హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన వ్యవస్థలో ఇలాంటి టైంలో ఏ గవర్నర్? ఏ నిర్ణయం? తీసుకున్నా వివాదానికే అవకాశాలె క్కువ. తమిళనాడులో ప్రధాన సమస్య గవర్నర్ కాదు. స్పష్టమైన జాతీయ విధానం లేకపోవడమే. ఒక రాష్ట్రంలో అతిపెద్ద పార్టీకి అవకాశం ఇస్తే, మరో రాష్ట్రంలో కూటమికి అవకాశం ఇస్తున్నారు. దీంతో గవర్నర్ విచక్షణాధికారం రాజకీయ రంగు పులుముకుంటోంది.!*
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి భారత రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ పాత్రపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. 234 సభ్యుల అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే తాజా ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీకి ఇంకా 10 సీట్లు తక్కువయ్యాయి. డీఎంకే కూటమి 73 స్థానాలు, అన్నాడీఎంకే కూటమి 53 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందు మెజారిటీ మద్దతు లేఖలు సమర్పించాలని గవర్నర్ విశ్వనాథ్ కర్లేకర్ కోరడం రాజకీయ వివాదానికి దారితీసింది.
“అతిపెద్ద పార్టీగా అవతనించిన టీవీకేకే ముందుగా అవకాశం ఇవ్వాలి” కొందరంటుంటే, “మ్యాజిక్ ఫిగర్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానించడం రాజ్యాంగ విరుద్ధం” అని మరికొందరంటున్నారు. అయితే రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు, కమిషన్ సిఫారసులు ఏమి చెబుతున్నాయి? గవర్నర్ నిర్ణయం సరైనదేనా? ఇప్పుడు టీవీకే ఏం చేయాలి?
రాజ్యాంగం ఏం చెబుతోంది?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. కానీ ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే, సర్కారియా కమిషన్, తరువాత పుంచ్ఛీ కమిషన్లు హంగ్ అసెంబ్లీ సందర్భాల్లో కొన్ని మార్గదర్శకాలు సూచించాయి. వాటి ప్రకారం:
1. ముందస్తు కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంటే వారికి మొదటి అవకాశం ఇవ్వాలి.
2. అతిపెద్ద పార్టీ ఇతర పార్టీల మద్దతుతో మెజారిటీ చూపగలిగితే ఆహ్వానించాలి.
3. ఎన్నికల అనంతరం ఏర్పడిన కూటమిని పరిగణించాలి.
4. చివరికి అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ద్వారా మెజారిటీ నిరూపించుకోవాలి.
అంటే “అతిపెద్ద పార్టీ” అన్న కారణం ఒక్కటే ప్రభుత్వం ఏర్పాటు హక్కు ఇవ్వదు. అదే సమయంలో అతిపెద్ద పార్టీని పూర్తిగా పక్కన పెట్టాలని కూడా ఎక్కడా చెప్పలేదు. అందుకే ప్రతి హంగ్ అసెంబ్లీలో గవర్నర్ నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది.
గవర్నర్ నిర్ణయం సరైనదేనా?
ప్రస్తుత పరిస్థితిలో గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా తప్పు అనడం కష్టం. టీవీకేకు 108 సీట్లు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఆ మద్దతు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు మద్దతు ఇస్తున్నారు? అనే విషయంపై స్పష్టత లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తే తరువాత గవర్నర్ తీరుపై ఆరోపణలు రావచ్చు.
