దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేది కేవలం అంతర్జాతీయ సంక్షోభాలు మాత్రమే కావు. బాధ్యతారాహిత్య పాలన, ఆర్భాట రాజకీయాలు, అనుత్పాదక వ్యయం, ఓటు బ్యాంకు రాజకీయాలే అసలు కారణాలు. కాన్వాయ్లలో కార్లు తగ్గించడం ఒక్కటే పొదుపు కాదు. పాలనలో క్రమశిక్షణ, ఖర్చుల్లో బాధ్యత, ప్రజల్లో ఉత్పాదక దృక్పథం పెంపొందించగలిగితేనే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది. లేకపోతే సంక్షోభాల నుంచి బయటపడటం కష్టమే!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు సంక్షోభాల చక్రంలోనే తిరుగుతోంది. ఒక వైపు యుద్ధాలు, మరో వైపు చమురు ధరల పెరుగుదల, ఇంకో వైపు అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రకృతి వైపరీత్యాలు, ఆయా దేశాల్లో సంభవించే రకరకాల సమస్యలు ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ యుద్ధోన్మాద వ్యాఖ్యలు చేస్తూ బాంబుల బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటి పరిణామాలు ముడిచమురు ధరలను పెంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన పాలకులు మాత్రం రాజకీయ ఆర్భాటాలకే పరిమితమవుతున్నారు.
భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. కేంద్ర ప్రభుత్వ అప్పులు ఇప్పటికే రూ.180 లక్షల కోట్లకు చేరువయ్యాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశ జీడీపీలో కేంద్ర–రాష్ట్రాల కలిపిన అప్పులు దాదాపు 82 శాతానికి చేరినట్లు వివిధ ఆర్థిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయినా ప్రభుత్వాల ఖర్చు తీరు మాత్రం మారడం లేదు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. నిరుద్యోగం పెరుగుతోంది. ధరల పెరుగుదల మధ్య సామాన్యుడు నలిగిపోతున్నాడు. ఈ సమయంలో ఉత్పాదక రంగాలను బలోపేతం చేయాల్సింది పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం సంక్షేమ పథకాల పేరిట ప్రభుత్వాలు అప్పులపాలవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరం. అప్పుల్లో పెద్ద భాగం వడ్డీలు చెల్లించడానికే వెళ్తోంది. అంటే అభివృద్ధి కోసం తీసుకున్న అప్పులు తిరిగి ప్రజలపై భారంగా మారుతున్నాయి. సంక్షేమం పేరుతో ఉచిత పథకాలను వరుసగా ప్రకటిస్తూ ప్రభుత్వాలు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నాయి.
రూపాయికే బియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, నగదు బదిలీలు వంటి పథకాలు తాత్కాలిక ఉపశమనం ఇవ్వొచ్చు. కానీ ప్రజలను స్వయం సమృద్ధి వైపు నడిపించకుండా ఆధారపడే మనస్తత్వాన్ని పెంచితే అది అభివృద్ధి కాదు. ఉత్పత్తి రంగాలు, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు పెంచకుండా కేవలం నగదు పంచడం ద్వారా సమాజం బలపడదు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా సంక్షేమం పేరుతో అప్పులు చేయడం అంటే భవిష్యత్ తరాలపై భారాన్ని మోపడం.
ఇంకో వైపు ప్రభుత్వాల దుబారా ఖర్చులు సామాన్య ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు సాధారణ విమానాల్లో ప్రయాణించేవారు. ఇప్పుడు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు, భారీ కాన్వాయ్లు సర్వసాధారణమయ్యాయి. ముఖ్యమంత్రుల పర్యటనల కోసం వందలాది పోలీసులను మోహరిస్తున్నారు. కాన్వాయ్లలో పదుల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి. భద్రత పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల ముప్పు ఎక్కువగా ఉన్న సమయంలోనూ ఇంతటి ఆర్భాటం ఉండేది కాదు. ఇప్పుడు నక్సలిజం అంతరించిపోయిందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించినా భద్రతా వ్యవస్థ మాత్రం మరింత విస్తరించింది. మాజీ, ప్రస్తుత ముఖ్యమంత్రుల కోసం హైదరాబాద్, అమరావతి, బెంగళూరు వంటి నగరాల్లో ప్రత్యేక భద్రతా బలగాలు ఉండటం ప్రభుత్వ వ్యయాన్ని మరింత పెంచుతోంది.
ప్రధాని, మరికొందరు సీఎం లు ఇటీవల చమురు సంక్షోభం నేపథ్యంలో కాన్వాయ్లలో వాహనాల సంఖ్య తగ్గించాలని నిర్ణయించడం, మహానాడును వర్చువల్గా నిర్వహించాలని ప్రకటించడం వంటి చర్యలు స్వాగతించదగినవే. కానీ ఇవి ప్రారంభ చర్యలే తప్ప సమగ్ర సంస్కరణలు కావు. ప్రభుత్వ ఖర్చుల్లో నిజమైన పొదుపు రావాలంటే పాలకులు తమ జీవనశైలిలో మార్పు తీసుకురావాలి. ప్రజలకు ఆదర్శంగా నిలవాలి.
మరోవైపు భారీ పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేస్తున్నా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నాయి. సాధారణ రైతు అప్పు చెల్లించలేకపోతే ఆస్తులు జప్తు చేస్తారు. కానీ కార్పొరేట్ సంస్థల విషయంలో మాత్రం ప్రభుత్వాలు మౌనం పాటిస్తాయి. ఈ ద్వంద్వ వైఖరి దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తోంది.
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం అంటే కేవలం ఉచిత పథకాలు కాదు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, ఉపాధి అవకాశాలు, పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ బలోపేతం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. కానీ ప్రస్తుతం రాజకీయాలు ఓట్ల కోసం పోటీ పడుతున్నాయి గానీ, భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం కాదు.
దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేది కేవలం అంతర్జాతీయ సంక్షోభాలు మాత్రమే కావు. బాధ్యతారాహిత్య పాలన, ఆర్భాట రాజకీయాలు, అనుత్పాదక వ్యయం, ఓటు బ్యాంకు రాజకీయాలే అసలు కారణాలు. కాన్వాయ్లలో కార్లు తగ్గించడం ఒక్కటే పొదుపు కాదు. పాలనలో క్రమశిక్షణ, ఖర్చుల్లో బాధ్యత, ప్రజల్లో ఉత్పాదక దృక్పథం పెంపొందించగలిగితేనే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది. లేకపోతే సంక్షోభాల నుంచి బయటపడటం కష్టమే.

