ఆ మధ్య ఒక వీడియో వైరల్ అయింది. అందులో ఓ ప్రసంగికుడు, ‘చంద్రమండలంపై నివసించే అవకాశం వస్తే, అంతా మన కులం వాళ్ళే ముందుండాలి. వారికే ప్రాధాన్యం కల్పించాలి. అందుకనుగుణంగా మనమంతా చైతన్యం కావాలి.’ అంటూ కుల గజ్జిని నిర్లజ్జగా ప్రచారం చేశాడు. దాన్ని ఆ కులం వాళ్ళో లేక ఆ కులం అంటే పడని వాళ్ళో కానీ, తెగ వైరల్ చేసేశారు. అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక యుగంలోనూ కుల, మత ప్రాతిపదికన రాజకీయాలు నడవటం, రాజ్యాలుండటం, రాజ్యాంగాలుండటం, రాజ్యాలు ఏలుతుండటం నిజంగా సిగ్గుపడాల్సిన మూర్ఖత్వం. శోచనీయం. అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతూ, అంతరంగంలో మాత్రం కులం, మతం కుళ్ళును పెట్టుకోవడం విడ్డూరం కాక మరేమిటి? ఎవరేం చెప్పినా, చెప్పకపోయినా, కులం, మతం మన రక్తంలో అలా కలిసిపోయిందేమో? కులం, మతం విస్మరించలేని క్లేషంగా మిగిలిపోయింది. కొనసాగుతున్నది కూడా. CAST|RELIGION|POLITICS
దేశంలో మత, కుల రాజకీయాలు దినదిన ప్రవర్థమానం అవుతున్నాయి. మతం, కులాల పేరుతో పబ్బం గడుపుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటైంది. ఇందులోనూ ఆధిపత్య వైఖరి కొన్ని కులాలకు ఉంటుండగా, ఇతర కులాలకు బానిస మనస్తత్వం అలవాటైపోయింది. ఇది ఇంకా కొనసాగుతున్నందున, ఆయా కులాలు, మతాలు ఇంకా వాటినే నమ్ముకుని ప్రయాణిస్తున్నాయి. కాబట్టే కొన్ని మతాలు, కులాలు రాజ్యాధికారంలోనే పాలకులుగా ఉంటుండగా, మిగతా కొన్ని మతాలు, కులాలు పాలితులుగానే మిగిలిపోతున్నాయి. కుక్కకు బొక్కేసినట్లు ఏవో ఒకటి రెండు పదవులు పడేస్తే.. వాటిని కంకుకుంటూ కొన్ని కులాలు ఉంటున్నాయి. సమాజంలో, దేశంలో బలమైన వర్గాలకు ‘బలహీన వర్గాల’ని బోర్డు తగిలించేశారు. ఆ వర్గాలు నిజమే కాబోలని బలహీనంగా మారిపోయాయి. ఇంకొన్ని వర్గాలు అంబేద్కర్ పుణ్యమాని అందివచ్చిన రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయి. అంతే తప్ప పాలకులు, పాలితులకు ఏనాడూ రాజ్యాధికారం అప్పగించడం లేదు. CAST|RELIGION|POLITICS
పార్టీలు, వాటి అధ్యక్ష పదవులు మొదలు ప్రధానులు, సీఎంలు, మంత్రులు ఇలా అంతా కొన్ని కులాల గుత్తాధిపత్యంగా మారిపోయాయి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను కేవలం ఓటు బ్యాంక్ చేసుకుని రాజకీయాలు చేస్తూ, అధికార పెత్తనం చెలాయిస్తూ దేశాన్ని దేశాన్ని, పాలనను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. నిజానికి కులాల కుంపట్లతో చలి మంట కాల్చుకోవడం తప్ప సాధించేదేమీ లేదు. ఒకవైపు మరో ప్రపంచం, మరో ప్రపంచం అంటూ అనేక దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే మనం మాత్రం మతాలు, కులాలు, వర్గాలు అంటూ కుమ్ములాడుకుని, కొట్టుకు చస్తున్నాం. దీనికితోడు దేశంలో సిద్ధాంత నిబద్ధత లేని రాజకీయాలు నడుస్తున్నాయి. విద్వేషాలు, విభేదాలతో రాజకీయాలు రక్తి కడుతున్నాయి. CAST|RELIGION|POLITICS