గతంలో కర్నాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఇదే జరిగింది. అతిపెద్ద పార్టీకి అవకాశం ఇచ్చి రోజులు గడిపిన తర్వాత ఎమ్మెల్యేల కొనుగోళ్లు, రాజకీయ ఒత్తిళ్లు, ఫిరాయింపులు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. అందుకే ఇప్పుడు గవర్నర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
అయితే, తమిళనాడు గవర్నర్ విజయ్ను తిరస్కరించలేదు. కేవలం “మెజారిటీ మద్దతు నిరూపించండి” అని మాత్రమే చెప్పారు. ఇది రాజ్యాంగబద్ధమైన అభ్యర్థనే. ఎందుకంటే, అంతిమంగా స్థిరత్వమైన ప్రభుత్వం ముఖ్యం. ఒకవేళ మెజారిటీ లేని ప్రభుత్వం ఏర్పడి వెంటనే కూలిపోతే రాష్ట్ర పరిపాలన అస్థిరంగా మారుతుంది.
టీవీకే ఇప్పుడు ఏం చేయాలి?
ప్రస్తుతం టీవీకే ముందున్న మార్గాలు స్పష్టంగా ఇలా తోస్తున్నాయి.
మొదటిది: డీఎంకే లేదా అన్నాడీఎంకే మద్దతు పొందడం.
కాంగ్రెస్ ఇప్పటికే 5 సీట్లతో మద్దతు ప్రకటించినప్పటికీ, అధికారిక లేఖలు సమర్పించలేదు. కాబట్టి విజయ్ రాజకీయ చర్చలను సాధ్యమైనంత వేగంగా ముగించాలి.
రెండోది: ఫ్లోర్ టెస్ట్ కు సిద్ధమవడం.
గవర్నర్ అవకాశం ఇస్తే అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలి. అయితే దానికి ముందే అవసరమైన మద్దతు సమీకరించడం కూడా అత్యవసరం.
మూడోది: తిరిగి ఎన్నికల పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది. ఏ పార్టీ లేదా కూటమి మెజారిటీ నిరూపించలేకపోతే రాష్ట్రపతి పాలన లేదా మరోసారి ఎన్నికలు తప్పకపోవచ్చు.
విమర్శలు సమంజసమేనా?
గవర్నర్ను విమర్శించడం సహజం. కానీ ప్రతి నిర్ణయాన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూడటం సరైంది కాదు. గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు ఆయన రాజ్యాంగ పరిరక్షణ కోసమే జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. నిజం చెప్పాలంటే మన వ్యవస్థలో హంగ్ సమయంలో ఏ గవర్నర్? ఏ నిర్ణయం? తీసుకున్నా వివాదానికి దారితీసే అవకాశాలే ఎక్కువ.
తమిళనాడులో ప్రధాన సమస్య గవర్నర్ కాదు. స్పష్టమైన జాతీయ విధానం లేకపోవడమే. ఒక రాష్ట్రంలో అతిపెద్ద పార్టీకి అవకాశం ఇస్తే, మరో రాష్ట్రంలో కూటమికి అవకాశం ఇస్తున్నారు. దీంతో గవర్నర్ విచక్షణాధికారం రాజకీయ రంగు పులుముకుంటోంది.
పరిష్కారమేంటి?
ఇలాంటి వివాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చట్టపరమైన మార్గదర్శకాలు తీసుకురావాలి. హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు:
1.ముందుగా ఎవరిని పిలవాలి?
2. మద్దతు లేఖలు తప్పనిసరా?
3. ఫ్లోర్ టెస్ట్ ఎన్ని రోజుల్లో జరగాలి?
4. అతిపెద్ద పార్టీకి ఎంత గడువు ఇవ్వాలి?
వంటి అంశాలపై రాజ్యాంగ సవరణ లేదా పార్లమెంటు చట్టం అవసరం. తమిళనాడు పరిణామాలు మరోసారి ఒక నిజాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు గెలవడం ఒక్కటే సరిపోదు. స్థిరమైన మెజారిటీని సమీకరించగల రాజకీయ సామర్థ్యమే ప్రభుత్వ ఏర్పాటుకు అసలు అర్హత. అంతేకాదు, ఈ హంగ్ పరిస్థితులు, సాగదీతలు కూడా పార్టీ ఫిరాయింపులను మరింతగా ప్రోత్సహించే ప్రమాదంగా పరిణమిస్తున్నాయి.

