కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వరంగల్ పోచమ్మ మైదానం కూడలిలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ శ్రేణులు, దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపు చూసి తీవ్ర అన్యాయం చేశారని సారయ్య మండిపడ్డారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అయితే, ఈ నిరసన కార్యక్రమానికి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ పిలుపు పాటించకుండా, వ్యక్తిగత వేడుకలకు ప్రాధాన్యత ఇవ్వడం బాధ్యతారాహిత్యమని సారయ్య విమర్శించారు.

