయోగ శీలి. ప్రగల్బ ప్రదర్శన లేని వాడు. జాను తెలుగులో వ్రాసి ప్రజల భాషకు కావ్య గౌరవం కల్పించాడు. భాష, భావం, వస్తువు, ఇతివృత్తం, పాత్రలు, ఛందస్సు, ప్రక్రియ, ప్రస్తుతి అన్ని అంశాల్లోనూ కవిత్వాన్ని, సమాజాన్ని సవ్య, నవ్య మార్గంలో నడిచి విప్లవం తెచ్చిన విశ్వకవి. ఆయన కవిత్వ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని పాలకుర్తి ప్రాంతం నుండి అనేకమంది కవులు, రచయితలు, కళాకారులు ఉద్భవించారు. అయితే ఇప్పుడు సోమనాథుడి కవిత్వ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రస్తుత ప్రపంచానికి విస్తృతంగా అందించాల్సిన అవసరం ఉంది. అని పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు ఆది కవి పాల్కురికి సోమనాథుడి లింగైక్య దినం సందర్భంగా సోమనాథుడి 786 వ దీపారాధన కార్యక్రమం, పాలకుర్తి సోమనాథ స్మృతి వనంలో సోమనాథ కళాపీఠం, శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ పూజారుల మంత్రోచ్ఛారణల మధ్య సోమనాథుడి విగ్రహానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి, ఘనంగా నిర్వహించారు.
అనంతరం పీఠం అధ్యక్షులు డా. రాపోలు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో
హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాలకుర్తి కవులకు, కళాకారులకు, రచయితలకు పుట్టినిల్లు అన్నారు. తెలుగు ఆది కవి పాల్కురికి సోమనాథుడు జన్మించిన నేలలో మనం పుట్టడం మన అదృష్టం అన్నారు. ఇంత చారిత్రాత్మక నేలను అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి అందరితో కలిసి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న సోమనాథ కళా పీఠం కార్యవర్గాన్ని అభినందించారు.
ప్రధాన వక్త శ్రీలేఖ సాహితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ టి శ్రీరంగ స్వామి మాట్లాడుతూ… సోమనాథుడి కవిత్వ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. సోమనాథుడి రచనలను ప్రచురించి ప్రచారం చేయడమే కాక, ఆయన ఆయన కవిత్వ విశిష్టతలపై మరిన్ని రచనలు గావించి వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యతను పీఠం కవులు రచయితలు తీసుకోవాలన్నారు.
ప్రముఖ సాహితీవేత్త మారేడుకొండ బ్రహ్మచారి (నిధి) మాట్లాడుతూ… ఆనాడే సమాజాన్ని విశ్లేషించి సమ సమాజ స్థాపన కోసం తన శక్తి యుక్తులను రచన వ్యాసంగాన్ని విశిష్టంగా విశేషంగా ధారపోసిన పాలకుర్తి సోమనాథుడు పుట్టిన ఈ నేల, ఈ ప్రాంతం ఎన్నో పుణ్యాలు చేసుకున్నదన్నారు. నిబద్ధత నిమగ్నత కలిగిన ఆదర్శవంతుడు సోమనాథుడని అన్నారు.
డాక్టర్ బేతి రమేష్ మాట్లాడుతూ జనగామ జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో సోమనాథుడి చిత్ర పటాలు వేసి విద్యార్థులకు సోమనాథుడి సాహిత్యాన్ని తెలియజేయాలని అన్నారు.
డా.రాపోలు సత్యనారాయణ మాట్లాడుతూ, కన్నడ నేలపై ప్రభవించి సమ సమాజం, సామ్యవాదం సాధనకు వీర శైవంను ఒక పరికరంగా స్వీకరించి ప్రజలను మేలు కొలిపిన మహనీయుడు బసవేశ్వరుడు. బసవేశ్వరుని భక్తి తత్వాన్ని తెలుగు దేశాన తెలియ చెప్పిన వాడు మల్లికార్జున పండితారాధ్యుడు. ఈ ఇరువురి దివ్య చరితలను వారి బలగమైన శివ శరణుల కథలను తనివి తీరా వ్రాసి, తన ఇలు వేలుపు పాలకురికి సోమేశునిపై సోమనాథ స్తవం వ్రాసి, ద్విపదకు పద్య పదవిని ఇచ్చి, లక్షణ యుక్తంగా తొలి శతకాన్ని కూర్చిన శతక కారుడు. గద్యలతో, రగడలతో ఊర్రూత లూగించిండు. అలతి ద్విపదలు, అలుకటి మాటలే కాదు, అరుదైన ఛందస్సులు, అబ్బుర పరిచే అక్షర విన్యాసాలు చూపించిండు. తన కాలపు సమాజాన్ని, సంస్కృతిని, కళలను, ప్రకృతిని, విజ్ఞానాన్ని, ఆనాటి సమస్తాన్ని తన కవిత్వంలో ఆవిష్కరించిండు. అంతటి మహత్తరమైన కవి మరొకరు లేరు. సోమనాథుడు తెలంగాణలో పుట్టినా, ప్రాంతానికి పరిమితం చేయలేని విశ్వ కవి అని అభిభాషించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి సోమనాథుడు పేరు పెట్టాలి. గతంలో దీనిమీద సోమనాథ కళాపీఠం తీవ్ర కృషి చేసింది. ఏకోన్ముఖంగా ప్రముఖ కవులందరూ ఇదే విషయాన్ని సమర్థిస్తూ వ్యాసాలు రాశారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో డా. మార్గం లక్ష్మీనారాయణ, ఇమ్మడి దామోదర్, డివిఆర్ శర్మ, దేవగిరి రామన్న, దేవగిరి లక్ష్మన్న, దేవగిరి అనిల్, గూడూరు లెనిన్, పులి గణేష్, సుదర్శన్ కూరపాటి, రాపాక సత్యనారాయణ,
చీదర జగదీష్, మార్గం సాయి సందీప్ తేజ, సమ్మయ్య, ఆలయ సిబ్బంది సూపరింటెండెంట్ వెంకటయ్య, నిరంజన్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

