అడుగు ప్రత్యేక కథనం
“అత్యంత ప్రభావవంతంగా” ఎదుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి
ఏడాదిలోనే ఎంతో మెరుగైన ప్రతిభ
వంద మంది అత్యంత ప్రభావవంతుల్లో 28వ స్థానం
గత ఏడాదితో పోల్చితే 11స్థానాలు ఎగబాకిన వైనం
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత ప్రియాంక కంటే ఘనం
5 గురు దక్షిణాది సీఎంలలో 4వ వాడు..5వ వాడిగా కేరళ సీఎం
మొదటిసారి జాబితాకెక్కిన ఎపీ డీసీఎం పవన్, యాక్టర్ అల్లు అర్జున్
ఈసారి దక్షిణాది నుంచి 18 మంది ప్రభావంతులకి చోటు
2025వ ఏడాది ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ -జాబితా’ వెల్లడిస్తున్న గణాంకాలు
ఇంతింతై… వటుడింతై… అన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఎదుగుతున్నారా? జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారనున్నారా? అందరి అంచనాలకు మించి, అనూహ్య ఫలితాలు సాధించి, అగ్రనేతల మనసులను గెలిచి, సీనియర్లను మెప్పించి, సీఎం పదవే తనను వలిచి వచ్చే విధంగా నిలిచిన రేవంత్ రెడ్డి, అనతి కాలంలోనే అత్యంత ప్రతిభా ప్రభావవంతుడిగా నిలవడం ఆశ్చర్యమనిపించినా, ఆయన వ్యతిరేకులకు ఇదేమి నచ్చక పోయినా, గిట్టకున్నా, కనిపిస్తున్న వాస్తవం ఇదే! ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ వెలువరించిన ‘‘అత్యంత ప్రతిభావంతులు-2025’’ జాబితా సరిగ్గా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నది. నిర్ణీత పారా మీటర్లలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులను పరిశీలించి, పరిశోధించి చేసిన ఎంపికలో రేవంత్, దేశంలో ప్రతిభ కనబరచిన వంద మంది అత్యంత ప్రతిభావంతుల్లో 28వ స్థానంలో నిలిచారు. గతేడాది 39వ స్థానం నుంచి 11 స్థానాలు ఎగబాకారు. ఇదే జాబితాలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, జై శంకర్, రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రులు నితీశ్, చంద్రబాబు వంటి వారెందరో ఉన్నారు. వాళ్ళందరినీ అంగీకరించేవారు, రేవంత్ ని వ్యతిరేకించే వారు సైతం అత్యంత ప్రభావంతమైన ఈ ప్రతిభను అంగీకరించి తీరాల్సిందే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పదవిలోకి వచ్చి కేవలం 16 నెలలు మాత్రమే అవుతున్నది. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా ఆయన రాజకీయ పదవులు నెరపినప్పటికీ, సీఎం లాంటి కార్యనిర్వాహక నాయకత్వ పదవిలో ఉండటం మొదటి సారే. అదీ అతి స్వేచ్ఛాయుత కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉండటం, కొనసాగటం అంత ఈజీ కాదు. అందునా శైశవ దశలో ఉన్న తెలంగాణ… అత్యంత దారుణంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పదవీ నిర్వహణ, నిధుల సమీకరణ, పథకాల అమలు, పరిపాలనను సాగించడం కత్తిమీద సామే. ఇదే ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ గత ఏడాది వెలువరించిన ‘‘అత్యంత ప్రతిభావంతులు-2024’’ జాబితాలో తన ఏడాది పాలన ముగియక ముందే సీఎం రేవంత్ రెడ్డి 39వ స్థానంలో నిలవడం, మరో ఏడాది తిరగేసరికల్లా ఏకంగా 11 స్థానాలు ఎగబాకి, 28వ స్థానానికి చేరడం అభినందించతగిన విశేషాంశం. పరిపాలనా నైపుణ్యం..అనితర సాధ్యమైన ప్రతిభ, ప్రభావంతమైన రాజకీయంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శక్తిమంతమైన నాయకునిగా నిలిచారనడంలో సందేహం లేదు.
ప్రభావవంతులుగా వివిధ రంగాల ప్రముఖులు
దేశంలో రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. ఈ వంద మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అశ్విన్ వైష్ణవ్, బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎం.కె. స్టాలిన్, మమతా బెనర్జీ, సిద్ధరామయ్య వంటి నేతలు తొలి 25 మందిలో ఉన్నారు. దక్షిణాది నుంచి అన్ని రంగాలకు కలుపుకుని 18మంది ఈ జాబితాలో ఉన్నారు. తెలంగాణతో సంబంధం ఉన్న నిర్మలా సీతారామన్ (5వ స్థానం), తెలంగాణకే చెందిన ప్రతాప్ సి రెడ్డి (69వ స్థానం), పవన్ కళ్యాణ్ (73వ స్థానం), అసదుద్దీన్ ఓవైసీ (89వ స్థానం), అల్లు అర్జున్ (92వ స్థానం)లు కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం.
