ప్రపంచ యాంటీమైక్రోబియల్ అవగాహన సప్తాహం: 18-24 నవంబర్ 2025
సూక్ష్మజీవ నాశకాలకు బ్యాక్టీరియా, వైరస్ లు, శిలీంద్రాలు మరియు పరాన్నజీవులు స్పందించక పోతే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏ ఎం ఆర్) ఏర్పడుతది. ఔషధ నిరోధకత ఫలితంగా, యాంటీబయోటిక్స్ మరియు ఇతర సూక్ష్మజీవ నాశకాలు ప్రభావ రహితమై అంటులు (ఇన్ఫెక్షన్స్) మొండి పారి, బాగు చేయటం అసాధ్యమై, వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం పెరిగి, జబ్బు ప్రమాదకరంగా మారి, మరణం కూడా సంభవించ వచ్చు.
ఏ ఎం ఆర్ ఇప్పటికే జటిల సమస్యగా మారింది. ఏ ఎం ఆర్ వల్ల ఔషధ నిరోధక అంటులు (ఇన్ఫెక్షన్స్) పెరిగి, మన ఆరోగ్య, ఆహార, పర్యావరణ, ఆర్థిక వ్యవస్థలకు చాలా హాని కలుగుతున్నది. మానవ వైద్యం, పశు వైద్యం, వ్యవసాయం, మాంస ఉత్పత్తిలో సూక్ష్మజీవ నాశకాల వినియోగం విచక్షణా రహితంగా జరుగుతున్నది. సూక్ష్మజీవి నాశకాల, అంటు వ్యర్థాల అశాస్త్రీయ, బాధ్యతా రహిత విసర్జన కూడా ఒక విష వలయంగా మారింది.

ఔషధ నిరోధక సూక్ష్మజీవుల పుట్టుక, వ్యాప్తి గురించి ప్రపంచవ్యాప్తంగా అర్థం చేయించటానికి, ఏ ఎం ఆర్ ను అవగతం చేసెటానికి ప్రపంచ యాంటీ మైక్రోబియల్ అవగాహన సప్తాహం (డబ్ల్యూ ఏ ఏ డబ్ల్యూ) ను ఏటా నవంబర్ 18 నుంచి 24 ను నిర్వహిస్తున్నరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ ఎచ్ ఓ) ఈ సంవత్సరానికి “యాక్ట్ నౌ: ప్రొటెక్ట్ అవర్ ప్రసెంట్, సెక్యూర్ అవర్ ఫ్యూచర్” అనే నినాదాన్ని ఎంపిక చేసింది. డబ్ల్యూ ఎచ్ ఓ అధికారిక కార్యక్రమమైన దీనికి ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్ ఏ ఓ), ఐక్యరాజ్య పర్యావరణ యోజన (యూ ఎన్ ఈ పి), ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ ఏ ఎచ్ ఓ) కలుపుకొని పని చేస్తున్నయి.
దీని తీవ్రతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 2024 సాధారణ సభలో ఏ ఎం ఆర్ మీద ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం ఏ ఎం ఆర్ ను ఎదుర్కోవటానికి చేపట్ట వలసిన చర్యలను సూచిస్తూ, ప్రభుత్వాలు, పౌర సమాజం, ఆరోగ్య నిపుణులు, పశువైద్యులు, వ్యవసాయదారులు, పర్యావరణ కార్యకర్తలు మరియు ప్రజలు అందరికీ ఏ ఎం ఆర్ పరిష్కార దిశగా అంకితభావంతో అడుగులు వేయాలని విజ్ఞప్తి చేసింది.
ఏ ఎం ఆర్ పరిష్కారానికి ప్రభుత్వాలు, అధికారులు, వైద్యుల నుంచి వ్యవసాయదారుల దాకా బాధ్యతాయుతంగా వ్యవహరించాలె. ప్రజలు యాంటీబయాటిక్స్ వినియోగంపై ఫార్మసిస్ట్ లు, పెస్టిసైడ్స్ వినియోగంపై వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలె. ఏ ఎం ఆర్ ను అవగాహన చేసుకొని, దాని పట్ల ప్రస్తుతం వివేకవంతంగా పనిచేస్తేనే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.