కేవలం బీజేపీ హిందుత్వాన్ని ప్రోత్సహింస్తోంది. ముస్లీం మైనార్టీలకు అనుకూలంగా కాంగ్రెస్ పని చేసింది. ఇదే అదనుగా కొన్ని ముస్లీం పార్టీలు అధికార పార్టీకి అండగా నిలుస్తున్న వైనం మనం చూస్తూనే ఉన్నాం. దేశ, ప్రజా ప్రయోజనాలను మించి ఓట్ల కోసం వెంపర్లాడే రాజకీయాలను అన్ని పార్టీలు దూరం పెట్టాలి. నిజానికి మైనార్టీలను సంతోష పెట్టే మిషతో విభజన రేఖలు గీస్తున్నది రాజకీయ పార్టీలే. అన్ని మతాలను, కులాలను, వర్గాలను సమానంగా చూసే రాజకీయాలు దేశానికి అవసరం. CAST|RELIGION|POLITICS
ఇప్పటికే మత ప్రాతిపదికన దేశం విచ్ఛిన్నం అయింది. దేశ విభజన జరిగింది. ఆ పీడకల నుంచి, ఆ విడిపోయిన ప్రతిఫలాల నుంచి ఇంకా మనం బయటపడలేదు. అన్ని మతాలు, కులాలు, వర్గాల ప్రజలను ఈ దేశ సంస్కృతిలో భాగంగా చూడాలి. ప్రధానంగా దేశంలో కమ్యూనిస్టులు ఇంకా మేల్కోవడం లేదు. పడికట్టు పదాలతో గిమ్మిక్కులను ప్రజలను నమ్మేస్థితిలో లేరు. స్వార్థ, స్వప్రయోజనాల కోసం కాకుండా, దేశ, ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే రాజకీయాలు చేసే అలవాటును మన దేశంలో పార్టీలు అలవరచుకోవాల్సి ఉంది. CAST|RELIGION|POLITICS
ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ టెర్రరిజం వేళ్ళూనుకుని, విస్తరిస్తోంది. ఈ టెర్రరిజాన్ని అంతం చేయడంలో కఠినంగా వ్యవహరించకపోతే, ఆ విపరిణామాలను అనుభవించాల్సిన ఆగత్యం తప్పదు. మతోన్మాద రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తోందన్న విమర్శలెలా ఉన్నా, ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతకంటే కూడా ఖండించాలి. ఉగ్రవాద నిర్మూలనకు నడుం బిగించాలి. అమాయకుల ప్రాణాలు ఇంకా బలి కాకూడదు. అంటే ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను అణచివేయడంలో ప్రపంచమంతా ఏకం కావాల్సి ఉంది. CAST|RELIGION|POLITICS
ప్రపంచంలో వినియోగాలు, ఉత్పత్తులు, అవసరాలు, మారుతున్నాయి. ఏ దేశం కూడా ఇతర దేశాలపై ఆధారపడకుండా, స్వతంత్రంగా మనగలిగే పరిస్థితులు లేవు. అన్ని దేశాలు రకరకాల సమస్యలతో పోరాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో అంటరానిది లేదు. ఏ వస్తువుకు, అవసరానికి మతం, కులం, వర్గం, ప్రాంతం, దేశం లేదు. అన్నీ అందరికీ సమానమైనవిగానే భావించాల్సి ఉంది. నిజానికి ప్రజల్లో కుల, మత, వర్గ వైషమ్యాల తీవ్రత అంతగా లేదు. కానీ, రాజకీయ పార్టీల వల్లే అవి పెచ్చరిల్లుతున్నాయి. రెచ్చగొట్టడం, ఓట్లను కొల్లగొట్టడమనే నినాదాలతో, సిద్ధాంతాలతో, రాజకీయ పార్టీలు రాజ్యమేలుతున్నాయి. ప్రజలని ఆయా కుల, మత, ప్రాంత, వర్గాలుగా విడదీసి రాజకీయ పార్టీలు, అధికారాన్ని, ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. కలసిమెలసి జీవించే ప్రజా జీవితాల్లో ఆజ్యం పోయకుండా, అన్ని రాజకీయ పార్టీలు ప్రజల ఎజెండాతో ముందుకు సాగాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. CAST|RELIGION|POLITICS

