తెలంగాణలో ప్రజా గాయకుడిగా, విప్లవ కవిగా పేరుగాంచిన గద్దర్ 77వ జయంతిని శుక్రవారం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గద్దర్పై హృదయపూర్వక నివాళులు అర్పించారు. గద్దర్ చివరి శ్వాస వరకూ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడారని, ఆయన సమాజ హితం కోసం అంకితభావంతో పనిచేశారని సీఎం అన్నారు.
గద్దర్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారని, ప్రతి సందర్భంలో తనను ప్రోత్సహించారని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. సమాజమే తన కుటుంబంగా భావించి జీవించిన గద్దర్ ఒంటరిగా అనిపించినప్పుడు తనను ఆదరించేవారని, ఆయన మాటలు తనకు ఎప్పుడూ మార్గదర్శకంగా ఉండేవని గుర్తుచేశారు. “నీ బాధ్యత నెరవేర్చు, ప్రజలు నీకు అవకాశం ఇస్తారు” అనే గద్దర్ మాటలు తన రాజకీయ జీవితంలో ఎంతో ప్రభావం చూపాయని ఆయన అన్నారు.
సమాజానికి స్ఫూర్తినిచ్చేలా గద్దర్ పేరిట అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. గద్దర్ అవార్డుల బాధ్యతను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినట్లు ప్రకటించారు. ఏటా గద్దర్ జయంతిని ఘనంగా నిర్వహించడం ద్వారా ఆయనను స్మరించుకుంటామని అన్నారు.
గద్దర్ మృతదేహాన్ని ఎల్బీ స్టేడియానికి తీసుకెళ్లేందుకు గత ప్రభుత్వంలో అడ్డంకులు పెట్టారని సీఎం రేవంత్ మండిపడ్డారు. అయితే ప్రజలందరికీ గద్దర్ చివరి చూపు అందించాలనే ఉద్దేశంతో ఎల్బీ స్టేడియంలో అంతిమ సంస్కారాలకు అవకాశం కల్పించామని వివరించారు.
పద్మ అవార్డుల విషయంపై కూడా సీఎం రేవంత్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి ఐదుగురి పేర్లు సిఫార్సు చేసినట్లు తెలిపారు. గద్దర్, గోరటి వెంకన్న, చుక్కా రామయ్య, అందెశ్రీ, జయధీర్ తిరుమలరావులకు పద్మ పురస్కారాలు ఇవ్వాలని ప్రతిపాదించామని చెప్పారు. పక్క రాష్ట్రాలకు ఐదు అవార్డులు ఇచ్చిన కేంద్రం, తెలంగాణ ప్రతిపాదించినవారికి ఎందుకు అవార్డులు ఇవ్వలేదని ప్రశ్నించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయానికి గద్దర్ పేరు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్ను అవమానిస్తే తగిన గుణపాఠం నేర్పుతామని, ఆయన పేరు అపహాస్యం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గద్దర్ అవార్డును ప్రతిష్టాత్మకంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రజా ఉద్యమాలకు ఆయన అందించిన సేవలను తరతరాలకు గుర్తు చేసేలా కార్యక్రమాలు చేపడతామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రజా పోరాటాల్లో గద్దర్ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

