ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు, నేతల ప్రవర్తన, వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలపై మరోసారి చర్చకు దారితీశాయి.
గత కొన్ని దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఉంది. ఇంతకాలం తరువాత సహజంగానే ప్రజల్లో ఆశలు, అసంతృప్తులు రెండూ పెరుగుతాయి. ఎన్నికల్లో ఓడిన లేదా ఫలితాలపై సందేహం ఉన్న పార్టీలు ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తడం కొత్త విషయమేమీ కాదు. భారత ఎన్నికల సంఘంపై విమర్శలూ కొత్తేమీ కాదు. అయితే ఆ ఆరోపణలకు సరైన రుజువులు అవసరం. లేదంటే ప్రజల్లో అపోహలు పెరిగే ప్రమాదం ఉంటుంది.
ఇటీవల దేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున “ఓటు చోరీ”, “ఈవీఎంల దుర్వినియోగం”, “సీట్ల లూటీ” వంటి పదజాలాన్ని ప్రయోగిస్తున్నాయి. ఇలాంటి వాదనలను నిర్ధారించడానికి చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. కోర్టులున్నాయి.
ఇక ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ వంటి నేతలు కూడా ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తతున్నారు. ఏదో ఒక చోట జరిగినదాన్ని, అనుమానాలను దేశవ్యాప్తంగా రుద్దడం రాజకీయంగా ఆ పార్టీకి లాభదాయకంగా కనిపించినా, మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేస్తుంది.
ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఓడిన నాయకుడు వెంటనే రాజీనామా చేయాలా? లేక చట్టపరమైన పోరాటం చేయాలా? అనే ప్రశ్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రజల తీర్పును గౌరవించడం అన్నది ప్రతి నాయకుడి ప్రాథమిక బాధ్యత. అదే సమయంలో, ఫలితాలపై అభ్యంతరాలు ఉంటే వాటిని రాజ్యాంగబద్ధంగా పరిష్కరించుకోవడం కూడా హక్కే. ఓడినా సరే, రాజీనామానే చేయం అనడం ఎంత వరకు సమంజసం? బహుషా మమత రాజీనామానే చేయననడం ఒక నిరసనగా భావించాలి.
ఇక “ప్రజల తీర్పు ఎంత శక్తివంతం?” అన్నది మరో ప్రశ్న. 60%, 70% లేదా అంతకంటే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైతే, అది ప్రజల్లో ఉన్న ఆసక్తిని సూచిస్తుంది. ఓటింగులో మహిళలు, యువత భాగస్వామ్యం కూడా పెరుగుతున్నది. ఇది సానుకూలాంశం. ప్రాంతీయ రాజకీయాల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఓటర్లు తరచూ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. ఎన్నుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య పరిపక్వతకు సంకేతం. ఒక పార్టీపై అసంతృప్తి పెరిగితే, ప్రజలు మార్పు కోరుకోవడం సహజం. అదే సమయంలో, కొత్త రాజకీయ శక్తులకు అవకాశాలు రావడం కూడా ఇదే ప్రక్రియలో భాగం.
ఇక రాజకీయ నాయకుల భాష బరితెగింపులా ఉంది. ఎన్నికల తరువాత భావోద్వేగంతో మాట్లాడటం సహజమే అయినప్పటికీ, వ్యక్తిత్వ హననానికి దిగడం, వ్యక్తిగత దూషణలు చేయడం, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళని తూలనాడటం, రాజ్యాంగ సంస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయాలకు, నాయకులకు కూడా ఆరోగ్యవంతం కాదు. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ వంటి సంస్థలపై నమ్మకం దెబ్బతింటే, అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం.
ప్రజాస్వామ్యంలో అసలు శక్తి ప్రజలదే. అత్యంత శక్తివంతులు ప్రజలే. నాయకులు వస్తారు, పోతారు. కానీ వ్యవస్థ నిలబడాలి. ఎన్నికలు కేవలం అధికార పోరాటం కాదు.అది బాధ్యత, జవాబుదారీతనం, నితి నిజాయితీ, నమ్మకాలనే నాలుగు స్తంభాలపై నిలిచే ప్రజాస్వామిక ప్రక్రియ. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు విమర్శలు ఏది పడితే అది విమర్శించడం, ఇష్టానుసారంగా, ఆధారరహితంగా ఆరోపించడం కాకుండా, పరిష్కార మార్గాలను కూడా సూచించాలి.
ప్రజల విశ్వాసం కోల్పోతే ఏ నాయకుడైనా నిలబడలేడు. అదే సమయంలో, ప్రజల తీర్పును గౌరవిస్తూ, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలం.

