రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ సంక్లిష్టంగా, సంక్షోభంగా మారుతోంది. అప్పులు ఎలా తీర్చాలి? అన్న ఆలోచన, ప్రభుత్వాలకు పాలకులకు ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా విధానాల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. అభివృద్ధి పేరుతో అప్పులు పెంచడం, సంక్షేమం పేరుతో ఖర్చులు విస్తరించడం కలసి ఖజానాపై భారంగా మారుతున్నాయి.
భారత రాష్ట్రాల సగటు అప్పు-జీడీపీ నిష్పత్తి 25% నుంచి 30% మధ్యలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది 35% దాటింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు భారీగా అప్పులు తీసుకుని మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే సమస్య అప్పులు తీసుకోవడంలోనే కాదు, వాటిని ఎలా వినియోగిస్తున్నాం? ఎలా తీరుస్తామన్నదే కీలకం. ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ఆదాయం వస్తుంది. కానీ జీతాలు, సబ్సిడీలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తే అది నిరర్థకమై దీర్ఘకాలిక భారంగా మారుతుంది.
ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్లో పెద్ద భాగం వడ్డీ చెల్లింపులకే వెళ్తోంది. కొన్ని అంచనాల ప్రకారం, కొన్ని రాష్ట్రాల్లో మొత్తం ఆదాయంలో 15% నుంచి 20% వరకు వడ్డీలకే ఖర్చవుతోంది. మరోవైపు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి 30% నుంచి 40% వరకు వెళ్తున్నాయి. అంటే అభివృద్ధి పనులకు మిగిలేది పరిమితమే. ఇదే పరిస్థితి కొనసాగితే “డెట్ ట్రాప్”లో పడే ప్రమాదం ఉంది.
ఉచిత పథకాల అంశం కూడా ఈ నేపథ్యంలో ప్రస్థావనీయమే. ఉచిత రేషన్, ఉచిత విద్యుత్, పెన్షన్లు వంటి పథకాలు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో పాత్ర పోషిస్తున్నాయి. అయితే వీటి వ్యయం అనేక రాష్ట్రాల్లో బడ్జెట్లో 10% నుంచి 15% వరకు చేరింది. సమస్య ఏమిటంటే, ప్రయోజనం లేకుండా అమలు చేస్తే అనర్హులకూ లబ్ధి చేరుతుంది. ఫలితంగా ఖర్చు పెరుగుతుంది కానీ ఫలితం తక్కువగా ఉంటుంది.
ఇక రాజకీయ నియామకాలు, సలహాదారుల వ్యవస్థ కూడా ఖర్చులను పెంచుతున్న అంశమే. అవసరమైన నిపుణుల కంటే ఎక్కువగా నియామకాలు జరిగితే అది ఆర్థికపరంగా భారంగా మారుతుంది. ఒక సలహాదారికి నెలకు లక్షల రూపాయల జీతం, ఇతర భత్యాలు కలిపి సంవత్సరానికి కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇలాంటి పదవులు పదుల సంఖ్యలో ఉంటే మొత్తం ఖర్చు ఎంతవుతుందో అంచనా వేయడం కష్టం కాదు.
రాష్ట్రాలు ఆదాయం పెంచుకునేందుకు భూముల విక్రయం, మద్యం ధరల పెంపు, పరోక్ష పన్నుల విధానం వంటి మార్గాలను అనుసరిస్తున్నాయి. అయితే ఇవి తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. భూములు అమ్మడం ఒకసారి జరిగే ఆదాయం. మద్యం మీద ఆధారపడటం సామాజిక సమస్యలకు దారి తీస్తుంది. పన్నుల భారంతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడతారు.
అయితే, పరిష్కారం ఏమిటి? ఖర్చుల ప్రాధాన్యతను పునఃసమీక్షించాలి. అత్యవసర సంక్షేమం, ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్ణీత సంక్షేమ పథకాలనే అమలు చేయాలి. డిజిటల్ డేటా ఆధారంగా అర్హులను గుర్తించి, అనర్హులను తొలగించాలి. దీనివల్ల 20% వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆదాయం పెంపుపై దృష్టి పెట్టాలి. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, పన్నుల ఆదాయం కూడా పెరుగుతుంది. సేవల రంగం ప్రత్యేకంగా ఐటీ, పర్యాటకం రాష్ట్రాలకు పెద్ద ఆదాయ వనరుగా మారగలదు. వ్యవసాయరంగంలో ప్రాసెసింగ్, ఎగుమతులు పెంచితే రైతుల ఆదాయం పెరుగుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.
అప్పుల నిర్వహణలో క్రమశిక్షణ అవసరం. తీసుకునే అప్పులపై పరిమితి విధించడం, వడ్డీ భారాన్ని తగ్గించే విధంగా పునర్వ్యవస్థీకరణ చేయడం అవసరం. పారదర్శకత కూడా కీలకం. ప్రజలకు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలి.
రాజకీయ సంకల్పమే అత్యంత ముఖ్యమైనది. ఎన్నికల లాభనష్టాలకతీతంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. తక్షణ ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక నష్టాలను విస్మరించడం ప్రమాదకరం. అభివృద్ధి, సంక్షేమం రెండూ అవసరమే. కానీ, వాటి మధ్య సమతుల్యత ఉండాలి.
రాష్ట్రాలు ఆర్థికంగా బలపడాలంటే “అప్పులు తగ్గించడం” ఒక్కటే మార్గం కాదు. “సరైన విధంగా అప్పులు వినియోగించడం”, “ఆదాయం పెంచడం” జరగాలి. ఇదే నిజమైన ఆర్థిక సంస్కరణలకు పునాది.

