ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దని ఏనాడో చెప్పాడు మహాకవి శ్రీశ్రీ. ఎవరి కోసం ఎవరూ రాని ఈ రోజుల్లో ప్రజల కోసం వచ్చేవాళ్లు కూడా లేకుండా పోయారు. ప్రజలు కేంద్రంగా పని చేసే రాజకీయ పార్టీలు, నాయకులు కూడా ప్రజలు, వారి సమస్యలు ఎజెండాగా కాకుండా, సొంత ఎజెండాలతో వారి వారి మనుగడ, ఉనికి కోసం మాత్రమే పని చేస్తున్నాయి. అన్ని జెండాలు వారి ఎజెండాలనే అమలు చేసుకుంటున్నాయి. ఇక సమస్య ఏదైనా మైలేజీ వస్తేనే పార్టీలు టేకప్ చేస్తున్నాయి. తప్పితే ప్రజా సమస్యలను పెద్దగా పట్టించుకోవడం ఏనాడో మానేశాయి. దీంతో ప్రజా సమస్యలు దిక్కులేని, దిక్కుమాలిన అనాథలవుతున్నాయి. ఇప్పుడు దేశంలో సమస్య ఏదైనా ప్రజలే తమకు తాముగా ఉద్యమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలే ఎక్కడికక్కడ తమ సమస్యల పరిష్కారాలను తామే చూసుకోవాల్సి వస్తున్నది. ఆయా సమస్యలను ఎలుగెత్తి చాటాల్సిన ప్రథమ కర్తవ్యాన్ని ప్రజలు భుజాలకెత్తుకోవాలి.
పార్లమెంట్, అసెంబ్లీల్లో అధికార, విపక్షాలు సొంత ఎజెండాలతో నడుస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు, రాష్ట్రాల్లో పాలక, ప్రతిపక్షాలు కూడా సొంత ఎజెండాలనే అనుసరిస్తున్నాయి. ఎన్నికల సమయంలో తప్పితే, ప్రజలతో పార్టీలకు సంబంధాలే లేకుండా పోయాయి. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన లేదు. ప్రజా వ్యతిరేక విధానాలపై అందరిదీ ఒకటే దారి. రాష్ట్రాల్లో నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రాంతీయ పార్టీలు కేంద్రంపై యుద్ధానికి దిగినా ప్రజలని ఆకర్శించలేకపోతున్నాయి. తమపై పెట్టిన ఇడి కేసులపై ధర్నాలు చేస్తున్న కాంగ్రెస్, ప్రజా సమస్యలపై ఎందుకు పోరాటం చేయడంలేదు. అందుకే కాంగ్రెస్ కు ఇలాంటి సమయంలో ప్రజా మద్దతు కరువవుతున్నది.
ఇక ప్రజా సమస్యలను ఉద్యమాలుగా మలచిన కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆ పంథాని ఏనాడో వీడాయి. అప్పటి నుంచే కమ్యూనిస్టు పార్టీలు ప్రజలకు దూరమవడం మొదలైంది. ఇప్పుడు ఆ ప్రాభవం కోసం పాకులాడుతున్న లెఫ్ట్ పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు అప్పుడప్పుడు ఉద్యమిస్తున్నా, ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే లెఫ్ట్ పార్టీలు మనుపెన్నడూ లేనంతా బలహీనపడ్డాయి. ప్రజా మద్దతును కోల్పోయాయి. ఈ దశలో ఇక ఉమ్మడిగా పోరు చేయడానికి అన్ని పార్టీలను కలుపుకుని పోవడానికి సిద్దం కావాలి. కానీ, పార్టీలకు సొంత ఐడెంటిటీ, మైలేజీ సమస్యలుగా మారాయి. కలిసి పని చేస్తే క్రెడిట్ ఎవరు కొట్టేస్తారోననే భయం పట్టుకుంది. పశ్చిమ బెంగాల్ లో మమతపై ఒంటరి పోరాటం చేస్తున్న లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్తో కలవలేకపోతున్నాయి. కేరళలో అధికారం పంచుకోవడం వరకే తప్పితే, మిగతా ఎవరిదారి వారిదే. అయితే ప్రజా సమస్యలపై ఒంటరిగా లేదంటే కలిసికట్టుగా పోరాటాలు చేయాలని అన్ని పార్టీలు గుర్తించాలి. ఆయా పార్టీల్లో ఉన్న అనైక్యతను తమకు అనుకూలం చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. ఆయా పార్టీలు, ఆ పార్టీల పాలిత రాష్ట్రాల్లో నేతల అవినీతిపై కూడా బీజేపీ కాచుకుని కూచుంది. ప్రజా సమస్యలపై పార్టీలు పోరాడితే, ప్రజల మద్దతు ఆ పార్టీలకు దక్కుతుంది.
