SAVAL|సవాల్ కి నిలుస్తారా?
సీఎం, మాజీ సీఎంల సవాళ్ళతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. “ప్రజల్లోకి వస్తాం, ప్రభుత్వం తోలు తీస్తాం” అని కేసీఆర్, “నేను రాజకీయాల్లో ఉన్నంతవరకు కేసీఆర్, ఆయన కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను. ఇదే నా శపథం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ నేపధ్యంలో సహజంగా తలెత్తుతున్న ప్రశ్న: కేసీఆర్ నిజంగానే ప్రజల్లోకి వచ్చి రేవంత్ సవాల్ను స్వీకరిస్తారా? లేక వ్యూహాత్మక మౌనం కొనసాగిస్తారా?
హైదరాబాద్, డిసెంబర్ 25 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చిన మాజీ కేసీఆర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క’ అంటూ కాంగ్రెస్ సర్కార్కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. డైరెక్ట్ వార్ ప్రకటించారు. రెండేళ్లు ఆగాం. ఇకపై ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తా.. తోలు తీస్తామన్నారు. జనంలోకి తానే నేరుగా వస్తానని ప్రకటించారు. కళ్ల ముందు ఇదంతా జరుగుతుంటే మౌనంగా ఉండాలి, ఇష్టానుసారం మాట్లాడుతామంటే కుదరదని కేసీఆర్ రాజకీయ యుద్ధం ప్రకటించారు.ఇది జరిగిన రెండు మూడు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కుటుంబం కాలకూట విషం. కేసీఆర్, బీఆర్ఎస్ చరిత్ర ఖతమే. ఇక గతమే. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెసే. 2029లో రెండింట్ల మూడొంతల మెజార్టీతోని కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ ఇదే నా సవాల్ అంటూ విసిరారు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను అధికారంలోకి రానివ్వనంటూ శపథం పూనారు.
మారిన రాజకీయ సమీకరణలు
బీఆర్ఎస్ పదేళ్ళ పాలన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు మారాయి. రేవంత్ రెడ్డి తన సహజ రాజకీయ శైలిలో బీఆర్ఎస్, కేసీఆర్ పై దూకుడు, వాగ్దాడిని ప్రధానాస్త్రాలుగా సంధిస్తున్నారు. కేసీఆర్ పై కుటుంబం పాలన, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కానీ, కేసీఆర్.. అధికారాన్ని కోల్పోయిన తర్వాత దాదాపు మౌనంగా ఉంటున్నారు. అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు. ఎంపిక చేసుకున్న అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే బయటకు వస్తున్నారు. మాట్లాడుతున్నారు. అయితే ఈ మౌనం బలహీనతా? రాజకీయ వ్యూహమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వ్యూహాత్మక వాగ్దాడి రేవంత్ ఎజెండా
రేవంత్ రెడ్డి సవాళ్ల వెనుక మాత్రం స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. గత పాలనను నిరంతరం ప్రశ్నించడం ద్వారా ప్రజా అజెండాను నియంత్రిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, శ్రేణులకు, ప్రభుత్వానికి నైతిక బలం కల్పిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ను ఆత్మ రక్షణలోకి నెడుతున్నారు. కేసీఆర్ను టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ రాజకీయ వర్తమానాన్ని, భవిష్యత్తును నియంత్రిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందించకపోతే ‘భయపడుతున్నట్లు’, స్పందిస్తే కాంగ్రెస్ చెప్పే ఆరోపణల చర్చ మరింత విస్తరించే వ్యూహాన్ని సెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. అపర రాజకీయ నిపుణడిగా పేరున్న కేసీఆర్, ఈ రెండింటి మధ్య చిక్కుకున్నారా?
కేసీఆర్ ముందున్న మూడు మార్గాలు
కేసీఆర్ ముందు ప్రస్తుతం మూడు ప్రధాన మార్గాలు కనిపిస్తున్నాయి.
