ముచ్చటగా మూడే దారులు!
గతంలో హైకోర్టు తిరస్కరణ!
తీర్పేదైనా ప్రభావం తీవ్రమే!
రాజకీయాలను ప్రభావితం చేసేదే!
‘కీ’లకం కానున్న అత్యున్నత తీర్పు!
‘సుప్రీం’ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం తేలేది నేడే!
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిష్యత్తేంటి? ఉంటారా? ఊడుతారా? వారిపై అనర్హత వేటు పడనుందా? లేక వారి బంతి తిరిగి స్పీకర్ కోర్టులోకే రానుందా? అటా? ఇటా? వేటా!? నేడే తేలనుంది. తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్లపై గెలిచి, కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం నేడే తేలనుంది. రిజర్వు చేసిన తుది తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు చెప్పనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పునకు సంబంధించిన మూడే దారులున్నాయి. అందులో సుప్రీం దేన్ని ఎంచుకుంటుందన్ని ఆసక్తిగా మారింది. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా, తీర్పేదైనా తెలంగాణతోపాటు దేశ రాజకీయాలనే మలుపు తిప్పనున్నది. ప్రస్తుత, భవిష్యత్తు రాజకీయాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేయనున్నది.
న్యూఢిల్లీ, జులై 30 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, 119 సీట్లలో 64 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. కాగా, బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ – ఖైరతాబాద్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి – గద్వాల, కడియం శ్రీహరి – స్టేషన్ ఘనపూర్, తెల్లం వెంకట్రావ్ – భద్రాచలం, గూడెం మహిపాల్ రెడ్డి – పటాన్ చెరువు, కాలే యాదయ్య – చేవెళ్ల, టి. ప్రకాష్ గౌడ్ – రాజేంద్ర నగర్, డా. ఎం సంజయ్ కుమార్ – జగిత్యాల, అరికేపూడి గాంధీ – శేరిలింగంపల్లి, పోచారం శ్రీనివాస్ రెడ్డి – బాన్సువాడ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది రాజ్యాంగంలో గల 10వ షెడ్యూల్ లోని యాంటీ-డిఫెక్షన్ లా కింద అనర్హతకు దారితీసే అక్రమ ఫిరాయింపుగా బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ షెడ్యూల్ ప్రకారం, ఒక ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నా, లేదా పార్టీ విప్ను ఉల్లంఘించినా అనర్హత వేటు పడుతుంది. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
హై కోర్టు తిరస్కరణ
దీంతో బీఆర్ఎస్ ఆ పది మంది ఎమ్మెల్యేలపై హై కోర్టులో పిటిషన్ వేసింది. స్పీకర్ తన రాజ్యాంగ బాధ్యతల నుండి తప్పించుకోవడమేనని బీఆర్ఎస్ వాదించింది. అయితే వాదనలు విన్న తర్వాత నవంబర్ 2024లో, తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ బీఆర్ఎస్ పిటిషన్లను తిరస్కరించింది. అనర్హత పిటిషన్లపై నేరుగా తీర్పు ఇవ్వడానికి బదులు, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
సుప్రీం కోర్టుకు
ఈ తీర్పు తర్వాత కూడా స్పీకర్ నుండి ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో, బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్పెషల్ లీవ్ పిటిషన్ కింద దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావులపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసింది. అలాగే రిట్ పిటిషన్ కింద పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, ఎం. సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీలపై అనర్హత వేటు వేయాలని కోరింది. అనర్హత పిటిషన్లను నాలుగు వారాలలోపు పరిష్కరించేలా టైమ్లైన్ నిర్దేశించాలని సుప్రీం కోర్టును బీఆర్ఎస్ కోరింది. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కెపి వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపై 2025 మార్చి 4న జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, కౌషిక్ రెడ్డి తరపున న్యాయవాది ఆర్యాద సుందరం వాదనలు వినిపించారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్కి కోర్టులు సూచనలు చేసే అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అందుకు సంబంధించిన తీర్పును ఈ ఏడాది ఏప్రిల్ 3న జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వు చేసింది. ఇప్పుడు ఆ తుది తీర్పుని గురువారం ఉదయం.10.45 న్యాయమూర్తులు వెలువరించనున్నారు.
అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలపై కోర్టు సీరియస్
ఈ కేసు వాదనలు జరుగుతున్న సందర్భంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఉప ఎన్నికలు రావు. సభా నాయకుడిగా, స్పీకర్ తరపున కూడా నేనే చెబుతున్నా..’నంటూ అసెంబ్లీలో మాట్లాడితే కోర్టు ధిక్కరణ కిందకు రాదనే ధైర్యంతో సీఎం వ్యాఖ్యానించారు. ఈ విషయం సుప్రీం కోర్టులో ప్రస్థావనకు రాగా, సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించకపోతే ఎలా? అంటూ చీఫ్ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. కోర్టు ధిక్కరణ కిందకు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి సీఎం క్షమాపణలు చెప్పారు. పైగా ఎదుటి పక్షం నుంచి అంతకు మించిన కామెంట్లు వస్తున్న విషయం కోర్టు ద్రుష్టికి వెళ్ళింది. దీంతో ఈ కేసును తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాలు ఎంత సీరియస్ గా, ప్రతిష్టత్మకంగా తీసుకుంటున్నాయో అర్థమవుతుంది.
ఇదే ‘కీ’లకం!
స్పీకర్, ఇలాంటి అనర్హత పిటిషన్లపై ‘క్వాసి-జుడిషియల్ అధికారి’గా వ్యవహరిస్తారు. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం ఎటువంటి నిర్దిష్ట గడువును నిర్దేశించలేదు, ఇది ఆలస్యానికి ప్రధాన కారణంగా ఉంది.
తీర్పు ఎలా ఉండే అవకాశముంది?
తీర్పు ఎలా వస్తుందనేది కోర్టు తుది నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కానీ, రాజ్యాంగ పరిధి, ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో తీర్పు ముఖ్యమైన మూడు విధాలుగా వెలువడే అవకాశం ఉంది.
1. అనర్హత వేటు
రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ (ఎ) అధికరణం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజ్యాంగ నియమాల ఉల్లంఘన చేసినట్టుగా భావించి కోర్టు వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇది స్పీకర్ నిర్ణయాలపై ఆధారపడే అంశం కూడా కావొచ్చు.
2. స్పీకర్ నిర్ణయానికే వదిలేయవచ్చు
ఎంపికైన సభ్యుల అనర్హత నిర్ణయం స్పీకర్ అధికారం కింద వస్తుందని పేర్కొంటూ, కోర్టు వ్యవస్థాపక బాధ్యత స్పీకర్దే అని వ్యాఖ్యానించవచ్చు. ఇలాంటి తీర్పులు గతంలో చోటు చేసుకున్నవి. అయితే, తటస్థతపై సందేహాలున్నప్పుడు కోర్టు జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంది.
3. పిటిషన్ తిరస్కరణ:
పిటిషన్లో న్యాయపరమైన లోపాలుంటే లేదా ప్రాసెస్ సమర్థంగా జరగలేదని భావిస్తే కోర్టు పిటిషన్ను తిరస్కరించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే పిటిషన్ ఇప్పటికే విచారణ పూర్తై, తుది తీర్పునుకు వచ్చింది.
సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు సంచలనమై తెలంగాణతోపాటు దేశ రాజకీయాల్లో ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. దేశంలోని మొత్తం రాజకీయ సమీకరణలే మారవచ్చు? మలుపులకు కారణం కావచ్చు. అయితే, స్పీకర్ నిర్ణయానికి సంబంధించి కాల పరిమితి విధించే తీర్పులేవీ ఇప్పటి వరకు వెలువడలేదు. ఇప్పుడు వెలువడితే ఇదే కీలకం మాత్రమే కాదు సంచలనం కానున్నది. ఇంతకీ సుప్రీం కోర్టు తీర్పు ఏ విధంగా ఉండనున్నదన్నది మరికొద్దసేపట్లోనే తేలనుంది. తీర్పేదైనా మన ధ్రుఢమైన రాజ్యాంగానికి బలమైనదిగానే ఉండనుంది.