ప్రధానంగా రైతాంగ, కార్మిక సమస్యలపై ఉద్యమించాల్సిన తరుణం ప్రస్తుతం దేశంలో ఉంది. పెట్రోలు, గ్యాస్, నిత్యావసర ధరలు పెరిగాయి. ఉత్తరాది పది రాష్ట్రాల్లో రైతులు ఆందోళనకు దిగి కేంద్రానికి ముచ్చెమటలు పట్టించారు. గతంలో తమిళనాడు రైతులు కూడా ఢిల్లీ వేదికగా దిగ్విజయంగా ఆందోళనకు దిగారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం విఫలమైంది. రైతు ఉద్యమాల కారణంగా సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నా, రైతు సంక్షేమానికి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. అత్యధిక ప్రజలు ఆధారపడిన వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతులను నమ్మించగలిగితే ఇది రైతు ఉద్యమాలకు సరైన సమయం. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోడీ హావిూలు అటకెక్కాయి. దేశంలో 42 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అంటున్నారు. గత పదేళ్ల యూపిఎ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను బిజెపి ప్రభుత్వం మరింత దూకుడుగా అమలు చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దేశంలో రైతుల వద్ద భూములను వివిధ పరిశ్రమల అవసరాల కోసం బలవంతంగా లాక్కొంటున్న తీరును ఎండగట్టాల్సి ఉంది. మరోవైపు ప్రజాస్వామ్య హక్కులపై దాడి కొనసాగుతోంది. ప్రజలను కుల, మత ప్రాతిపదికన విభజిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిరుద్యోగిత పెరిగింది. ఉన్న ఉద్యోగాలు ఊడి పోతున్నాయి. విద్యా, వైద్యం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణ బలంగా వేళ్ళూనుకుంది. ప్రభుత్వంలో కార్పొరేట్ శక్తుల ప్రభావం పెరుగుతున్నది. మేక్ ఇన్ ఇండియా నినాదంలో పస లేకుండా పోయింది. ఉన్న పరిశ్రమలు మూత పడుతున్నాయి. మొత్తంగా దేశంలో ప్రజలంతా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని ప్రజలు గుర్తించారు. ఆ సమస్యలను గర్తించి, ఉద్యమించడంలోనే పార్టీలు విఫలం అవుతున్నాయి.
ఇక అంతర్జాతీయంగా ట్రంప్ సుంకాలు, ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపనున్నాయి. వృద్ధిరేటు తగ్గి, ద్రవ్యోల్బణం పెరిగి, ధరలు పెరిగి, కొనుగోలు శక్తి తగ్గి, నిరుద్యోగిత మరింత తీవ్రం అయ్యే సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవి ప్రజలు ఎదుర్కోవాల్సిన సమీప భవిష్యత్తు సమస్యలు. వీటన్నింటినీ పార్టీలు అడ్రస్ చేయాల్సి ఉంది. లేకపోతే ఆ పార్టీల అడ్రసే గల్లంతు కావచ్చు.