ఒకటి నేరుగా ప్రజల్లోకి వెళ్ళడం: కేసీఆర్ రేవంత్ సవాల్ను స్వీకరించి నేరుగా ప్రజల్లోకి వెళ్ళాలి. బహిరంగ సభలు, పర్యటనల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలి. అయితే, దర్యాప్తులో ఉన్న ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం అవినీతి వంటి కేసులు, రాజకీయ, న్యాయపరమైన ఒత్తిళ్లు కేసీఆర్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
రెండు వ్యూహాత్మక ప్రతిస్పందన: రేవంత్ వ్యాఖ్యలకు అదేపనిగా స్పందించకుండా, వ్యూహాత్మక సందర్భాల్లో మాత్రమే కేసీఆర్ మాట్లాడటం అనేది వ్యూహాత్మక స్పందన. ఇది కేసీఆర్ రాజకీయ పరిపక్వతను ప్రదర్శించినప్పటికీ, రేవంత్ రెడ్డి దూకుడైన, పదునైన వ్యాఖ్యల వాతావరణంలో కేసీఆర్ ప్రభావాన్ని తగ్గించే ప్రమాదం కనిపిస్తోంది.
మూడు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ముందుకుతేవడం: కేసీఆర్ తెరవెనుకే ఉంటూ, కేటీఆర్, హరీశ్ రావు వంటి బీఆర్ఎస్ ఇతర నాయకత్వాన్ని రంగంలోకి దింపి పోరాటాలు చేసే పని ఇప్పుడు చేస్తున్నారు. అయితే వారిద్దరి చుట్టూనే మొత్తం బీఆర్ఎస్ నడవడం ప్లస్ కంటే మైనసే ఎక్కువ. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరూ రేవంత్ దూకుడు ముందు నిలువలేకపోతున్నారని ఆ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నారు. ఈ వ్యూహం పార్టీ పునర్నిర్మాణానికి తోడ్పడవచ్చు. కానీ, ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో, దీర్ఘాకాలిక విజయాలకి కేసీఆర్ స్థాయికి సరిపోతారా? అన్న చర్చా గులాబీల్లో గుబులు రేపుతోంది.
ప్రజాభిప్రాయమే కీలకం
ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే అంతిమం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆర్థిక పథకాలు, పాలనలో పారదర్శకత, అభివృద్ధి ప్రజలను ఏ మేరకు సంతృప్తిపరుస్తుందన్నదే రేవంత్ దూకుడుకు బలం, బలహీనత. అదే సమయంలో, బీఆర్ఎస్ పాలనలో సాధించిన సంక్షేమం, మౌలిక వసతులు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలను కేసీఆర్, ఎంత సమర్థంగా నిర్వహిస్తారన్నదే కీలకం.
సారొస్తారా?
కేసీఆర్ పూర్తిగా ప్రజల్లోకి రాకుండా ఉండటం దీర్ఘకాలంలో బీఆర్ఎస్కు తీవ్ర నష్టం చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో మౌనం కూడా ఒక వ్యూహమే అయినా, అజెండాను నిరంతరం ప్రత్యర్థి నియంత్రిస్తున్నప్పుడు ఆ మౌనం ప్రభావాన్ని చూపదు. ఇదే సమయంలో కేసీఆర్, దూకుడుగా రంగంలోకి దిగే బదులు, అంశాల వారీగా, ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టమైన ప్రత్యామ్నాయంతో ప్రజల్లోకి వెళ్ళడం కేసీఆర్ ముందున్న దారి.
నిజానికి రేవంత్ రెడ్డి సవాళ్ళ లక్ష్యం కేసీఆర్ ను రాజకీయ బరిలోకి లాగడమే. కేసీఆర్ దాన్ని ఏ రూపంలో స్వీకరిస్తారు? ఏ విధంగా స్పందిస్తారన్నదే తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రజల్లోకి రావడం అనివార్యమే అయినా, అది భావోద్వేగాలతో కాకుండా వ్యూహాత్మక స్పష్టతతో జరిగితేనే బీఆర్ఎస్కు ప్రయోజనం. ఈ రాజకీయ యుద్ధంలో గెలుపు ఎవరిది అనేది కాదు. ప్రజలకు ఎవరు విశ్వసనీయంగా కనిపిస్తున్నారన్నదే అసలైన ప్రశ్న.