దక్షిణాది సీఎంలలో ప్రతిభావంతుడిగా..
కాగా, దక్షిణాది 5 రాష్ట్రాల సీఎంలలో 4వ వాడిగా, ఏపీ సీఎం చంద్రబాబు (14వ స్థానం), కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య (20వ స్థానం), తమిళనాడు సీఎం స్టాలిన్ లు రేవంత్ కంటే ముందున్నారు. కేరళ సీఎం పినరయ్ విజయన్ (41వ స్థానం), రేవంత్ తర్వాత ఉన్నారు. ప్రాంతీయ నేతలు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో మరింత ప్రభావం చూపుతున్నారనడానికి ఇది నిదర్శం.
రాహుల్ తర్వాత…ఖర్గే, ప్రియాంక కంటే ముందు
అయితే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (33వ స్థానం), అగ్రనేత ప్రియాంక గాంధీ (81వ స్థానం) లు కూడా రేవంత్ తర్వాత స్థానాల్లో ఉండటం ఆసక్తికరం. కాంగ్రెస్ అగ్రనాయకుల్లో రాహుల్ గాంధీ మాత్రమే రేవంత్ కంటే ముందున్నారు. సీఎంగానే కాకుండా పార్టీ పరంగా ఇది రేవంత్ ప్రతిభకు మరో నిదర్శనం.
రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలకంగా…
ఇక, తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యకలాపాలు, దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో పోషిస్తున్న ప్రముఖమైన పాత్రతో రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు లభించింది. తనదైన దూకుడుతో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఆయన చూపుతున్న ప్రభావం, నాయకత్వ లక్షణాలతో ఆయన ర్యాంకు మరింత మెరుగుపడింది. ఒక ప్రాంతీయ నాయకుడి గానే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా రేవంత్ రెడ్డి ఆవిర్భవించారు. ఈ జాబితాతో రేవంత్ రెడ్డిని ఇండియా కూటమిలోని ఇతర ప్రముఖులైన సీఎంల సరసన నిలిపింది. ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యతలతో సమన్వయం చేయగలిగిన మేధో సంపత్తి, వ్యూహాత్మక దృక్పథం రేవంత్ రెడ్డిని కీలక నాయకునిగా నిలిపేలా చేసున్నాయి.
విధానపరమైన నిర్ణయాలతో…
రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల రుణ మాఫీ చేయడం, క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్లు, ప్రీమియం రిటైల్ స్టోర్లు వంటి వ్యాపార అవకాశాలను కల్పించడం, యువతను నిపుణులుగా తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్జెండర్ల నియామకం వంటి అనేక విధానపరమైన నిర్ణయాలు దేశవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాదరణ పెరగడానికి కారణమయ్యాయి.
డీ లిమిటేషన్ పై ఢీ…
నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన దృఢమైన అభిప్రాయాలు కూడా ఆయనకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం దక్కేలా చేశాయి. రెండో సమావేశాన్ని, భారీ ప్రజా బహిరంగ సభను హైదరాబాద్ లో నిర్వహించడానికి సాహసోపేతంగా నిర్ణయించడం రేవంత్ వేగవంతమైన దక్షతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగలిగితే రేవంత్ జాతీయ స్థాయిలో, కనీసం దక్షిణ భారత స్థాయిలో మరింత గుర్తింపు, ప్రాచుర్యం పొందే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.
గెలుపు సరే, నిలుపుకోవాలి
ఒక సమున్నత స్థానానికి చేరుకోవడం కంటే దాన్ని నిలుపుకోవడమే కష్టం! ఇది దేశ వ్యాప్తంగా వచ్చిన గుర్తింపు. అయితే, రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ, నిర్వహణ, ప్రజాపాలనలో, పథకాల అమలులో పట్టు తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం సీఎం రేవంత్ కు ఉంది. పార్టీపై కూడా పట్టు మరింతగా సాధించాల్సి ఉంది. ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలి. గూడు కట్టుకుంటున్న ప్రజా వ్యతిరేకతను మొగ్గలోనే తుంచకపోతే అది పార్టీని, ప్రభుత్వాన్ని ముంచే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త!

