పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, ప్రపంచాన్ని ఆర్థిక, భౌగోళిక అనిశ్చితి మాత్రమేగాక, సంక్షోభంలోకి నెడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు నిర్ణయాలు ఈ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.
నెల దాటిన ఈ యుద్ధం ఆరంభంలోనే చమురు మార్కెట్లలో అస్థిరత పెరిగింది. చమురు ధరలు 10–20% హెచ్చుతగ్గులు చూపుతున్నాయి. సరఫరా, రవాణా మార్గాలు దెబ్బతినడంతో ఉత్పత్తి, రవాణా రంగాల్లో ఖర్చులు పెరిగాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి మళ్లీ తలెత్తుతోంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం, ఈ ఉద్రిక్తతలు ఇట్లే కొనసాగితే గ్లోబల్ వృద్ధిరేటు 0.5 నుంచి 1 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉంది.
అమెరికా ఈ యుద్ధంలో నేరుగా పాల్గొంటూ, ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఖర్చు చేస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 30–40 బిలియన్ డాలర్ల వరకు వ్యయం జరిగి ఉండొచ్చు. ప్రతి సెకనుకూ వేల డాలర్లు ఖర్చవుతున్నాయనే అంచనాలు ఆందోళన కలిగించేవే. యుద్ధ ఖర్చు పెరగడం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది.
ఈ సంక్షోభ ప్రభావం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై మరింతగా పడుతోంది. భారతదేశం తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందువల్ల చమురు ధరల్లో ప్రతి 10 డాలర్ల పెరుగుదల దేశ ఆర్థిక లోటును గణనీయంగా పెంచుతుంది. ఇదే సమయంలో రూపాయి విలువపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇటీవల రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రాత్మకంగా బలహీన స్థాయికి చేరింది.
మోదీ ప్రభుత్వం ప్రకటించిన 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఇప్పుడు మరింత సవాల్ గా మారింది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఏడాదికి కనీసం 8–9% స్థిరమైన వృద్ధి అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధి 5–6% మధ్యే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ, బాహ్య పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయి.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గత ఏడాదితో పోలిస్తే రెండంకెల స్థాయిలో తగ్గాయి. ఎగుమతులు కూడా 5–7% వరకు క్షీణత చూపుతున్నాయి. సరుకుల ఎగుమతులు 36–37 బిలియన్ డాలర్లకి పడిపోయినట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ఐటి, ఫార్మా వంటి కీలక రంగాలు అంతర్జాతీయ డిమాండ్ తగ్గుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
స్టాక్ మార్కెట్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. విదేశీ పెట్టుబడిదారులు లక్షల కోట్ల రూపాయలను వెనక్కి తీసుకోవడంతో మార్కెట్లు తీవ్ర మార్పులకు లోనయ్యాయి. కొన్ని అంచనాల ప్రకారం, భారత మార్కెట్లలో ఈ ఏడాది లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు తెలుస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే పెట్టుబడిదారుల నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉంది.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్యలు సామాన్య ప్రజలపై భారంగా మారుతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 3–6% మధ్య ఊగిసలాటలో ఉండగా, ఉద్యోగావకాశాలు మందగించాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు డిమాండ్ తగ్గుదలతో ఇబ్బందులు పడుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఈ నేపథ్యంలో ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, దేశీయ విధానాలు రెండూ కలిసి ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. పశ్చిమాసియా సంక్షోభం తాత్కాలికమైనదైనా, దాని ప్రభావాలు దీర్ఘకాలంగా కొనసాగవచ్చు. కాబట్టి భారత్ వంటి దేశాలు చమురు దిగుమతులను తగ్గించుకుని, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ ద్వారా ఎగుమతులను విస్తరించడం, దేశీయ డిమాండ్ను బలోపేతం చేయడం వంటి వ్యూహాలపై దృష్టి పెట్టాలి.
ఈ సంక్షోభం ప్రపంచానికి ఒక హెచ్చరిక. యుద్ధాలు తాత్కాలిక రాజకీయ లాభాలు ఇవ్వొచ్చేమో గానీ, వాటి ఆర్థిక ఖర్చు అపారమైనది. ఈ నేపథ్యంలో శాంతి, రాజనీతి చర్చలే స్థిరమైన పరిష్కారానికి మార్గం చూపగలవు.

