“ఆపరేషన్ సిందూర్” సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
దేశ భద్రతా పరిస్థితుల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆపరేషన్ సిందూర్ సమీక్ష సమావేశం నిర్వహించగా…. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, ఈ సమయంలో రాజకీయాలకు, పార్టీ వ్యవహారాలకు ఏమాత్రం తావు లేదని స్పష్టం చేశారు. ప్రజలంతా దేశ సైన్యంతో ఉన్నామనే బలమైన సందేశాన్ని ఇచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని సూచించారు.
ఈ క్రమంలో అత్యవసర సేవల విభాగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ వారంతా పూర్తిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంత్రులు, ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు విదేశీ పర్యటనలు తక్షణమే రద్దు చేసుకోవాలని సూచించారు. మీడియా లేదా సోషల్ మీడియాలో అసత్య ప్రకటనలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా హెచ్చరించారు.
ప్రజలతో 24 గంటల పాటు సంప్రదించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. అంతేగాక, పాక్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అక్రమంగా నివసిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రక్తదానం, అత్యవసర ఔషధాలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ల అందుబాటు, రెడ్ క్రాస్ సంస్థలతో సమన్వయం వంటి అంశాలపైనా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధంగా ఉండేలా చూడాలని, అత్యవసర మందులు సమీకరించాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల (బెడ్ లు) వివరాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే, ఫేక్ న్యూస్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపనున్నదని సీఎం రేవంత్ హెచ్చరించారు. పౌరులలో ఆందోళన కలిగించే వదంతులను అరికట్టేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో భద్రతను మరింత బలోపేతం చేయాలని, ముఖ్యంగా మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానించాలన్నారు. విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ కంపెనీలు వంటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో భద్రత పెంచాలని, అవసరమైతే పీస్ కమిటీ లతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హిస్టరీ షీటర్లు, పాత నేరస్తులపై పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని సూచించారు.
ఈ సమీక్షలో సీఎం చేసిన సూచనలు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ప్రజల భద్రతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పలువురు అభినందిస్తున్నారు.

